Telugu Global
Telangana

ఇప్పుడేం చేద్దాం.. బీఆర్ఎస్ సభతో బీజేపీలో వణుకు

ఖమ్మం సభను కేవలం తెలంగాణలో బీఆర్ఎస్ బలంగా చెప్పుకోలేం. నలుగురు సీఎంలు ఒకే వేదికపై కలవడం అంటే మాటలు కాదు. బీజేపీకి ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కూడా నలుగురు ముఖ్యమంత్రుల్ని ఒకే వేదికపై కలిపే సాహసం చేయలేకపోయింది.

ఇప్పుడేం చేద్దాం.. బీఆర్ఎస్ సభతో బీజేపీలో వణుకు
X

బీఆర్ఎస్ సభతో బీజేపీలో వణుకు

జన సమీకరణే సభ విజయానికి గీటురాయి అయితే.. ఖమ్మం సభ చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో విజయవంతమైంది. అధినాయకుల రాక సభ సక్సెస్ కి కారణం అనుకుంటే ఒకే స్టేజ్ పై నలుగురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ సీఎం.. ఇతర కీలక నేతలు కలసి ఉన్న అద్భుత ఘట్టం ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభ అద్భుత విజయాన్ని సూచిస్తోంది. అనుకున్నదానికంటే అద్భుతంగా ఖమ్మం సభ జరిగింది. ఖమ్మం సభ ముందు హైదరాబాద్ లో జరిగిన క్రికెట్ మ్యాచ్ కూడా వెలవెలబోయినట్టే చెప్పాలి.




మేం ఢిల్లీకి, మోదీ ఇంటికి.. అంటూ ఖమ్మం సభలో సీఎం కేసీఆర్ చెబుతుంటూ జనం జయజయ ధ్వానాలు చేశారు. జై కేసీఆర్, జై తెలంగాణ, జై భారత్ నినాదాలతో ఖమ్మం సభా ప్రాంగణం మారుమోగిపోయింది. సభ అనుకున్నట్టుగా సక్సెస్ అయింది, గులాబీ దళం ఫుల్ ఖుషీ. అయితే ఇప్పుడు కాషాయదళంలో కంగారు మొదలైంది. తెలంగాణ సంగతి పక్కనపెడితే, ఢిల్లీ స్థాయిలో ఎంక్వయిరీలు మొదలయ్యాయి. ఖమ్మం సభ ఎందుకంత పెద్ద సక్సెస్ అయింది, తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నా జనం కేసీఆర్ వెంటే ఎందుకు ఉన్నారు. వరుసగా రెండు దఫాలు అధికారంలో ఉన్నా కూడా బీఆర్ఎస్ పై కాస్తయినా వ్యతిరేకత ఎందుకు పెరగలేదనే కోణంలో బీజేపీ ఎంక్వయిరీలు చేస్తోంది.

ఢిల్లీ సీటు కిందకి నీళ్లు..

ఖమ్మం సభను కేవలం తెలంగాణలో బీఆర్ఎస్ బలంగా చెప్పుకోలేం. నలుగురు సీఎంలు ఒకే వేదికపై కలవడం అంటే మాటలు కాదు. బీజేపీకి ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కూడా నలుగురు ముఖ్యమంత్రుల్ని ఒకే వేదికపై కలిపే సాహసం చేయలేకపోయింది. అలాంటిది ఖమ్మంలో తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు ఒకేవేదికపై మాట్లాడటం, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సహా జాతీయ పార్టీల కీలక నేతలు ఖమ్మం సభలో పాల్గొనడంతో జాతీయ మీడియా కూడా ఈ వ్యవహారంపై దృష్టిపెట్టింది. ఖమ్మం బీఆర్ఎస్ సభ జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.


ఖమ్మం సభ జరిగిన వెంటనే కాంగ్రెస్ పై విమర్శలు చేశారంటూ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్లు ఇచ్చారు. కానీ బీజేపీ నుంచి ఒక్క గొంతు కూడా పెగల్లేదు. బండి సంజయ్.. కొడుకు చేసిన రచ్చతో తలదించుకున్నారు. అన్యాయం అంటూ రెచ్చిపోయినా వరుస వీడియోలు బయటపడటంతో సంజయ్ నోటికి ప్లాస్టర్ పడింది. ఇక మిగిలిన నేతలకు విమర్శించేందుకు అవకాశమే లేదు. బీజేపీ జాతీయ నేతలు కూడా బీఆర్ఎస్ సభపై ఇంకా స్పందించకపోవడం విశేషం. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికంటే ఎక్కువగా ఇప్పుడు బీఆర్ఎస్ కూటమి బీజేపీని భయపెడుతోంది. అందుకే ఈ విషయంలో బీజేపీ ఆచితూచి స్పందించాలనుకుంటోంది. బీజేపీ స్పందన ఎలా ఉన్నా అది జాతీయ మీడియాలో హైలెట్ అవుతుంది. అందుకే కాషాయదళం కాస్త కంట్రోల్ గా ఉంది.

First Published:  19 Jan 2023 2:43 AM GMT
Next Story