Telugu Global
Telangana

హైదరాబాద్‌లో చెత్త నుంచి పవర్ ఉత్పత్తి చేసే 5 ప్లాంట్లు ఏర్పాటు

దుండిగల్‌లో 14.5 మెగావాట్ల సామర్థ్యంతో తొలి వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్ ఈ ఏడాది మార్చి నాటికి కార్యకలాపాలు ప్రారంభించ‌నుంది. ప్లాంట్‌ నిర్మాణం పూర్తి కావస్తోందని, మార్చి 15లోగా కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తున్నామని GHMC అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌లో చెత్త నుంచి పవర్ ఉత్పత్తి చేసే 5 ప్లాంట్లు ఏర్పాటు
X

హైదరాబాద్ కు సుస్థిర భవిష్యత్తును అందించే దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం పవర్ ఉత్పత్తిలో అన్ని వనరులను ఉపయోగిస్తోంది. హైదరాబాద్‌లో ఐదు వేస్ట్-టు ఎనర్జీ ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తున్నది. ఈ ప్లాంట్ లు పవర్ ఉత్పత్తి చేయడమే కాక పర్యావరణాన్ని కూడా రక్షిస్తాయి.

దుండిగల్‌లో 14.5 మెగావాట్ల సామర్థ్యంతో తొలి వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్ ఈ ఏడాది మార్చి నాటికి కార్యకలాపాలు ప్రారంభించ‌నుంది. ప్లాంట్‌ నిర్మాణం పూర్తి కావస్తోందని, మార్చి 15లోగా కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తున్నామని GHMC అధికారులు తెలిపారు. జవహర్‌నగర్‌లో 24 మెగావాట్ల సామర్థ్యం గల మరో ప్లాంటు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది.

ఆగస్టు 2020లో, జవహర్‌నగర్‌లో 19.8 మెగావాట్ల సామర్థ్యం గల చెత్త నుంచి పవర్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ప్రారంభించారు. తరువాత జూన్ 2022లో దాన్ని 24 మెగావాట్లకు అప్‌గ్రేడ్ చేశారు. దీన్నిప్పుడు 48 మెగావాట్ల ప్లాంట్ గా అభివృద్ది చేయడానికి కృషి జరుగుతోంది.

బీబీనగర్‌లో ఉన్న ప్లాంట్‌ను కూడా పునరుద్ధరించాలని జీహెచ్‌ఎంసీ యోచిస్తోంది. ప్లాంట్ నిర్మాణం 2018లో పూర్తయినప్పటికీ, వివిధ కారణాల వల్ల దీనిని ఏర్పాటు చేసిన సంస్థ కార్యకలాపాలు ప్రారంభించలేకపోయింది. ఇటీవలే ఎవర్ ఎన్విరో రిసోర్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రాజెక్ట్‌ను టేకోవర్ చేసి దానిని పునరుద్ధరించాలని యోచిస్తోంది. ఇబ్రహీంపట్నంలోని యాచారంలో మరో 12 మెగావాట్ల సామర్థ్యం గల వేస్ట్-టు ఎనర్జీ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని జిహెచ్‌ఎంసి ప్రతిపాదించింది.

మెదక్ జిల్లా ప్యారానగర్‌లో ప్రతిపాదించిన మరో 15 MW ప్లాంట్ నిర్మాణానికై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నుండి అనుమతి కోసం వేచి చూస్తున్నారు. వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్‌ల గురించి వివరిస్తూ, మునిసిపల్ బాడీల నుండి ప్రతిరోజూ సుమారు 7,000 నుండి 7,500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు సేకరించబడుతున్నాయని, ఆ వ్యర్థాలను విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తామని GHMC ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

First Published:  10 Jan 2023 3:17 AM GMT
Next Story