Telugu Global
Telangana

నా భార్యను చంపేస్తామన్నారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

ప్రచారం కోసం తాను ఎక్కడికెళ్లినా కరెంట్ కట్ చేస్తున్నారని మండిపడ్డారు బండి సంజయ్. తనను అసెంబ్లీకి రానివ్వకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

నా భార్యను చంపేస్తామన్నారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
X

ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతుండే సరికి.. బీజేపీ, కాంగ్రెస్ నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ హైలైట్ అవుతున్నారు. కోస్గి సభలో కొడంగల్ కి గొడ్డళ్లు తీసుకొస్తున్నారనే వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి కలకలం రేపగా.. కరీంనగర్ సభలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో మీటింగ్‌ పెడితే తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించారన్నారు. తన భార్యను చంపేస్తామన్నారని, ఎన్ని బెదిరింపులు వచ్చినా తాను భయపడేది లేదని స్పష్టం చేశారు. చావుకు తాను భయపడబోనని, చావే తనను చూసి భయపడుతుందన్నారు సంజయ్.


నాపై ఎందుకీ కక్ష..

ప్రచారం కోసం తాను ఎక్కడికెళ్లినా కరెంట్ కట్ చేస్తున్నారని మండిపడ్డారు బండి సంజయ్. మరో 15 రోజుల్లో బీఆర్ఎస్ పవర్ కట్ అవుతుందని జోస్యం చెప్పారు. కరీంనగర్ లోని పలు కాలనీల్లో ప్రచారం చేసిన బండి సంజయ్.. తనను అసెంబ్లీకి రానివ్వకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తాను పేదల కోసం కొట్లాడుతున్నానని అధికార పార్టీకి భయం పట్టుకుందన్నారు. ఎంపీగా తాను కేంద్రం నిధులు తీసుకొస్తే కొబ్బరికాయలు కొట్టి ఫోజులు కొడుతున్న మంత్రి గంగులకు గుణపాఠం చెప్పాలన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలది భూ కబ్జాలు, అవినీతి లొల్లి అని ఆరోపించారు బండి సంజయ్. ఇంటి ముందు ఇసుక కుప్పలు కనిపిస్తే డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఖాళీగా ఉన్న జాగాలు కబ్జాలు చేస్తున్నారని విమర్శించారు. యువత ఉద్యోగాల కోసం తాను ప్రభుత్వంపై కొట్లాడి.. జైలుకు పోయానన్నారు బండి. ఆరోపణల సంగతి పక్కనపెడితే.. తనను, తన భార్యను చంపేస్తానంటూ వచ్చిన బెదిరింపుల గురించి, బండి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఇలా బహిరంగ వేదికలపై చర్చ పెట్టడమే సంచలనంగా మారింది.

First Published:  15 Nov 2023 3:12 AM GMT
Next Story