Telugu Global
Sports

మహిళా ఐపీఎల్ వేలంలో పసికూనల జోరు!

మహిళా ఐపీఎల్ -2024 సీజన్ వేలం సంచలనాలతో ముగిసింది. అనుభవం ఉన్నవేదా కృష్ణమూర్తి లాంటి సీనియర్ ప్లేయర్లకు లక్షల ధర మాత్రమే పలికితే..ఏమాత్రం అనుభవం లేని , పసికూన క్రికెటర్లు వృంధా దినేశ్, కష్వీ గౌతమ్ లకు కోట్ల రూపాయల ధర పలికింది.

మహిళా ఐపీఎల్ వేలంలో పసికూనల జోరు!
X

మహిళా ఐపీఎల్ సరికొత్త సీజన్ కోసం నిర్వహించిన వేలంలో పసికూన ప్లేయర్లు రికార్డు ధరను దక్కించుకొన్నారు. అనుభవం కంటే ప్రతిభావంతులైన యువక్రికెటర్లకే ఫ్రాంచైజీలు ప్రాధాన్యమిచ్చాయి.

మహిళా ఐపీఎల్ -2024 సీజన్ వేలం సంచలనాలతో ముగిసింది. అనుభవం ఉన్నవేదా కృష్ణమూర్తి లాంటి సీనియర్ ప్లేయర్లకు లక్షల ధర మాత్రమే పలికితే..ఏమాత్రం అనుభవం లేని , పసికూన క్రికెటర్లు వృంధా దినేశ్, కష్వీ గౌతమ్ లకు కోట్ల రూపాయల ధర పలికింది.

165 మంది నుంచి 30 మంది

మొత్తం ఐదుజట్లలోని 30 ఖాళీలు భర్తీ చేయటం కోసం ముంబై వేదికగా నిర్వహించిన వేలం లో 165 మంది స్వదేశీ, విదేశీ క్రికెటర్లు పాల్గొన్నారు.

వీరిలో భారత్ కు చెందిన అంతర్జాతీయ, అంతర్జాతీయ అనుభవం లేని మొత్తం 104 మంది భారత ప్లేయర్లుసైతం ఉన్నారు.

వేలం జాబితా లో 61 మంది విదేశీ క్రికెటర్లు, ఐసీసీ అనుబంధ దేశాలకు చెందిన 15 మంది ప్లేయర్లతో పాటు..అంతర్జాతీయ మ్యాచ్ ల అనుభవం ఏమాత్రం లేని 56 మంది అన్ కాప్డ్ ప్లేయర్లను కూడా వేలంలో ఉంచారు.

కష్వీ గౌతమ్ కు రికార్డు ధర...

టీనేజ్ మీడియం పేస్ ఆల్ రౌండర్ కష్వీ గౌతమ్ కు రికార్డుస్థాయిలో 2కోట్ల రూపాయల ధర పలికింది. అత్యధిక ధర దక్కించుకొన్న అన్ క్యాప్డ్ ( అంతర్జాతీయమ్యాచ్ లు ఆడని ) ప్లేయర్ ఘనతను కష్వీ దక్కించుకొంది.

దేశవాళీ, జూనియర్ స్థాయి క్రికెట్లో మంచి మీడియం పేసర్ గా గుర్తింపు పొందిన కష్వీని గుజరాత్ జెయింట్స్ 2 కోట్ల రూపాయలకు సొంతం చేసుకొంది.

వృందా దినేశ్ కు కోటీ 30 లక్షలు...

కర్నాటక యువబ్యాటర్ర్ వృందా దినేశ్ కు కోటీ 30 లక్షల రూపాయల ధరకు యూపీ వారియర్స్ ఖాయం చేసుకొంది. 10 లక్షలరూపాయల కనీస ధరతో మొదలైన వేలం చివరకు కోటీ 30 లక్షలతో ముగిసింది. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగి భారీషాట్లతో విరుచుకుపడే వృందా కోసం మూడు ఫ్రాంచైజీలు పోటీపడినా..యూపీ వారియర్స్ చేజిక్కిచుకోగలిగింది. ఇటీవలే ముగిసిన జాతీయ సీనియర్ క్రికెట్ టోర్నీలో వృందా మూడు హాఫ్ సెంచరీలతో సహా 477 పరుగులతో టాపర్ గా నిలిచింది.

క్రికెటర్ల కుటుంబం నుంచి వచ్చిన వృందా 5 సంవత్సరాల వయసు నుంచే క్రికెట్ బ్యాట్ చేతపట్టింది. క్లబ్ స్థాయి నుంచి తన క్రికెట్ కెరియర్ మొదలు పెట్టి కర్నాటక జూనియర్ కెప్టెన్ స్థాయికి ఎదిగింది.

వేద కృష్ణమూర్తికి 30 లక్షలు...

గత సీజన్లో వేలానికి నోచు కోని భారత సీనియర్ క్రికెటర్ వేద కృష్ణమూర్తిని 30 లక్షల రూపాయల ధరకు గుజరాత్ ఫ్రాంచైజీ సొంతం చేసుకొంది. 2017 వన్డే ప్రపంచకప్, 2018, 2020 టీ-20 ప్రపంచకప్ టోర్నీలలో భారత్ కు ప్రాతినిథ్యం వహించిన వేద కృష్ణమూర్తికి 48 వన్డేలలో 829 పరుగులు సాధించిన రికార్డు సైతం ఉంది.

విదేశీ క్రికెటర్ల కోటా వేలంలో ఫోబీ లిచ్ ఫీల్డ్ ను గుజరాత్ జెయింట్స్ కోటిరూపాయలకు, అన్నాబెల్ సదర్లాండ్ ను 2 కోట్ల ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకొంది.

ఈ వేలం పూర్తి కావడంతో మొత్తం ఐదు ఫ్రాంచైజీలు 18 ప్లేయర్లతో తమతమ జట్లను సిద్ధం చేసుకోగలిగాయి.

2024 ఫిబ్రవరి- మార్చి మాసాలలో ముంబై వేదికగా మహిళా ఐపీఎల్ రెండోసీజన్ పోటీలు నిర్వహించనున్నారు.

First Published:  10 Dec 2023 5:00 AM GMT
Next Story