Telugu Global
Sports

పురుషుల క్రికెట్లో మహిళా అంపైర్లు!

గతనెల 13న ప్రారంభమైన 2022-23 రంజీ సీజన్‌ మ్యాచ్ లు నిర్వహించే అంపైర్ల జాబితాలో చోటు దక్కించుకొన్న ముగ్గురు మహిళలు (బృందా రాఠి, జనని నారాయణన్‌, గాయత్రి వేణుగోపాలన్‌ ) తమ విధులను చక్కగా నిర్వర్తించడం ద్వారా నవశకానికి తెరతీశారు.

పురుషుల క్రికెట్లో మహిళా అంపైర్లు!
X

ఎనిమిదిదశాబ్దాల భారత క్రికెట్లో ఓ అసాధారణ ఘట్టం చోటు చేసుకొంది. దేశవాళీ రంజీ క్రికెట్ మ్యాచ్ ల్లో మహిళలు అంపైర్లుగా బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించారు.

పురుషుల దేశవాళీ (రంజీట్రోఫీ ) క్రికెట్లో సరికొత్త చరిత్ర ప్రారంభమయ్యింది. మహిళలే అంపైర్లుగా ఓ పురుషుల మ్యాచ్ లను నిర్వహించడం ద్వారా సత్తాచాటుకొన్నారు.

గతనెల 13న ప్రారంభమైన 2022-23 రంజీ సీజన్‌ మ్యాచ్ లు నిర్వహించే అంపైర్ల జాబితాలో చోటు దక్కించుకొన్న ముగ్గురు మహిళలు (బృందా రాఠి, జనని నారాయణన్‌, గాయత్రి వేణుగోపాలన్‌ ) తమ విధులను చక్కగా నిర్వర్తించడం ద్వారా నవశకానికి తెరతీశారు.

ఈ ముగ్గురిలో ఒకరు స్కోరర్, మరొకరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్, ఇంకొకరు మాజీ ప్లేయర్ కాగా..అంపైర్లు కావాలని నిర్ణయించుకొని బీసీసీఐ నిర్వహించిన పరీక్షల్లో పురుషులతో పోటీ మరీ ఉత్తీర్ణులయ్యారు.

2023 సీజన్ రంజీ ప్యానెల్ అంపైర్లలో చోటు దక్కించుకొన్నారు. జంషెడ్ పూర్ వేదికగా జార్ఖండ్- చత్తిస్ ఘడ్ జట్ల మధ్య జరుగుతున్న రెండోరౌండ్ మ్యాచ్ లో గాయత్రి వేణుగోపాలన్ అంపైర్ గా విధులు నిర్వర్తించడం ఓ మేలిమలుపుగా నిలిచిపోతుంది.

రైల్వేస్- త్రిపుర జట్ల మధ్య సూరత్ వేదికగా జరిగే మ్యాచ్ లో జనని నారాయణన్, పోర్వోరిమ్ వేదికగా పాండిచ్చేరీ- గోవాజట్ల మధ్య జరిగే మ్యాచ్ కు బృందా రాఠీ అంపైర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు.

గతంలో గాయత్రి ఒక రంజీ మ్యాచ్‌కు నాలుగో అంపైర్‌గా వ్యవహరించారు. బీసీసీఐతో రిజిస్టర్‌ అయిన 150 మంది అంపైర్లలో ఈ ముగ్గురే మహిళా అంపైర్లు రంజీమ్యాచ్ లకు ఎంపిక కావడం విశేషం.

ఐసీసీ మహిళా అంపైర్లుగా...

క్రికెట్ అంపైర్ల కోసం బీసీసీఐ, ఐసీసీ నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడమే కాదు... జాతీయస్థాయిలో సబ్ -జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలలో అంపైర్లుగా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించడం ద్వారా ఐసీసీ అంపైర్ల ప్యానెల్ లో తొలిసారిగా చోటు సంపాదించారు. ఐసీసీ మహిళా అంపైర్లుగా ఎదిగిన భారత తొలి మహిళా అంపైర్లుగా సరికొత్త చరిత్ర సృష్టించారు.

12కు చేరిన మహిళా క్రికెట్ అంపైర్లు

ఐసీసీ నియమించిన మహిళా క్రికెట్ అధికారులలో భారత్ కు చెందిన జీఎస్ లక్ష్మి, మరో మహిళ షాండర్ ఫ్రిట్జ్ అంతర్జాతీయ ప్యానెల్ మ్యాచ్ రిఫరీలుగా సేవలు అందిస్తున్నారు.

ఐసీసీ ప్యానెల్ అంపైర్లలో ఇప్పటికే చోటు సంపాదించిన వివిధ దేశాలకు చెందిన మహిళల్లో లారెన్ అగెన్ బాగ్, కిమ్ కాటన్, శివానీ మిశ్రా, క్లెయిరీ పోలోసాక్, సుజీ రెడ్ ఫెర్న్, ఎల్యోసీ షెర్యడాన్, మేరీ వాల్ డ్రోన్, జాక్వెలిన్ విలియమ్స్ ఉన్నారు. ఇప్పుడు జననీ నారాయణన్, వృంథా రాఠీ ఈ బందంలో వచ్చి చేరారు.

పూణేలోని మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా నిర్వహించిన 2022 మహిళా చాలెంజర్ టీ-20 టోర్నీని మహిళా అంపైర్లే నిర్వహించారు.

First Published:  11 Jan 2023 6:04 AM GMT
Next Story