Telugu Global
Telangana

తెలంగాణ‌పై అమిత్ షా ప‌గ‌టి క‌ల‌లు..!

టైమ్స్ నౌ నిర్వ‌హించిన 2022 స‌మ్మిట్ లో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్న‌ది తామేన‌ని ధీమాగా చెప్పారు. తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోతుంద‌ని అన్నారు.

తెలంగాణ‌పై అమిత్ షా ప‌గ‌టి క‌ల‌లు..!
X

తెలంగాణ పై బిజెపి భ్రాంతి వీడ‌డం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావ‌డం త‌థ్య‌మ‌నే భ్ర‌మ‌ల్లోనే ఉన్నట్టు ఆ పార్టీ అగ్ర‌నాయ‌కుల మాట‌లు ద్వారా తెలుస్తోంది. తెలంగాణ ప్ర‌జ‌లు బిజెపిని కోరుకుంటున్నారంటూ ప్ర‌క‌ట‌న‌ల‌తో గంద‌ర‌గోళం క‌ల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బిజెపి నేత‌లంతా ప‌గ‌టి క‌ల‌లు కంటున్నారు.

టైమ్స్ నౌ నిర్వ‌హించిన 2022 స‌మ్మిట్ లో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్న‌ది తామేన‌ని ధీమాగా చెప్పారు. తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోతుంద‌ని అన్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల నాడి త‌న‌కు తెలుసున‌ని, తాను తప్పకుండా ఆ రాష్ట్రానికి వెళ్తానని అమిత్ షా చెప్పారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశంలో మరోసారి ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కూడా ధీమా వ్యక్తం చేశారు.

ఇప్ప‌టికే బిజెపి తెలంగాణ రాష్ట్రంపై ఫోక‌స్ పెట్టింది. ఈ క్ర‌మంలోనే టిఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టేందుకు కూడా ప్ర‌య‌త్నించింది. పాం హౌస్ లో టిఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసేందుకు బేర‌సారాలు జ‌ర‌పుతూ అడ్డంగా దొరికిపోయింది. ప్ర‌స్తుతం ఈ కుట్ర‌లో పాల్గొన్న మ‌ద్య‌వ‌ర్తులు కేసులు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. అలాగే ఇత‌ర పార్టీలను బ‌ల‌హీన‌ప‌రుస్తూ ఆయా పార్టీల నేత‌ల‌ను కూడా బిజెపిలోకి చేర్చుకుంటోంది. దీనిలో భాగంగానే తాజాగా కాంగ్రెస్ నేత మ‌ర్రి శ‌శిధ‌ర రెడ్డిని పార్టీలో చేర్చుకుంది. అంత‌కు ముందే ముగ‌నుగోడు ఎమ్మెల్యే రాజ‌గోపాల‌రెడ్డిని ప్ర‌లోభ ప‌రిచి కాంగ్రెస్ కు రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకున్న విష‌యం తెలిసిందే.

కాగా ఇప్ప‌టికే టిఆర్ఎస్, బిజెపిల మ‌ద్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. ఫాం హౌంస్ లో టిఆర్ ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారం బెడిసికొట్టిన‌ప్ప‌టినుంచి బిజెపి ప్ర‌తీకారేచ్ఛ‌తో ర‌గిలిపోతున్న‌ట్టు క‌న‌బ‌డుతోంది. రాష్ట్ర నేత‌ల‌పై ఈడీ, సిబిఐ సంస్థ‌ల‌తో దాడులు చేయిస్తూ భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తోంది. దీనికి ప్ర‌తిగా తెలంగాణ ప్రభుత్వం కూడా బిజెపిని దీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహాలు ర‌చిస్తోంది.

ద‌ర్యాప్తు సంస్థ‌ల దాడుల‌పై టిఆర్ఎస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. మ‌రోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారం కేసులో బిజెపి సంస్థాగ‌త వ్య‌వ‌హారాల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బిఎల్ సంతోష్ కు విచార‌ణకు హాజ‌రుకావ‌ల్సిందిగా ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (సిట్‌) నోటీసులు పంపించింది. దీనిపై బిజెపి తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తోంది. అయితే కోర్టు ప్ర‌స్తుతం ఆ నోటీసుల‌పై స్టే విధించింది. అయిన‌ప్ప‌టికీ ఈ నోటీసుల విష‌యాన్ని బిజెపి తీవ్రంగా ప‌రిగ‌ణిస్తూ టిఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

First Published:  26 Nov 2022 9:08 AM GMT
Next Story