Telugu Global
Telangana

కేంద్రానికి నిరసన: రాష్ట్ర‌ వ్యాప్తంగా కదం తొక్కిన బీఆరెస్ శ్రేణులు

బీఆరెస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఈ రోజు బీఆరెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు నిరసన ప్రదర్శనలు చేశారు.

కేంద్రానికి నిరసన: రాష్ట్ర‌ వ్యాప్తంగా కదం తొక్కిన బీఆరెస్ శ్రేణులు
X

ధాన్యం కల్లాల నిర్మాణం కోసం ఉపయోగించిన ఉపాధి హామీ(MGNREGA )నిధులను వెనకి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆరెస్ శ్రేణులు కదం తొక్కాయి. కే‍ద్ర బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినదించారు.

బీఆరెస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఈ రోజు బీఆరెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు నిరసన ప్రదర్శనలు చేశారు.

ఖమ్మం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, వరంగల్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, సూర్యాపేట, మహబూబ్ నగర్, వనపర్తి, ములుగు, కుమ్రం భీం ఆసిఫాబాద్ తో సహా అనేక ప్రాంతాల్లో ఉదయం నుంచే బీఆరెస్ శ్రేణులు ప్రదర్శనలు చేపట్టారు.

ఖమ్మం పట్టణంలోని ధర్నా చౌక్ వద్ద, కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ తీరును నిరసిస్తూ ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌ రాజ్‌, ఎమ్మెల్యే రాములు నాయక్‌ నేతృత్వంలో నిరసన కార్యక్రమం కొనసాగుతోంది.

నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన మహాధర్నాకు బీఆరెస్ కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి, రవీంద్రనాయక్‌, భాస్కర్‌ రావు, జెడ్పీ చైర్మన్‌ బండ నరేందర్‌ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.

మెదక్ జిల్లా మహాధర్నాలో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

సూర్యాపేట పట్టణంలో జరిగిన మహాధర్నాలో ఎంపీ లింగయ్య యాదవ్, జెడ్పీ చైర్‌పర్సన్ దీపికా, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ , సైదిరెడ్డి, మల్లయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు రాజక్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

నిజామబాద్‌ ధర్నాచౌక్‌లో ఎమ్మెల్యేలు గణేశ్‌ గుప్తా, జీవన్‌రెడ్డి అద్వర్యంలో జరిగిన ధర్నాకు రైతులు భారీగా తరలి వచ్చారు.

యాదాద్రి భువనగిరిలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో పార్టీ నాయకులు, రైతులు భారీగా పాల్గొన్నారు.

ఈ మహా ధర్నాల్లో కేంద్ర బీజేపీ సర్కార్ కు వ్యతిరేకంగా, ఆ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా నినాదాలు చేశారు. అనేక రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం నిధులతో చేపల కోసం కల్లాలు నిర్మించడానికి అనుమతించిన కేంద్రం, రైతులు ధాన్యాన్ని ఆరబెట్టడానికి కల్లాలను అనుమతించకపోవడం రైతుల పట్ల బీజేపీకున్న వివక్ష‌ను తెలియజేస్తోందని బీఆరెస్ నాయకులు మండిపడ్డారు.

First Published:  23 Dec 2022 8:58 AM GMT
Next Story