Telugu Global
Telangana

బీజేపీ అధిష్టానంలో ఆందోళన.. కర్ణాటకలో ఓడితే తెలంగాణపై ఆశలు గల్లంతే!

ఆరు నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకలో బీజేపీకి ప్రతికూల ఫలితాలు వస్తే.. అది తప్పకుండా తెలంగాణలో ప్రభావం చూపిస్తుందని పార్టీ అధిష్టానం భావిస్తోంది.

బీజేపీ అధిష్టానంలో ఆందోళన.. కర్ణాటకలో ఓడితే తెలంగాణపై ఆశలు గల్లంతే!
X

బీజేపీ అధిష్టానంలో అందోళన మొదలైంది. కర్ణాటక ఎన్నికలు సంబంధించి దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయమని ఫలితాలు వెల్లడంచండతో.. పార్టీ అగ్రనాయత్వం అప్పుడే ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నది. దక్షిణాదిలో బీజేపీ బలంగా ఉందని భావిస్తున్న కర్ణాటకలో ఓటమి పాలైతే.. అది తప్పకుండా రాబోయే తెలంగాణ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తోంది. ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్న బీజేపీకి.. కర్ణాటక ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

మరో ఆరు నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకలో బీజేపీకి ప్రతికూల ఫలితాలు వస్తే.. అది తప్పకుండా తెలంగాణలో ప్రభావం చూపిస్తుందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో విభేదాల కారణంగా పార్టీ ప్రజల్లోకి దూసుకొని వెళ్లలేక పోతున్నది. మరో వైపు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబెట్టడానికి సరైన అభ్యర్థులు కూడా దొరకక సతమతమవుతోంది. ఇతర పార్టీల నుంచి చేరికలు కూడా పెద్దగా ఏమీ లేవు. కర్ణాటకలో బీజేపీ తిరిగి అధికారం చేపడితే.. ఆ ఫలితాలను చూపించి తెలంగాణలో ఇతర పార్టీ నాయకులను గుంజేయాలని వ్యూహం సిద్ధం చేసింది. అంతే కాకుండా.. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని ప్రచారం కూడా చేసుకోవాలని భావించింది.

కానీ, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూసి అధిష్టానం ఆందోళన చెందుతుంది. బీజేపీ కర్ణాటకలో అధికారం కోల్పోతే.. తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌లా రాజకీయం మారిపోతుందని అంచనా వేస్తుంది. అదే జరిగితే వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాది నుంచి భారీగా లోక్‌సభ సీట్లు గెలవాలన్న అంచనాలు కూడా తలక్రిందులు అవుతాయని ఆందోళన చెందుతున్నది.

2014, 2019లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఉత్తరాది రాష్ట్రాల్లో సాధించిన ఫలితాలే కారణం. అయితే 2024లో మునుపటిలా భారీ సీట్లు గెలవడం కష్టమని పలు సర్వేల ద్వారా బీజేపీ తెలుసుకున్నది. దీంతో అక్కడ తగ్గే సీట్లను దక్షిణాది రాష్ట్రాల్లో కవర్ చేసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే పలు మార్లు హైదరాబాద్ వేదికగా దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించింది. కర్ణాటక, తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బీజేపీకి లోక్‌సభ సీట్లు మునుపటి కంటే ఎక్కువగా రావల్సిన ఆవశ్యకతను అప్పుడే వివరించారు.

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కనుక బీజేపీ ఒంటరిగా మెజార్టీ సాధించకపోతే.. మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వస్తుంది. ఇప్పటి వరకు పార్టీకి పూర్తి మెజార్టీ ఉండటంతో మిత్రపక్షాలు పెద్దగా డిమాండ్లు పెట్టలేదు. ఎన్టీయే కూటమిలోని మిగిలిన పార్టీల బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. ఇక బీజేపీకి కొత్త తలనొప్పులు తప్పవని అధిష్టానం భావిస్తోంది. అందుకే దక్షిణాదిని టార్గెట్ చేసుకున్నది. కానీ, ఇప్పుడు కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ బీజేపీలో ఆందోళనను కలిగిసతోంది. అయితే, ఎగ్జిట్ ఫలితాలు ఎలా ఉన్నా.. కర్ణాటకలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా మరి కొన్ని గంటల్లో కర్ణాటకలో ఎవరిది అధికారమో తెలిసిపోతుంది.

First Published:  12 May 2023 9:18 AM GMT
Next Story