Telugu Global
Telangana

రాజకీయాల కోసం బతికున్న మనుషులను చంపేసిన బండి సంజయ్!

తమ‌ రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ నేతలు ఏ పనులైనా చేస్తారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా అలాంటి పనే చేసి అభాసుపాలయ్యారు. బతికున్న మనుషులను చనిపోయారని అబద్దాలు చెప్పి నెటిజనులతో మొట్టికాయలు వేయించుకున్నారు.

రాజకీయాల కోసం బతికున్న మనుషులను చంపేసిన బండి సంజయ్!
X

మెదక్ జిల్లాలో జరిగిన ఓ సంఘటనను ఆధారంగా చేసుకొని రాష్ట్రప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనుకున్న తెలంగాణ‌ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్లాన్ తిరగబడింది. చివరకు ఆయనే తప్పు ఒప్పుకోవాల్సి వచ్చింది.

మెదక్ జిల్లాలో శ్రీశైలం అనే రైతు తన భూమిని ఫారెస్ట్‌ అధికారులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి పురుగుల మందు తాగాడు. అయితే అతన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించడంతో ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. అంతే కాకుండా శ్రీశైలం కుటుంబానికి భూమి లేదని, మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామంలోని అటవీప్రాంతంలో కొంత కాలంగా వ్యవసాయం చేసుకుంటున్నారని స్థానికులు తెలిపారు.కుటుంబం వద్ద ఎటువంటి పత్రాలు లేవు . శ్రీశైలం కూడా తన వీడియోలో అదే విషయాన్ని ధృవీకరించాడు.

అయితే ఈ సంఘటనను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని రంగంలోకి దిగారు బండి సంజయ్. వెంటనే శ్రీశైలం వీడియోను పోస్ట్ చేసి. శ్రీశైలం ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని ఆయన మరణ వార్తవిని అతని తల్లి కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని ట్వీట్ చేశారు. వీళ్ళ మరణానికి రాష్ట్రప్రభుత్వమే కారణమని మండిపడ్డారు.

కాగా బండి సంజయ్ ట్వీట్ కు నెటిజన్ ల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పూర్తిగా వివరాలు తెలుసుకోకుండానే అబద్దాలు ప్రచారం చేస్తున్నారంటూ ట్వీట్టర్ లో నెటిజనులు బండి సంజయ్ పై విరుచుకపడ్డారు. దాంతో మేలుకున్న సంజయ్ రెండు గంటల తర్వాత శ్రీశైలం చనిపోలేదని, అసలు అతని తల్లి ఆత్మహత్యకు ప్రయత్నించలేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు ఏదైనా విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడకూడదని నెటిజనులు బండి సంజయ్ కి హితవుపలుకుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న కోపాన్ని ప్రజలపై తీర్చుకోవద్దని, వీలయితే శ్రీశైలం కుటు౦బానికి చట్టబద్దంగా భూమి ఇప్పించే ప్రయత్నం చేయాలని నెటిజనులు కోరుతున్నారు.

First Published:  8 Aug 2022 7:47 AM GMT
Next Story