Telugu Global
Sports

సొంతగడ్డపై నేడు సునీల్ చెత్రీ అరుదైన రికార్డు!

భారత ఫుట్ బాల్ ఎవర్ గ్రీన్ స్టార్ సునీల్ చెత్రీ స్వదేశీగడ్డపై ఓ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు.గౌహతీ వేదికగా ఈ ఘనత సాధించనున్నాడు.

సొంతగడ్డపై నేడు సునీల్ చెత్రీ అరుదైన రికార్డు!
X

భారత ఫుట్ బాల్ ఎవర్ గ్రీన్ స్టార్ సునీల్ చెత్రీ స్వదేశీగడ్డపై ఓ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు.గౌహతీ వేదికగా ఈ ఘనత సాధించనున్నాడు.

భారత ఫుట్ బాల్ ఒకే ఒక్కడు, రికార్డులమొనగాడు, ఎవర్ గ్రీన్ స్టార్ సునీల్ చెత్రీ మరో అరుదైన ఘనత సాధించనున్నాడు. గౌహతీలోని ఇందిరాగాంధీ అథ్లెటిక్స్ స్టేడియం వేదికగా ఈ రోజు జరిగే 2026- ప్రపంచకప్ అర్హత పోరులో అప్ఘనిస్థాన్ తో తలపడటం ద్వారా 150 అంతర్జాతీయమ్యాచ్ ల మైలురాయిని చేరనున్నాడు.

భారత ఫుట్ బాల్ మేస్త్రీ సునీల్ చెత్రీ!

2005 జూన్ 12న.. భారతజట్టులో సభ్యుడిగా తన తొలి అంతర్జాతీయమ్యాచ్ ఆడిన సునీల్ గత 19 సంవత్సరాలుగా కీలక ఆటగాడిగా ఉంటూ వస్తున్నాడు. భారత ఫుట్ బాల్ కే మరో పేరుగా నిలిచాడు. డజన్ల కొద్దీ అరుదైన రికార్డులు నెలకొల్పాడు. ప్రపంచ ఫుట్ బాల్ లోని ఐదుగురు అరుదైన సాకర్ స్టార్లలో ఒకడిగా నిలిచాడు.

అరుదైన మ్యాచ్ ల్లో అసాధారణ రికార్డులు...

క్వెట్టా వేదికగా 2005 జూన్ 12న పాకిస్థాన్ ప్రత్యర్థిగా తన తొలి అంతర్జాతీయమ్యాచ్ ఆడిన సునీల్..ఆ తరువాత నుంచి మరి వెనుదిరిగి చూసింది లేదు. తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ లోనే గోల్ సాధించిన సునీల్ ..25వ, 50వ, 75వ, 100వ, 125వ మ్యాచ్ ల్లో సైతం గోల్స్ నమోదు చేయడం విశేషం.

ఇప్పటి వరకూ ఆడిన 149 అంతర్జాతీయమ్యాచ్ ల్లో 93 గోల్స్ సాధించిన అరుదైన ఘనత సునీల్ కు మాత్రమే సొంతం. భారత ఫుట్ బాల్ కు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిన సునీల్ ఈ రోజు గౌహతీ వేదికగా అప్ఘనిస్థాన్ తో ఆడే తన 150వ మ్యాచ్ లో సైతం గోల్ సాధించాలని అభిమానులు కోరుకొంటున్నారు.

సౌదీ అరేబియా వేదికగా గతంలో భారత్ తో అప్ఘనిస్థాన్ తలపడిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ తరువాత మరోసారి ఈ రెండుజట్లూ తలపడబోతున్నాయి.

సునీల్ 150వ అంతర్జా్తీయ మ్యాచ్ సందర్భంగా వెటరన్ స్టార్ ను ఘనంగా సత్కరించడానికి భారత ఫుట్ బాల్ సంఘం ఏర్పాట్లు చేసింది.

2005 నుంచి 2024 వరకూ...

