Telugu Global
Telangana

జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా సమావేశం ?

బీజేపీ అగ్రనేత అమిత్ షా టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తో ఇవ్వాళ్ళ సమావేశం అవుతున్నట్టు సమాచారం. మునుగోడు సభ అనంతరం వీళ్ళిద్దరు హైదరాబాద్ లో కలవబోతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా సమావేశం ?
X

మునుగోడు సభలో పాల్గొనేందుకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆదివారం హైదరాబాద్ వస్తున్న సందర్భంగా సర్ ప్రైజ్ న్యూస్!. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తో ఆయన సమావేశం కానున్నారని సమాచారం. షా ఆహ్వానం మేరకు ఆయనతో 15 నిముషాలు ఎన్టీఆర్ సమావేశమవుతారని తెలుస్తోంది. అమిత్ షా కార్యాలయం నుంచి అందిన ఆహ్వానం మేరకు ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. తారక్ నటించిన త్రిపులార్ సినిమాను ఇటీవలే చూసిన అమిత్ షా... ఆయన నటనకు మెచ్చి ఈ ఆహ్వానం పంపినట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.

మునుగోడు సభ ముహుర్తాన్ని సరైనదిగా ఎంచుకున్న అమిత్ షా.. తన రాజకీయ వ్యూహంలో భాగంగానే.. ఎన్టీఆర్ తో సమావేశ‌ కార్యక్రమాన్ని నిర్దేశించుకున్నట్టు కనబడుతోంది. రాజకీయాలకు దూరంగా ఉంటూ తన సినిమాలేవో తాను చేసుకుంటున్న ఎన్టీఆర్ కి ఈ సమయంలో స్నేహ హస్తం చాచిన పక్షంలో అది తెలంగాణాలో తమ పార్టీకి కలిసి రావచ్చన్నది బహుశా ఆయన ప్లాన్ ! ఒకప్పుడు టీడీపీ రాజకీయాల్లో మెరుపులు మెరిపించిన ఈ నటుడికి ఇటు తెలంగాణాలో, అటు ఏపీలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. దీన్ని తమ పార్టీ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటే తెలుగు రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగిరినా ఎగరవచ్చని బీజేపీ వర్గాల భావన. తారక్ స్పందనను బట్టి షా ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానించినా ఆహ్వానించవచ్చునన్న ఊహాగానాలు కూడా అప్పుడే బయలుదేరాయి.

అయితే వీళ్ళిద్దరు ఎక్కడ కలుస్తున్నారనే విషయంలో ఇప్పటి దాకా స్పష్టత లేదు. రామోజీ ఫిలింసిటీలో కలుస్తారా లేక శంషాబాద్ ఎయిర్ పోర్టుకు దగ్గర్లో ఉన్న నోవాటల్ హోటల్ లో కలుస్తారా అన్నది తెలియాల్సి ఉన్నది.

First Published:  21 Aug 2022 8:00 AM GMT
Next Story