Telugu Global
Telangana

ఈనెల 22 నుంచి తెలంగాణ‌లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల‌ బృందం పర్యటన

సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ నేతృత్వంలో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్స్, సీనియర్ అధికారులు రాష్ట్రానికి వస్తారని వెల్లడించారు.

ఈనెల 22 నుంచి తెలంగాణ‌లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల‌ బృందం పర్యటన
X

తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ముఖ్య అధికారి వికాస్ రాజ్ డీజీపీ అంజనీ కుమార్, ఇతర పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికల సంసిద్ధతను అంచనా వేయడం, రాబోయే ఎన్నికల్లోని ప్రాధాన్యతాంశాల గురించి చర్చించారు. ఈనెల 22 నుంచి 24 వరకు భారత ఎన్నికల కమిషన్ ప్రతినిధుల‌ బృందం రాష్ట్రంలో పర్యటిస్తుందని వికాస్ రాజ్ తెలిపారు. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ నేతృత్వంలో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్స్, సీనియర్ అధికారులు రాష్ట్రానికి వస్తారని వెల్లడించారు. రాబోయే ఎన్నికల సంసిద్ధత గురించి అంచనా వేస్తారని తెలిపారు.



పర్యటనలో భాగంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతినిధుల‌ బృందం.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇన్‌కమ్ ట్యాక్స్ , ఎన్సీబీ, ఎక్సైజ్ డిపార్ట్ మెంట్, స్టేట్ జీఎస్టీ, సీజీఎస్టీ, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, రాష్ట్ర స్థాయి బ్యాకర్స్ కమిటీ, డీఆర్ఐ, ఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, కమర్షియల్ ట్యాక్స్ , ఇతర ఎన్నికల నిర్వహణ సంస్థలతో విస్తృతంగా చర్చిస్తుందని వికాస్ రాజ్ చెప్పారు. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడే లక్ష్యంతో రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అందరితో చర్చిస్తారన్నారు.



ఈ సమావేశంలో డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలో జిల్లా పోలీసు అధికారుల పాత్ర కీలకంగా ఉందన్నారు. సరిపోయినంత సిబ్బంది, బోర్డర్ చెక్ పోస్టులను గుర్తించడం వంటివి ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీ సంజయ్ జైన్, స్పెషల్ పోలీస్ నోడల్ ఆఫీసర్ స్వాతి లక్రా, అడిషనల్ డీజీ షా నవాజ్ ఖాన్, ఐజీ సన్ ప్రీత్ సింగ్, ఎన్నికల ముఖ్యాధికారి కార్యాలయం అధికారులు పాల్గొన్నారు.

First Published:  14 Jun 2023 3:42 PM GMT
Next Story