Telugu Global
Telangana

పోలీసుల సాంకేతిక తప్పులతో రాజాసింగ్ కు బెయిల్

పోలీసులు చేసిన సాంకేతికపరమైన పొరపాట్ల వల్ల ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్ లభించింది. మహ్మద్ ప్రవక్తపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ఇవ్వాళ్ళ ఆయనను అరెస్టు చేశారు.

పోలీసుల సాంకేతిక తప్పులతో రాజాసింగ్ కు బెయిల్
X

మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు మంగళ్ హాట్ పోలీసులు రాజా సింగ్ ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపర్చగా నాంపల్లి 14వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు.

అనంతరం రాజా సింగ్ తరపు లాయర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా, ఏడు సంవత్సరాల కన్నా తక్కువ శిక్షలు పడే కేసుల్లో ఓ వ్య‌క్తిని అరెస్ట్ చేయాలంటే 41ఏ సీఆర్పీసీ సెక్ష‌న్ కింద ముందుగా నోటీసులు ఇవ్వాలన్న సుప్రీం కోర్టు రూలింగ్ ను పోలీసులు ఉల్లంఘించారని రాజాసింగ్ తరపు లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సంద‌ర్భంగా ఇటు ప్ర‌భుత్వ లాయ‌ర్లు, అటు రాజా సింగ్ లాయ‌ర్ల మ‌ధ్య దాదాపుగా గంట‌ పాటు తీవ్ర స్థాయిలో వాదోప‌వాదాలు కొన‌సాగాయి.

ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న న్యాయ‌మూర్తి... రాజా సింగ్ లాయర్ వాదనలతో ఏకీభవించారు. పోలీసులు 41ఏ సీఆర్పీసీ సెక్ష‌న్ కింద నోటీసులు ఇవ్వకుండానే రాజా సింగ్ ను అరెస్టు చేయడాన్ని న్యాయమూర్తి త‌ప్పుబట్టారు. రాజా సింగ్ కు బెయిల్ మంజూరు చేస్తూ విచారణలో పోలీసు అధికారులకు సహకరించాలని ఆదేశించారు.

First Published:  23 Aug 2022 3:11 PM GMT
Next Story