Telugu Global
Telangana

భారీ వర్షాలను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలి : మంత్రి కేటీఆర్

ప్రస్తుతం భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ నగర పరిధిలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

భారీ వర్షాలను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలి : మంత్రి కేటీఆర్
X

భారీ వర్షాలను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలి : మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో వర్షాలు ఉధృతమవుతుండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షాలు కురిసినా.. ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నానక్‌రామ్‌గూడలోని హెచ్‌జీసీఎల్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రస్తుతం భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ నగర పరిధిలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడటమే ప్రథమ కర్తవ్యంగా పని చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. రానున్న మూడు రోజుల పాటు నగరంలో భారీ వర్షలు కురిసే అవకాశం ఉన్నందున జీహెచ్ఎంసీ అధికారులు ఇతర సంస్థలతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు.

జలమండలి, విద్యుత్ శాఖ, రెవెన్యూ యంత్రాంగం, ట్రాఫిక్ పోలీస్ విభాగాలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ.. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి సర్వసన్నద్దంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని నగరంలోని లోతట్టు ప్రాంతాలు, ముంపుకు గురయ్యే ప్రధాన రహదారుల వంటి చోట్ల డీవాటరింగ్ పంపుల ఏర్పాటు, సిబ్బంది మోహరింపు వంటి ప్రాథమిక చర్యలను ఇప్పటికే పూర్తి చేసినట్లు మంత్రికి అధికారులు వివరించారు. జీహెచ్ఎంసీ చేపట్టిన ఎస్ఎన్‌డీపీ కార్యక్రమంలో భాగంగా నాలాలను బలోపేతం చేయడం వల్ల వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ సారి ఇబ్బందులు తగ్గుతాయని వారు తెలిపారు.

హైదరాబాద్ పరిధిలోని పారిశుథ్య నిర్వహణకు సంబంధించి కూడా ఈ సమావేశంలో సూదీర్ఘంగా చర్చించారు. నగరంలో పారిశుథ్య నిర్వహణ గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఎంతో ప్రభావవంతమైన ఫలితాలను ఇస్తున్నదని.. అయితే వీటితోనే సంతృప్తి చెందకుండా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ ఆదేశించారు.

హైదరాబాద్ నగరం వేగంగా విస్తరించడం, జనాభా పెరగడం వంటి అంశాల వల్ల నగరంలో చెత్త ఉత్పత్తి పెరుగుతోందని.. ఈ మేరకు పారిశుథ్య నిర్వహణ ప్రణాళికలను సైతం ఎప్పటికప్పుడు నిర్దేశించుకుంటూ ముందుకు వెళ్లాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా తక్షణ, స్వల్పకాలిక పారిశుథ్య ప్రణాళికలను మంత్రి కేటీఆర్‌కు అధికారులు వివరించారు. పారిశుథ్య నిర్వహణలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని, ఇదే అత్యంత ప్రాధాన్యత అంశంగా గుర్తించి.. ఆ దిశగా పనిచేయాలని అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డో రోస్, జోనల్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

First Published:  19 July 2023 11:55 AM GMT
Next Story