Telugu Global
Sports

శిక్షకులు మారినా రాత మారని మహిళా క్రికెట్!

సదుపాయాలు, ప్రోత్సాహాకాలు పెరిగినా భారత మహిళా క్రికెట్ పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది.

శిక్షకులు మారినా రాత మారని మహిళా క్రికెట్!
X

సదుపాయాలు, ప్రోత్సాహాకాలు పెరిగినా భారత మహిళా క్రికెట్ పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది.

పురుషులతో సమానంగా భారత మహిళా క్రికెట్ కు శిక్షణ సదుపాయాలు, మ్యాచ్ ఫీజులు, సౌకర్యాలు కల్పించినా ఆటతీరు ఏమాత్రం మెరుగు పడటం లేదు. ఏడాదికి ఓ కొత్తశిక్షకుడు వచ్చినా ప్రయోజనం ఏమాత్రం కనిపించడంలేదు. పరిస్థితి మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నతీరుగా మారింది.

రెండడుగులు ముందుకు, నాలుగడుగులు వెనక్కు...

ప్రపంచ క్రికెట్ గత దశాబ్దకాలంగా భారత్ చుట్టూనే తిరుగుతోంది. పురుషుల విభాగంలో భారతజట్లే క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.

టెస్టు, వన్డే, టీ-20 విభాగాలలో టాప్ ర్యాంక్ జట్లుగా ఉన్నాయి.

అయితే..మహిళల విభాగంలో మాత్రం పరిస్థితి రెండడుగులు ముందుకు, నాలుగడుగులు వెనక్కు అన్నట్లుగా మారింది. పురుషులతో సమానంగా మహిళలకు సైతం మ్యాచ్ ఫీజులు, సౌకర్యాలు, శిక్షణ సదుపాయాలు కల్పిస్తున్నా ప్రమాణాలు ఏమాత్రం మెరుగు పడటం లేదు.

చిన్నజట్లలో పెద్దజట్టు, పెద్దజట్లలో చిన్నజట్టు...

ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్ లో భారత మహిళాజట్టు ఓ విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటోంది. బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక లాంటి చిరుజట్ల నడుమ అతిపెద్ద జట్టుగానూ...ఆస్ట్ర్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ , దక్షిణాఫ్రికా లాంటి పెద్ద జట్ల మధ్య చిన్నజట్టుగాను తయారయ్యింది.

భారత మహిళా క్రికెట్ దశదిశను మార్చడానికి బీసీసీఐ నడుం బిగించింది. పురుషులతో సమానంగా మహిళలకు ప్రోత్సాహం అందిస్తూ...నిపుణులైన శిక్షకులను సైతం అందుబాటులో ఉంచుతోంది. ఇంతకాలం మహిళా శిక్షకులతో నెట్టుకొంటూ వచ్చిన భారత మహిళా క్రికెట్..ఇప్పుడు అమోల్ మజుందార్ లాంటి ఆధునిక శిక్షకుల నేతృత్వంలో దూసుకుపోడానికి నానాపాట్లు పడుతోంది.

ఐసీసీ ఒత్తిడితో మంచిరోజులు...

అంతర్జాతీయ క్రికెట్ మండలి ఒత్తిడి, ఆదేశాలతో భారత మహిళా క్రికెట్ సైతం బీసీసీఐకి అనుబంధంగా మారిపోడంతో...దశదిశ ఒక్కసారిగా మారిపోయాయి.

ఐసీసీ నిబంధనల మేరకు బీసీసీఐలో ఓ భాగంగా మారిన తర్వాత నుంచి..మహిళా క్రికెటర్లకు మెరుగైన శిక్షణ సదుపాయాలు, మ్యాచ్ ఫీజులు, కాంట్రాక్టు మనీ ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. మహిళలకు ప్రత్యేకంగా ఐపీఎల్ ను సైతం నిర్వహిస్తున్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన శిక్షకులను అందుబాటులో ఉంచడానికే బీసీసీఐ ప్రాధాన్యమిస్తోంది. భారత మహిళా క్రికెట్ బీసీసీఐ పరిథిలోకి రాకముందు వరకూ... సరైన శిక్షకులు, శిక్షణ సదుపాయాలు, మ్యాచ్ ఫీజులు లేక సతమతమవుతూ ఉండేది. మాజీ క్రికెటర్లనే శిక్షకులుగా ఎంచుకొని అంతర్జాతీయ టోర్నీలు, విదేశీ సిరీస్ ల్లో పాల్గొంటూ ఉండేది.

శిక్షకుల రాక..పోక...

