Telugu Global
Sports

భారత్-పాక్ ప్రపంచకప్ మ్యాచ్ కు హౌస్ ఫుల్!

ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ జట్ల మధ్య జరుగనున్న మ్యాచ్ టికెట్లు నెలరోజుల ముందే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి.

భారత్-పాక్ ప్రపంచకప్ మ్యాచ్ కు హౌస్ ఫుల్!
X

ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ జట్ల మధ్య జరుగనున్న మ్యాచ్ టికెట్లు నెలరోజుల ముందే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి.

ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16 నుంచి జరుగనున్న టీ-20 ప్రపంచకప్ టికెట్ల సేల్ కు అనూహ్యమైన స్పందన వస్తోందని ఐసీసీ ప్రకటించింది. చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య అక్టోబర్ 23న మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగనున్న మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

లక్ష టికెట్లు హాట్ హాట్ గా సేల్...

ప్రపంచ క్రికెట్లో దాయాదిజట్లుగా పేరున్న భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయంటే చాలు..వేదిక ఏదైనా, టోర్నీ ఏదైనా మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోవడం, స్టేడియం కిటకిటలాడటం సాధారణ విషయమే.

ఇటీవలే దుబాయ్ వేదికగా ముగిసిన ఆసియాకప్ టోర్నీ గ్రూప్- ఏ ప్రారంభమ్యాచ్ లో భారత్- పాక్ జట్లు తలపడిన సమయంలో వేదికగా నిలిచిన దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం రెండుదేశాల అభిమానులతో కిటకిటలాడిపోయింది.

అంతేకాదు..ఈమ్యాచ్ ప్ర్తత్యక్షప్రసారాన్ని ప్రపంచ వ్యాప్తంగా వ్యూయర్షిప్‌ పరంగా సరికొత్త రికార్డులను నెలకొల్పిన సంగతి తెలిసిందే. డిజిటల్‌ ప్లాట్‌ఫాంలో (డిస్నీ హాట్‌ స్టార్‌) ఈ మ్యాచ్‌ను రికార్డుస్థాయిలో కోటి మందికి పైగా (13 మిలియన్లు) వీక్షించినట్లు బ్రాడ్ కాస్టర్ ప్రకటించింది. డిస్నీ హాట్ స్టార్‌ చరిత్రలో ఇది రెండో అత్యధిక వ్యూయర్షిప్‌ సాధించిన మ్యాచ్‌గా రికార్డుల్లో చేరింది. ఈ మ్యాచ్‌ డిజిటల్ ప్లాట్‌ఫాంలో అత్యధికంగా వీక్షించిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌గా కూడా నిలిచింది.

ఓటీటీలో ఇప్పటివరకు అత్యధిక వ్యూయర్షిప్‌ సాధించిన మ్యాచ్‌ రికార్డు ఐపీఎల్‌ మ్యాచ్‌ పేరిట ఉంది. 2019 ఐపీఎల్‌ ఫైనల్లో ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో 18 మిలియన్ల మంది వీక్షించారు. ఓటీటీ చరిత్రలో ఇదే అత్యధికం. ఆ తర్వాతి స్థానం కూడా ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ పేరిటే ఉంది. అదే సీజన్‌లో ఆర్సీబీ-ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగిన లీగ్‌ మ్యాచ్‌కు 12 మిలియన్ల వ్యూయర్షిప్ లభించింది. ఆసియాకప్ లో భాగంగా భారత్‌-పాక్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ ఈ రికార్డును తెరమరుగు చేసింది.

ప్రపంచకప్ లో భారీ అంచనాలు...

ఇక...ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్లో భాగంగా భారత్- పాక్ జట్ల సమరం మరిన్ని సరికొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదికగా మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో లక్షమంది కూర్చొని మ్యాచ్ చూడటానికి ఏర్పాట్లు ఉన్నాయి. చిరకాల ప్రత్యర్థుల ఈ మ్యాచ్ కు వేదికగా మెల్బో్ర్న్ మైదానాన్నే నిర్వాహక సంఘం ఎంపిక చేసింది.

భారత్- పాక్ జట్ల మ్యాచ్ స్టాండింగ్‌ రూమ్‌ టిక్కెట్లతో సహా అన్నితరగతుల టిక్కెట్లు అమ్మకానికి ఉంచిన కొద్ది వ్యవధిలోనే అమ్ముడయ్యాయని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. తెలిపింది. అక్టోబర్‌ 16న ప్రారంభం కానున్న టీ-20 ప్రపంచకప్ టికెట్లు చరిత్రలోనే తొలిసారి దాదాపు అన్ని మ్యాచ్‌ల టిక్కెట్లు అమ్ముడయ్యాయని, ప్రపంచవ్యాప్తంగా అయిదు లక్షలమంది అభిమానులు తమ టిక్కెట్లను రిజర్వ్‌ చేసుకున్నారని ఐసీసీ పేర్కొంది

కేవలం న్యూజిలాండ్‌-ఆస్ట్రేలియా సూపర్‌-12 మ్యాచ్‌కు సంబంధించి కొద్ది టిక్కెట్లు మాత్రమే మిగిలాయని చెప్పింది.మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే ఫైనల్‌ మ్యాచ్‌కు 86,174మంది ప్రేక్షకులు ముందుగానే తమతమ టిక్కెట్లు రిజర్వ్‌ చేసుకున్నారు. ఐసీసీ మ్యాచ్‌లకు టిక్కెట్ల అమ్మకాలలో అభిమానుల ఆదరణకు ఇదోఉదాహరణ మాత్రమేనంటూ ఐసీసీ వ్యాఖ్యానించింది.

అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకూ జరిగే టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే తమతమ జట్లను మొత్తం 12 దేశాలజట్లు ముందుగానే ప్రకటించడం ద్వారా సన్నాహాలకు తెరతీశాయి.

First Published:  16 Sep 2022 7:16 AM GMT
Next Story