Telugu Global
Telangana

వారం రోజుల్లో గిరిజ‌నుల‌కు 10 శాతం రిజ‌ర్వేషన్లు -కేసీఆర్

తెలంగాణలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. వారం రోజుల్లో దీనికి సంబంధించి జీవో తీసుకవస్తామని ఆయన చెప్పారు.

వారం రోజుల్లో గిరిజ‌నుల‌కు 10 శాతం రిజ‌ర్వేషన్లు -కేసీఆర్
X

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు గుడ్ న్యూస్ వినిపించారు. రాష్ట్రంలో గిరిజ‌నుల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. వారం రోజుల్లో దీనికి సంబంధించిన జీవో విడుదల చేస్తామని కేసీఆర్ చెప్పారు.శ‌నివారం హైద‌రాబాద్‌లో నూత‌నంగా నిర్మించిన గిరిజ‌న‌, బంజారా భ‌వ‌న్‌ల‌ను ప్రారంభించిన అనంత‌రం ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడిన సంద‌ర్భంగా కేసీఆర్ ఈ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ పై కేంద్ర ప్రభుత్వాన్ని అడిగీ అడిగీ విసిగిపోయామని, గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్ల‌ను 10 శాతానికి పెంచుతూ ఇదివ‌ర‌కే అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదం కోసం కేంద్రానికి పంపిన‌ట్లు కేసీఆర్ తెలిపారు. అయితే ఇప్పటి దాకా కేంద్రం నుంచి ఈ విష‌యంపై స్పంద‌నే లేద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.ఇక తామే జీవో విడుదల చేస్తామని కేసీఆర్ చెప్పారు. ఈ జీవో అంగీకరిస్తావా దాన్నే ఉరి తాడు చేసుకుంటవా అని మోడీని ప్రశ్నించారు కేసీఆర్.

ఇప్పటి వరకు గిరిజనులకు 6 శాతం రిజర్వేషన్లు అమలవుతోంది. ఇప్పుడు కేసీఆర్ ప్రకటనతో మరో 4 శాతం పెరిగినట్టయ్యింది. మరో వైపు దళిత బంధు లాగే గిరిజనులకు గిరిజన బంధు కూడా అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.

First Published:  17 Sep 2022 11:55 AM GMT
Next Story