ప్రపంచ క్రీడారంగంలో ఎన్ని రకాల ఆటలు ఉన్నా ఫుట్ బాల్ తర్వాతే ఏక్రీడైనా. విశ్వవ్యాప్తంగా 204 దేశాలకు చెందిన కోట్లాదిమంది ఆడే ఈ జనసంమోహక క్రీడలో భారత్ ఇంకా శైశవదశలోనే కొట్టిమిట్టాడుతోంది. పట్టుమని పన్నెండు దేశాలు గట్టిగా ఆడని క్రికెట్లో మనం ప్రపంచ నంబర్ వన్ ర్యాంకులో నిలిచినా...200కు పైగా దేశాలు ఆడే ఫుట్ బాల్ లో మన ర్యాంకు 104 మాత్రమే.

మనదేశంలో క్రికెట్ మర్రినీడలో ఎదుగూబొదుగూలేని క్రీడల్లో ఒకటిగా ఉంటూ వస్తున్న ఫుట్ బాల్ అభివృద్ధి కోసం భారత ఫుట్ బాల్ సమాఖ్య పలురకాల చర్యలు తీసుకొంటూ నానాపాట్లు పడుతూ వస్తోంది. ఎంత చేసినా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నతీరుగా పరిస్థితి తయారయ్యింది. క్రికెటర్లకు ఉన్న ఆదరణ, ప్రోత్సాహం ఫుట్ బాల్ క్రీడాకారులకు లేకపోడం కూడా ఎదుగూబొదుగూ లేకపోడానికి ఓ ప్రధానకారణంగా ఉంటూ వస్తోంది. దేశంలోని గోవా, మహారాష్ట్ర, బెంగాల్, ఈశాన్య భారత రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన భారత ఫుట్ బాల్ ఇంకా బుడిబుడి అడుగుల దశలోనే ఉంది.

కేవలం బెంగాల్, గోవా, కేరళ రాష్ట్ర్రాలకో , ఈశాన్య భారత రాష్ట్ర్రాలకో పరిమితమైన భారత్ ఫుట్ చరిత్రను ఓసారి తిరగేస్తే...వంద అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్లు ఇద్దరంటే ఇద్దరు మాత్రమే కనిపిస్తారు.

దశాబ్దానికి ఒక్కడు.....

జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం భారత్ లో వందలాదిమంది క్రికెటర్లు పుట్టుకు వస్తున్నా...ఫుట్ బాల్ లో మాత్రం...దశాబ్దానికో అంతర్జాతీయస్థాయి ఆటగాడిని మాత్రమే తయారు చేసే పరిస్థితి నెలకొని ఉంది.

సిక్కిం నుంచి భారత్ ఫుట్ బాల్ లోకి దూసుకొచ్చిన బైచుంగ్ భూటియా దశాబ్దకాలం పాటు జాతీయ ఫుట్ బాల్ కు అసమాన సేవలు అందించి రిటైర్మెంట్ ప్రకటిస్తే..

ఆ స్థానాన్ని ప్రస్తుత కెప్టెన్ సునీల్ చెత్రీ గత కొద్ది సంవత్సరాలుగా భర్తీ చేస్తూ వస్తున్నాడు.

గతంలో కేరళ స్ట్రయికర్ విజయన్, ఆ తర్వాత బైచుంగ్ భూటియా...ఈ ఇద్దరి వారసుడుగా సునీల్ చెత్రీ మాత్రమే అంతర్జాతీయస్థాయి ఫుట్ బాలర్లు గా గుర్తింపు సంపాదించుకొన్నారు. భారత కెప్టెన్ గా అసాధారణ సేవలు అందించిన బైచుంగ్ భూటియా తాను ఆడిన 100 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో 42 గోల్స్ సాధించాడు.

బైచుంగ్ బాటలో సునీల్ చెత్రీ...

బైచుంగ్ భూటియా రిటైర్మెంట్ తర్వాత...భారత ఫుట్ బాల్ జట్టు పగ్గాలను చేపట్టిన సునీల్ చెత్రీ...ఈ మధ్యకాలంలోనే వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ వస్తున్నాడు.

భారత్ వేదికగా ముగిసిన మూడుదేశాల అంతర్జాతీయ ఫుట్ బాల్ టోర్నీ ఫైనల్లో..కిర్గిజిస్థాన్ పై ఓ గోల్ చేయటం ద్వారా... ప్రపంచ సాకర్ సూపర్ స్టార్లు క్రిస్టియానో రొనాల్డో, లయనల్ మెస్సీ లాంటి దిగ్గజాల జాబితాలో చోటు సంపాదించాడు.

