Telugu Global
Telangana

'బలత్కార్ జస్టిఫికేషన్ పార్టీ'... రేపిస్టులతో బీజేపీ నేతలు వేదికపంచుకోవడంపై కేటీఆర్ సెటైర్

బీజేపీని బాలత్కర్ జస్టిఫికేషన్ పార్టీ అని కేటీఆర్ అభివర్ణించారు. హంతకులు, రేపిస్టులతో బీజేపీ నాయకులు వేదికలు పంచుకోవడం ఆ పార్టీ విధానాలను తెలియజేస్తున్నదని విమర్శించారు.

బలత్కార్ జస్టిఫికేషన్ పార్టీ...  రేపిస్టులతో బీజేపీ నేతలు వేదికపంచుకోవడంపై కేటీఆర్ సెటైర్
X

బీజేపీ అంటే బలత్కార్ జస్టిఫికేషన్ పార్టీ అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

గుజరాత్ లో బిల్కిస్ బానో పై అత్యాచారం, 14 మంది ఆమె బంధువులను హత్య చేసిన కేసులో దోషులుగా నిర్దారితమై జైలు శిక్ష పడిన నేరస్తులను గుజరాత్ బీజేపి ప్రభుత్వం జైలు నుండి విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే దోషుల్లో ఒకరైన శైలేష్ చిమన్ లాల్ భట్, బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి ఓ అధికారిక కార్యక్రమంలో వేదిక పంచుకోవడం విమర్శలకు దారితీసింది.

వారు జైలు నుంచి విడుదలైన సమయంలోనే స్వాగత సత్కారాలు చేసిన బీజేపీ నాయకులు ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో వేదికలమీదనే కూర్చోపెడుతున్నారు.

మార్చి 25, శనివారం, గుజరాత్‌లోని దాహోద్ లో గ్రూప్ వాటర్ సప్లై స్కీమ్ ను ప్రారంభించిన కార్యక్రమంలో వేదికపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపి, జస్వంత్‌సిన్హ్ భాభోర్, ఎమ్మెల్యే శైలేష్‌భాయ్ భభోర్ లతో పాటు బిల్కిస్ బానో అత్యాచారం, 14 మంది ఆమె బంధువులను హత్య చేసిన కేసులో దోషి అయిన శైలేష్ భట్ కూడా ఉన్నారు. వీరందరూ కలిసి ఫోజులిచ్చిన ఫోటోలను ఎంపీ జస్వంత్‌సిన్హ్, ఎమ్మెల్యే శైలేష్‌భాయ్ భభోర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

ఈ ఫోటోను వై సతీష్ రెడ్డి అనే నెటిజన్ ట్విట్టర్ లో షేర్ చేయగా ఆయన ట్వీట్ ను రీ ట్వీట్ చేసిన కేటీఆర్, బీజేపీని బాలత్కర్ జస్టిఫికేషన్ పార్టీ అని అభివర్ణించారు. హంతకులు, రేపిస్టులతో బీజేపీ నాయకులు వేదికలు పంచుకోవడం ఆ పార్టీ విధానాలను తెలియజేస్తున్నదని విమర్శించారు.

First Published:  27 March 2023 7:38 AM GMT
Next Story