Telugu Global
Telangana

జగిత్యాల జైత్రయాత్రకు 44 ఏళ్లు..

తెలంగాణ విప్లవోద్యమ చరిత్రకు సంబంధించిన ప్రస్తావన వస్తే 'జగిత్యాల జైత్రయాత్ర' గుర్తుకు తెచ్చుకోవల్సిందే.

జగిత్యాల జైత్రయాత్రకు 44 ఏళ్లు..
X

తెలంగాణ విప్లవోద్యమ చరిత్రకు సంబంధించిన ప్రస్తావన వస్తే 'జగిత్యాల జైత్రయాత్ర' గుర్తుకు తెచ్చుకోవల్సిందే. ఈ ప్రాంతంలో విప్లవోద్యమాలకు ఆ జైత్రయాత్రే నాంది పలికింది. ఎలాంటి సమాచార వ్యవస్థలు అందుబాటులో లేని కాలంలో, కేవలం మాటల ద్వారా విషయం తెలుసుకొని లక్షలాది మంది ఒకే చోటుకు చేరిన రోజు. సరిగ్గా 44 ఏళ్ల క్రితం 1978 సెప్టెంబర్ 9న రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోయింది. 1967లో పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్బరీ ప్రాంతలో మొదటి రైతాంగ పోరాటం జరిగింది. దాని స్పూర్తితో శ్రీకాకుళం ఏజెన్సీలోని సీతంపేట, పార్వతీపురం ప్రాంతంలో 1969లో గిరిజన రైతాంగ పోరాటం మొదలైంది.

ఆనాడు గిరిజన రైతాంగ పోరాటం వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం, సుబ్బారావు ప్రాణిగ్రాహి వంటి నేతల సారథ్యంలో రెండేళ్ల పాటు కొనసాగింది. ఆ ఉద్యమం ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గడగడలాడించింది. అప్పటి హోం మంత్రి జలగం వెంగళరావు స్వయంగా సాయుధ బలగాలతో వెళ్లి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేశారు. ఉద్యమం ఆగిపోయినా.. ఉద్యమ స్పూర్తిని మాత్రం ప్రభుత్వం ఆపలేక పోయింది. శ్రీకాకుళం రైతాంగ పోరాటాన్ని స్పూర్తిగా తీసుకొని కొండపల్లి సీతారామయ్య ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. అప్పట్లో యాక్టీవ్‌గా ఉన్న సీపీఐ ఎంఎల్, సీవోసీ సంఘాల కార్యకర్తల ద్వారా ఉద్యమ ఆవశ్యకతను అందరికీ ప్రచారం చేశారు. అదే సమయంలో తెలంగాణలో భూస్వాములు, గడిల పాలనలో జరుగుతున్న అరాచకాలు, దోపిడి, వెట్టిచాకిరీని ఎదుర్కునేందకు రైతు కూలీ సంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఈ క్రమంలో 1977 అగస్టులో విప్లవ నాయకులందరూ గ్రామాలకు వెళ్లి అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు. కొండపల్లి సీతారామయ్య పిలుపు మేరకు అనేక మంది రంగంలోకి దూకి, తమ కార్యాచరణను ప్రారంభించారు. అనేక మంది యువకులు గ్రామగ్రామాన తిరుగుతూ అణగారిన, బడుగు బలహీన వర్గాల ప్రజలను చైతన్యవతం చేశారు. ప్రతీ ఊరిలో రైతు కూలీ సంఘాలను ఏర్పాటు చేశారు. పాలేర్లకు జీతాలు పెంచాలని, పశువుల కాపరులకు కూడా వేతనాలు ఇవ్వాలని, దున్నేవాడిదే భూమి అనే నినాదాలతో అందరిలో చైతన్యం రగిలించారు.

గ్రామపెద్దల ఇళ్లలో కూడా ఉచితంగా పని చేయడాన్ని మాన్పించి.. శ్రమ యొక్క విలువను తెలియజెప్పారు. ఈ క్రమంలో 1978 ఏప్రిల్ -మే నెలల్లో దాదాపు 30 రోజుల పాటు మంథని సమీపంలోని శాస్త్రులపల్లెలో రాజకీయ శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. ఇందులో ప్రముఖ విప్లవనేతలు కేజీ సత్యమూర్తి, ఎక్కలదేవి సాంబశివరావు పాఠాలు బోధించారు. విప్లవ ఉద్యమ ఆవశ్యకతను, రైతాంగ సమస్యలను, భూస్వాముల దోపిడిని వివరించారు. ఇక్కడ శిక్షణ పొందిన యువకులు ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని పల్లెలకు వెళ్లి రైతు, కూలీలకు వివరించారు. అన్ని గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయడంతో పాటు.. 1978 సెప్టెంబర్ 9న రైతు కూలీ సభ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

కేవలం మాటల ద్వారా సమాచారం అందుకున్న గ్రామాల్లోని ప్రజలు జగిత్యాలకు పోటెత్తారు. ఆ రోజు ఎటు చూసినా జనమే కనపడ్డారు. ఊరుఊరంతా ఎర్రని జెండాలతో రెపరెపలాడింది. జననాట్య మండలి కళాకారుల విప్లవ గీతాలు, నినాదాలతో నలుదిక్కులు మార్మోగిపోయాయి. ఆ రోజు రైతు కూలీలతో నిర్వహించిన లాంగ్ మార్చ్‌తో జగిత్యాల దద్దరిల్లింది. ఆనాటి సభలో ముప్పాళ్ల లక్ష్మణరావు, మల్లోజుల కోటేశ్వరరావు, నల్లా ఆదిరెడ్డి, వరవరరావు, పోరెడ్డి వెంకటరెడ్డి తదితరులు తమ ప్రసంగాలతో విప్లవ స్పూర్తిని రగిలించారు. ఆనాటి రైతు కూలీ శక్తి ప్రదర్శన సభను అన్ని పత్రికలు విస్తృతంగా కవర్ చేశాయి. పత్రికలే 'జగిత్యాల జైత్రయాత్ర'గా పతాక శీర్షికలకు ఎక్కించడంతో అదే పేరు చరిత్రలో నిలిచిపోయింది.

ఇక ఇదే ఉద్యమం స్పూర్తితో 1980లో కొండపల్లి సీతారామయ్య పీపుల్స్ వార్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు పీపుల్స్ వార్ తెలంగాణ ప్రాంతంలో విప్లవోద్యమం చేసింది. చివరకు 2004లో దేశంలోని మిగిలిన విప్లవ పార్టీలతో కలసి మావోయిస్టు పార్టీగా మారింది.

First Published:  9 Sep 2022 3:41 AM GMT
Next Story