మియన్మార్, కిర్గిజిస్థాన్ జట్లు ప్రత్యర్థులుగా జరిగిన మూడుదేశాల అంతర్జాతీయ సాకర్ టోర్నీలో సునీల్ చెత్రీ నాయకత్వంలోని భారతజట్టుకు రెండుకు రెండు విజయాలు సాధించడం ద్వారా విజేతగా నిలిచింది.

తొలిమ్యాచ్ లో తనకంటే మెరుగైన ర్యాంక్ లో ఉన్న మియన్మార్ ను 1-0తో ఓడించిన భారత్...రెండోమ్యాచ్ లో పవర్ ఫుల్ కిర్గిజిస్థాన్ ను 2-0 గోల్స్ తో చిత్తు చేసింది.

కిర్గిజిస్థాన్ తో ముగిసిన పోరు ఆట రెండో భాగంలో లభించిన పెనాల్టీని గోలుగా మలచడం ద్వారా..సునీల్ చెత్రీ భారత్ తరపున 85వ గోల్ సాధించగలిగాడు.

ప్రపంచ మేటి సాకర్ స్టార్ల జాబితాలో...

అంతర్జాతీయ సాకర్ లో తమ జట్ల తరపున అత్యధిక గోల్స్ సాధించిన ఆల్ టైమ్ గ్రేట్ సాకర్ స్టార్ల వరుస 5వ స్థానంలో సునీల్ చెత్రీ నిలిచాడు. 38 సంవత్సరాల వయసులో తన 132వ అంతర్జాతీయమ్యాచ్ లో సునీల్ ఈ ఘనతను సొంతం చేసుకోగలిగాడు.

తమతమ జాతీయజట్ల తరపున అత్యధిక గోల్స్ సాధించిన మొనగాళ్లలో క్రిస్టియానో రొనాల్డో 120 గోల్స్ తో అగ్రస్థానంలో నిలిస్తే..ఇరాన్ ఆటగాడు అలీ దాయ్ 109 గోల్స్ తో రెండు, లయనల్ మెస్సీ 100 గోల్స్ తో మూడు, ముక్తార్ దహారీ 89 గోల్స్ తో నాలుగు, సునీల్ చెత్రీ 85 గోల్స్ తో ఐదు, ఫెరెన్స్ పుస్కాస్ 84 గోల్స్ తో ఆరు స్థానాలలో కొనసాగుతున్నారు.

క్వెట్టా నుంచి గౌహతీ వరకూ...

2005లో క్వెట్టా వేదికగా పాకిస్థాన్ తో జరిగిన పోటీ ద్వారా....అంతర్జాతీయ ఫుట్ బాల్ అరంగేట్రం చేసిన సునీల్ చెత్రీ...తన కెరియర్ లో 149 మ్యాచ్ లు ఆడి 92 గోల్స్ సాధించిన భారత తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. బైచుంగ్ భూటియా 104 మ్యాచ్ ల్లో 42 గోల్స్ మాత్రమే సాధిస్తే..సునీల్ చెత్రీ... ఆ రికార్డును అధిగమించాడు.

సునీల్ చెత్రీ 19 ఏళ్ల ఫుట్ బాల్ ప్రస్థానంలో..భారత్ ఆరుగురు రాష్ట్రపతులను, ఇద్దరు ప్రధానులను, ఎనిమిదిమంది క్రికెట్ కెప్టెన్లను, ఎనిమిదిమంది ఫుట్ బాల్ శిక్షకులను చూసింది. అంతేకాదు భారత జనాభా 19.00 శాతానికి పెరిగిపోయింది. భారత ఫుట్ బాల్ ర్యాంక్ 127 నుంచి 104కు మెరుగు పడింది.

39 ఏళ్ల వయసులోనూ అసాధారణంగా రాణిస్తున్న సునీల్ చెత్రీ....భారత ఫుట్ బాల్ ఒకే ఒక్కడుగా నిలిచిపోతాడు. కేవలం ఫుట్ బాల్ ఆట కోసమే పుట్టిన ఆటగాడు సునీల్ చెత్రీ.

First Published:  26 March 2024 6:30 AM GMT
Next Story