భారత మాజీ క్రికెటర్ పూర్ణిమారావు కోచ్ గా...భారత మహిళా క్రికెట్ గణనీయమైన ప్రగతి, పురోగతి సాధించిన సమయంలోనే....అమర్యాదకరమైన రీతిలో పూర్ణిమను తొలగించి రంజీ మాజీ క్రికెటర్ తుషార్ ఆరోతీని శిక్షకునిగా నియమించారు.

అప్పటి వరకూ ...మహిళా శిక్షకుల నేతృత్వంలో పడుతూ లేస్తూ వచ్చిన భారత మహిళా క్రికెట్...తొలిసారిగా ఓ పురుష శిక్షకుడి పర్యవేక్షణలో దూకుడు పెంచింది.

ఓ పురుషుడు శిక్షకుడుగా ఉండటంతో శిక్షణ, వ్యూహాలు, ఆలోచనా విధానం సమూలంగా మారిపోయాయి.

వన్డే జట్టుకు మిథాలీ రాజ్ ను, టీ-20 జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ ను కెప్టెన్లుగా నియమించడం ద్వారా మహిళా క్రికెట్ గాడిలో పడినట్లే కనిపించింది.

అయితే...కౌలాలంపూర్ వేదికగా ముగిసిన టీ-20 ఆసియాకప్ ఫైనల్లో భారత్ అనూహ్య ఓటమి చవిచూసింది. చివరకు బంగ్లాదేశ్ చేతిలో కంగుతిని రన్నరప్ స్థానంలో నిలవాల్సి వచ్చింది. ఫైనల్లో ఆడిన తుదిజట్టు నుంచి పేస్ బౌలర్ వస్త్రార్ కర్ ను తప్పించడం, దానికితోడు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తో విభేదాల తో కోచ్ తుషార్ చివరకు తన పదవినే కోల్పోవాల్సి వచ్చింది.

రమేశ్ పోవార్ కు సెగ...

తుషార్ ఆరోతీ స్థానంలో కోచ్ గా భారత మాజీ క్రికెటర్ రమేశ్ పోవార్ పగ్గాలు చేపట్టాడు. కరీబియన్ ద్వీపాలు వేదికగా ముగిసిన 2018 టీ-20 ప్రపంచకప్ లో భారతజట్టు పాల్గొనటమే కాదు...గ్రూప్ లీగ్ లో నాలుగుకు నాలుగుమ్యాచ్ లూ నెగ్గి ..గ్రూప్ టాపర్ గా సెమీస్ బెర్త్ సంపాదించింది.

తొలిరౌండ్లో రెండోర్యాంకర్ న్యూజిలాండ్, ఆఖరిరౌండ్లో టాప్ ర్యాంకర్ ఆస్ట్రేలియా జట్లపై భారతజట్టు సాధించిన సంచలన విజయాలు, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సాధించిన మెరుపు సెంచరీతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

లీగ్ దశలో పాక్, ఐర్లాండ్ జట్లతో జరిగిన మ్యాచ్ లు మాత్రమే ఆడిన మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్...రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేసినా...బంతికో పరుగు మాత్రమే సాధించడం ద్వారా...టీమ్ మేనేజ్ మెంట్ సహనానికి పరీక్ష పెట్టింది.

దీంతో...ఇంగ్లండ్ తో జరిగిన సెమీఫైనల్లో ...వెటరన్ మిథాలీని పక్కన పెట్టి...స్ట్రయిక్ రేట్ ఎక్కువగా ఉన్న యువ ప్లేయర్ తాన్యాకు తుదిజట్టులో చోటు కల్పించారు. అయితే...సెమీఫైనల్లో భారతజట్టు ఆట అన్ని విభాగాలలోనూ విఫలమై 8 వికెట్ల ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించడంతో విమర్శలు వెల్లువెత్తాయి.

అపారఅనుభవం కలిగిన మిథాలీ లాంటి మేటిక్రికెటర్ ను పక్కనపెట్టిన భారత్ భారీమూల్యం చెల్లించదంటూ మిథాలీ మేనేజర్ ట్విట్టర్ ద్వారా ఆరోపణలు గుప్పించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, కోచ్ రమేశ్ పోవార్లను సైతం విమర్శించింది.

ఇంగ్లండ్ తో ముగిసిన సెమీఫైనల్లో పోటీకి దిగిన భారత తుదిజట్టును కెప్టెన్, వైస్ కెప్టెన్, కోచ్, సెలెక్టర్లతో కూడిన టీమ్ మేనేజ్ మెంట్ ఎంపిక చేసిందని... ..మిథాలీ స్ట్రయిక్ రేట్ తక్కువగా ఉన్న కారణంగానే విన్నింగ్ కాంబినేషన్ ను కొనసాగించినట్లు ప్రకటించింది. బీసీసీఐ పాలకమండలి సభ్యురాలు డయానా ఎడుల్జీ సైతం...సెలెక్షన్ కమిటీ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించింది.

