Telugu Global
Telangana

కూతురిపై తండ్రి అత్యాచారం.. ప్రేమించిన వ్యక్తి కోసం వెళ్తే మరో యువకుడి లైంగిక దాడి

భార్య ఇంట్లో లేని సమయంలో తండ్రి కుమార్తెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికీ చెప్పవద్దంటూ బెదిరించాడు. విషయాన్ని యువతి తల్లికి వివరించినా ఆమె పట్టించుకోలేదు.

కూతురిపై తండ్రి అత్యాచారం.. ప్రేమించిన వ్యక్తి కోసం వెళ్తే మరో యువకుడి లైంగిక దాడి
X

సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కామాంధులు వావివరుసలు కూడా చూడటం లేదు. కన్న కూతుర్లపై కూడా అత్యాచారానికి ఒడిగడుతున్న ఘటనలు ఇటీవల వరుసగా జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో కన్న కూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ యువతి ప్రేమించిన వ్యక్తి కోసం వెళ్ళిన సమయంలో మరో యువకుడిని నమ్మి లైంగిక దాడికి గురైంది.

బిహార్ కు చెందిన ఓ కుటుంబం హైదరాబాద్‌కు వలస వచ్చి కుత్బుల్లాపూర్‌లో నివాసం ఉంటోంది. వారికి ముగ్గురు పిల్లలు. కుమార్తె (18) తొమ్మిదవ తరగతి వరకు చదివింది. కరోనా సమయంలో బాలికను చదువు మాన్పించారు. అప్పటినుంచి ఆ యువతి ఇంటి వద్దే ఉంటోంది.

భార్య ఇంట్లో లేని సమయంలో తండ్రి కుమార్తెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికీ చెప్పవద్దంటూ బెదిరించాడు. విషయాన్ని యువతి తల్లికి వివరించినా ఆమె పట్టించుకోలేదు. కాగా, గతేడాది దీపావళి సమయంలో యువతి సొంత రాష్ట్రం బిహార్‌కు వెళ్ళింది. తిరిగి ఆమె హైదరాబాద్‌కు వచ్చే సమయంలో రైల్‌లో అదే రాష్ట్రానికి చెందిన సంతోష్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. అతడు హైదరాబాద్‌లోని బడంగ్ పేట గాంధీ నగర్‌లో ఉంటున్నాడు.

వీరిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. వీరి పరిచయం ప్రేమగా మారింది. గత నెల 26వ తేదీన సంతోష్ కలవాలని కోరడంతో యువతి సికింద్రాబాద్ కు వచ్చింది. ఇద్దరూ రోజంతా పలు ప్రాంతాల్లో తిరిగారు. ఆ తర్వాత రాత్రి సంతోష్ ఆమెను కుత్బుల్లాపూర్‌లో ఇంటి వద్ద వదిలి వెళ్ళాడు.

అయితే ఆ యువతి ఇంటికి వెళ్లలేదు. ఇంటికి వెళితే చెప్పకుండా బయటకు వెళ్ళినందుకు తల్లిదండ్రులు కోప్పడతారని భయపడింది. అక్కడి నుంచి సికింద్రాబాద్ స్టేషన్ కు వెళ్ళింది. అక్కడ రవి అనే వ్యక్తి మొబైల్ ఫోన్ తీసుకొని సంతోష్ కు ఫోన్ చేసింది. రవి సాయంతో సంతోష్ గదికి వెళ్ళింది. ఆ రాత్రి గడిచిన తర్వాత సంతోష్ యువతిని ఆమె ఇంటికి వెళ్లాలని సూచించాడు. సంతోష్ గది నుంచి బయటకు వచ్చిన యువతి తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని రవిని కోరింది. అతడు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అమీన్ పూర్ లోని తన గదికి తీసుకువెళ్లాడు.

ఈనెల 29న మద్యం మత్తులో ఇంటికి వచ్చిన రవి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతడి నుంచి తప్పించుకున్న యువతి సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుంది. తల్లిదండ్రులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి యువతిని తీసుకెళ్లారు. తాజాగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు వెళ్లిన యువతి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని రవిపై ఫిర్యాదు చేసింది. అలాగే తన తండ్రి కూడా తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది. పోలీసులు యువతి తండ్రితో పాటు రవిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  5 Jan 2024 11:19 AM GMT
Next Story