Telugu Global
Sports

టీ-20కి వీసా చిక్కులు!.. భారత క్రికెటర్లకు అందని అమెరికా వీసాలు

భారత, కరీబియన్ క్రికెటర్లకు ఇప్పటి వరకూ అమెరికా వీసాలు అందకపోవడంతో సిరీస్ లోని ఆఖరి రెండుమ్యాచ్ ల పరిస్థితి డోలాయమానంగా మారింది.

టీ-20కి వీసా చిక్కులు!.. భారత క్రికెటర్లకు అందని అమెరికా వీసాలు
X

భారత్- వెస్టిండీస్ జట్ల ఐదు మ్యాచ్ ల టీ-20 సిరీస్ లో భాగంగా అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా నిర్వహించాల్సిన ఆఖరి రెండు మ్యాచ్ ల నిర్వహణ గాల్లో దీపంగా మారింది. ప్రస్తుతం సెయింట్స్ కిట్స్ ద్వీపాలలో ఉన్న భారత, కరీబియన్ క్రికెటర్లకు ఇప్పటి వరకూ అమెరికా వీసాలు అందకపోవడంతో సిరీస్ లోని ఆఖరి రెండుమ్యాచ్ ల పరిస్థితి డోలాయమానంగా మారింది.

ఫ్లోరిడాలో రెండు మ్యాచ్ లు..

ప్రస్తుత 5 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా మొదటి మూడు టీ-20 మ్యాచ్ లను కరీబియన్ ద్వీపాలు వేదికగాను, ఆఖరి రెండుమ్యాచ్ లను ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్, లాడెర్ హిల్ గ్రౌండ్స్ లోనూ నిర్వహించడానికి విండీస్ క్రికెట్ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఆగస్టు 6, 7 తేదీలలో జరగాల్సిన ఈ మ్యాచ్ ల కోసం రెండుజట్ల ఆటగాళ్లకు సెయింట్ కిట్స్ వేదికగా జరిగే రెండో టీ-20 మ్యాచ్ సమయంలోనే వీసాలు అందివ్వాలని భావించారు. అయితే.. అమెరికా ఇమిగ్రేషన్ విభాగం నుంచి మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి వర్తమానం అందలేదు. వీసాల జారీ పని కూడా అగమ్యగోచరంగా మారింది.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు..

ఒకవేళ సకాలంలో అమెరికా వీసాలు అందకపోతే.. ఫ్లోరిడా వేదికగా జరగాల్సిన మ్యాచ్ లను కరీబియన్ ద్వీపాల వేదికల్లోనే నిర్వహించాలని విండీస్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ప్రస్తుత 5 మ్యాచ్ ల సిరీస్ లోని తొలిమ్యాచ్ ను నెగ్గడం ద్వారా భారతజట్టు 1-0తో పైచేయి సాధించిన సంగతి తెలిసిందే.

First Published:  1 Aug 2022 4:06 AM GMT
Next Story