మరోవైపు... ప్రపంచకప్ లో తాను నిలకడగా రాణించినా...తనను పక్కనపెట్టి అవమానించారంటూ...సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్ ఆందోళన వ్యక్తం చేసింది. కోచ్ రమేశ్ పొవార్, పాలకమండలి సభ్యురాలు డయానా ఎడుల్జీ..తన కెరియర్ ను అంతం చేయటానికి కుట్రపన్నారంటూ మండిపడింది. క్రికెట్ కోసం 20 ఏళ్లుగా తన జీవితాన్ని అంకితం చేస్తే...చివరకూ ఇలా అవమానిస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

మిథాలీని ఉద్దేశపూర్వకంగానే తప్పించి అవమానించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న కోచ్ రమేశ్ పొవార్ సైతం చివరకు తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. నవంబర్ 30తోనే రమేశ్ పొవార్ పదవీకాలం సైతం ముగిసింది. దీంతో బీసీసీఐ తాజాగా మహిళా క్రికెట్ కోచ్ ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానించింది. కోచ్ ఎంపిక కోసం...క్రికెట్ మాజీ దిగ్గజాలు కపిల్ దేవ్, అంశుమన్ గయక్వాడ్, శాంతా రంగస్వామిలతో..ఓ అడహాక్ కమిటీని సైతం ఏర్పాటు చేసింది.

కోచ్ బరిలో హేమాహేమీలు..

భారత మహిళా క్రికెట్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకొన్న ప్రముఖుల్లో...గ్యారీ కిర్ స్టెన్, డబ్లువి రామన్, వెంకటేశ్ ప్రసాద్, మనోజ్ ప్రభాకర్, ట్రెంట్ జాన్స్ టన్, దిమిత్రీ మస్కెరెనాస్, బ్రాడ్ హాగ్, కల్పనా వెంకటాచారి ఉన్నారు. చివరకు గ్యారీ కిర్ స్టెన్, రామన్ ల పేర్లను...షార్ట్ లిస్ట్ చేసినా....వివిధ అంశాలను దృష్టిలో ఉంచుకొని...రామన్ వైపే బీసీసీఐ మొగ్గు చూపింది. రామన్ కు టీమిండియా తరపున 11 టెస్టులు, 27 వన్డేలు ఆడిన రికార్డు ఉంది. అంతేకాదు...1992-93 సిరీస్ లో భాగంగా సౌతాఫ్రికా గడ్డపై సెంచరీ సాధించిన భారత తొలిక్రికెటర్ గా కూడా రామన్ కు అరుదైన ఘనత ఉంది.

వివాదరహితుడుగా పేరున్న రామన్ నేతృత్వంలో భారత మహిళా క్రికెట్ ప్రమాణాలు కొంతమేరకు మాత్రమే మెరుగుపడినా..గణనీయమైన స్థాయిలో ప్రమాణాలు మెరుగుపడలేదు.

పురుష క్రికెటర్లను పరుగెత్తించగలం కానీ..మహిళా క్రికెటర్లను నడిపించలేమని, మహిళల కష్టాలు మహిళలవని రామన్ కు అర్థంకావడానికి ఎంతో కాలం పట్టలేదు.

రామన్ పోయే..అమోల్ మజుందార్ వచ్చే...!

భారత మహిళా క్రికెట్ కోచ్ పదవి నుంచి రామన్ తప్పుకోడంతో..సరికొత్త కోచ్ గా అత్యంత విజయవంతమైన దేశవాళీ క్రికెట్ కోచ్ లలో ఒకరైన అమోల్ మజుందార్ బాధ్యతలు చేపట్టారు.

ఫిట్ నెస్ తో పాటు ఫీల్డింగ్ మెరుగు పరచటమే తన లక్ష్యమని ప్రకటించారు. త్వరలో జరిగే మహిళా టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా ఇంగ్లండ్ తో ప్రారంభమైన సిరీస్ లోని తొలిపోరులోనే భారత్ ఓటమి చవిచూసింది.

కోచ్ గా అమోల్ మజుందార్ పరిస్థితి ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా తయారయ్యింది. సిరీస్ లోని తొలిపోరులోనే భారత్ భారీ ఓటమి చవిచూసింది. సిరీస్ లోని మిగిలిన మ్యాచ్ ల్లో భారత్ పుంజుకోగలుగుతుందా?..భారత మహిళా క్రికెట్ దశ, దిశను నయా కోచ్ అమోల్ మజుందార్ మార్చగలడా?..వేచిచూడాల్సిందే.

First Published:  8 Dec 2023 8:45 AM GMT
Next Story