Telugu Global
Telangana

హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని అవుతారు..

హిందూ, సిక్కు, క్రిస్టియన్ విద్యార్థినులను వారి వారి మతపరమైన సంకేతాలతో విద్యా సంస్థల్లోకి ప్రవేశించడానికి అనుమతించినప్పుడు, ఒక ముస్లిం విద్యార్థిని హిజాబ్ ధరించి వచ్చిందని ఎలా ఆపేస్తారని నిలదీశారు అసదుద్దీన్ ఒవైసీ.

హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని అవుతారు..
X

భారత్ లో హిజాబ్ వివాదం ఇంకా సమసిపోలేదు. సుప్రీంకోర్టు తీర్పు కూడా ఎటూ తేల్చకపోవడంతో మరోసారి దీనిపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎవరు ఏం చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. భారత్ లో ఏదో ఒక రోజు హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారని చెప్పారు ఒవైసీ. తన జీవిత కాలంలో అది జరగకపోయినా భవిష్యత్తులో ఏదో ఒక రోజు హిజాబ్ ధరించిన ముస్లిం మహిళ భారత ప్రధాని అవుతారని, అది తన కల అని అన్నారు.

ముస్లింలను తక్కువచేసి చూడటమే..

హిందూ, సిక్కు, క్రిస్టియన్ విద్యార్థినులను వారి వారి మతపరమైన సంకేతాలతో విద్యా సంస్థల్లోకి ప్రవేశించడానికి అనుమతించినప్పుడు, ఒక ముస్లిం విద్యార్థిని హిజాబ్ ధరించి వచ్చిందని ఎలా ఆపేస్తారని నిలదీశారు అసదుద్దీన్ ఒవైసీ. ఇలా చేయడం వల్ల మిగతా మతాల పిల్లలు, ముస్లింలు తమ కంటే తక్కువవారు అని భావించే ప్రమాదం ఉందని చెప్పారు. హిజాబ్ ధరించడం వల్ల ముస్లిం మహిళలు తమ తోటి వారి కంటే ఏమాత్రం తక్కువ కాదని చెప్పారు.

ముస్లిం అమ్మాయిలను బెదిరిస్తారా.. ?

ముస్లిం అమ్మాయిలు తలలు కప్పుకోవడం అంటే, వారి మనసులను కప్పుకోవడమే అని వారిని బెదిరిస్తున్నారని మండిపడ్డారు అసదుద్దీన్ ఒవైసీ. ఈరోజుల్లో అలా భయపడేవారు ఎవరూ లేరన్నారు. ప్రాథమిక హక్కులు పాఠశాల గేటు దగ్గరే నిలిచిపోతాయా అని ప్రశ్నించారు. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం ముస్లిం బాలికలకు తమక నచ్చిన విధంగా దస్తులు ధరించే హక్కు ఉందన్నారు అసదుద్దీన్ ఒవైసీ.

First Published:  15 Oct 2022 2:57 AM GMT
Next Story