Telugu Global
Sports

గాయాల క్రికెటర్లకు యో-యో టెస్టులతో కళ్ళెం!

కట్టుదిట్టమైన నియమాలున్నా గాయాలతో భారతజట్టులో చోటు సంపాదించే ఆటగాళ్ల ఆటలు ఇకముందు సాగనివ్వరాదని బీసీసీఐ నిర్ణయించింది.

Yo-yo tests for injured cricketers
X

గాయాల క్రికెటర్లకు యో-యో టెస్టులతో కళ్ళెం!

కట్టుదిట్టమైన నియమాలున్నా గాయాలతో భారతజట్టులో చోటు సంపాదించే ఆటగాళ్ల ఆటలు ఇకముందు సాగనివ్వరాదని బీసీసీఐ నిర్ణయించింది. యోయో, డెక్సా టెస్టులతో క్రికెటర్ల ఫిట్ నెస్ ను నిర్థారించడానికి నడుం బిగించింది....

బీసీసీఐ నుంచి కోటి రూపాయల నుంచి 7 కోట్ల రూపాయల వరకూ వార్షిక కాంట్రాక్టులు అందుకొంటూ, ఐపీఎల్ ద్వారా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నా..అరకొర ఫిట్ నెస్ తోనే భారతజట్టులో చేరి..జట్టుకే భారంగా మారుతున్న క్రికెటర్ల పనిపట్టాలని బీసీసీఐ నిర్ణయించింది.

గత ఏడాది జరిగిన ఆసియాకప్ సమయంలో రవీంద్ర జడేజా, టీ-20 ప్రపంచకప్ కు ముందు జస్ ప్రీత్ బుమ్రా లాంటి కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటంతో భారత్ భారీ మూల్యమే చెల్లించింది. దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్ లాంటి యువఆటగాళ్లతో పాటు వెటరన్ మహ్మద్ షమీ సైతం ఫిట్ నెస్ సమస్యలతో జట్టుకు దూరం కావడం.. ఫలితాలపై తీవ్రప్రభావం చూపింది.

తెరమీదకి తిరిగి యో- యో టెస్టులు...

క్రికెటర్ల ఫిట్ నెస్ ను నిర్ధారించడం కోసం కొద్దిసంవత్సరాల క్రితం వరకూ బీసీసీఐ కఠినతరమైన యో-యో, బీప్ టెస్టులు నిర్వహిస్తూ ఉండేది. సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లాంటి సూపర్ స్టార్ క్రికెటర్లు సైతం బీప్, యో యో టెస్టుల్లో సఫలం కావటానికి నానాపాట్లూ పడుతూ ఉండేవారు. అయితే పలు రకాల విమర్శలు రావడంతో ఆ తర్వాతి కాలంలో..

ఆ ఫిట్ నెస్ టెస్టులను పక్కన పెట్టేయటంతో భారత్ భారీమూల్యమే చెల్లించాల్సి వచ్చింది.

అరకొర ఫిట్ నెస్ తో భారతజట్టులో చేరి..కీలక సమయాలలో గాయాలు తిరగబెట్టడంతో పలువురు కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకుండాపోడం ఈ మధ్యకాలంలో సాధారణ విషయంగా మారింది.

భారత కెప్టెన్ రోహిత్ శర్మ గత ఏడాది కాలంలో ఫిట్ నెస్ సమస్యలు, పలు రకాల కారణాలతో 32 అంతర్జాతీయ మ్యాచ్ లకు అందుబాటులో లేకుండా పోడం చర్చనీయాంశమయ్యింది. దీంతో ఆటగాళ్ల ఫిట్ నెస్ ను నిర్ధారించే యో-యో టెస్టుతో పాటు..ఎముకల సాంద్రతను కొలిచే డెక్సాటెస్టులను సైతం నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ టెస్టుల్లో నిర్దారించిన ప్రమాణాలను అందుకొన్న ఆటగాళ్లను మాత్రమే భారత వన్డే, టెస్టు, టీ-20 జట్లకు ఎంపిక చేయాలని నిర్ణయించారు.

కొత్త సంవత్సరం తొలిరోజున ముంబైలో జరిగిన బీసీసీఐ సమీక్షాసమావేశంలో బోర్డు చైర్మన్ రోజర్ బిన్నీ, కార్యదర్శి జే షా, చీప్ కోచ్ రాహుల్ ద్రావిడ్, జాతీయ క్రికెట్ అకాడమీ చైర్మన్ వీవీఎస్ లక్ష్మణ్, చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ, కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొన్నారు.

దేశవాళీ క్రికెట్ మ్యాచ్ లు తప్పని సరి....

అంతర్జాతీయమ్యాచ్ లు, ఐపీఎల్ పేరుతో గత కొద్దిసంవత్సరాలుగా దేశవాళీ ( రంజీ, దులీప్ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ ) క్రికెట్ మ్యాచ్ లకు అంతర్జాతీయ క్రికెటర్లు దూరంగా ఉండటాన్ని బీసీసీఐ సమీక్షించింది. భారతజట్టుకు ఎంపిక కావాలంటే దేశవాళీ క్రికెట్లో పాల్గొని తీరాలని స్పష్టం చేసింది.

2023 సీజన్ నుంచి భారతజట్లకు ఆటగాళ్లను ఎంపిక చేసే సమయంలో ఫిట్ నెస్ ను నిర్ధారించే యో యో టెస్టులతో పాటు దేశవాళీ క్రికెట్ మ్యాచ్ ల్లో పాల్గొని తీరటాన్ని నిర్భంధం చేసింది.

గాయాల నుంచి కోలుకొంటూ..ఫిట్ నెస్ సమస్యలతో బాధపడుతున్న రవీంద్ర జడేజా, జస్ ప్రీత్ బుమ్రా, షమీ, దీపక్ చాహర్ లాంటి ఆటగాళ్లపై ఓ కన్నేసి ఉంచాలని నిర్ణయించింది. ఐపీఎల్ లో పరిమితంగా మ్యాచ్ లు ఆడటానికి అనుమతించాలని, ఆయా ఫ్రాంచైజీలతో జాతీయ క్రికెట్ అకాడమీ టచ్ లో ఉండాలని ఆదేశించింది.

First Published:  2 Jan 2023 6:39 AM GMT
Next Story