Telugu Global
Sports

భారతజోడీ పదివారాల ప్రపంచ నంబర్-1 రికార్డు!

ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ చరిత్రలో భారత డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ షెట్టి సరికొత్త రికార్డు నెలకొల్పారు. 10 వారాలపాటు ప్రపంచ నంబర్ -1 ర్యాంక్ లో కొనసాగిన భారత బ్యాడ్మింటన్ తొలిజంటగా నిలిచారు.

భారతజోడీ పదివారాల ప్రపంచ నంబర్-1 రికార్డు!
X

భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. సైనా నెహ్వాల్ రికార్డును తెరమరుగు చేశారు.

ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ చరిత్రలో భారత డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ షెట్టి సరికొత్త రికార్డు నెలకొల్పారు. 10 వారాలపాటు ప్రపంచ నంబర్ -1 ర్యాంక్ లో కొనసాగిన భారత బ్యాడ్మింటన్ తొలిజంటగా నిలిచారు.

గత 10 వారాలుగా టాప్ ర్యాంక్ లో....

ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య తాజా ర్యాంకింగ్స్ ప్రకారం పురుషుల డబుల్స్ లో గత 10 వారాలుగా సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ షెట్టి అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

ఈ ఘనత సాధించిన భారత తొలిజోడీగా రికార్డుల్లో చేరారు.

2015 ఆగస్టు 18 నుంచి 2015 అక్టోబర్ 21 వరకూ సైనా నెహ్వాల్ 9 వారాలపాటు ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో టాప్ ర్యాంకర్ గా ఉంది. ఇప్పటి వరకూ అదే భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ల అత్యుత్తమ రికార్డుగా ఉంది.

అయితే..గత తొమ్మిదేళ్లుగా ఉన్న సైనా నెహ్వాల్ రికార్డును సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ షెట్టి జోడీ అధిగమించగలిగారు.

ఆసియాక్రీడల స్వర్ణ పతకం నుంచి...

సాత్విక్- చిరాగ్ జోడీ ..ఆసియాక్రీడల బంగారు పతకం సాధ్ంచడంతో పాటు ఈ ఏడాది జనవరి 23 నుంచి చైనా మాస్టర్స్, మలేసియా ఓపెన్, ఇండియా ఓపెన్ విజయాలతో పాటు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సైతం నెగ్గడం ద్వారా ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను నిలుపుకోగలిగారు.

అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ విధానం ప్రకారం 52 వారాల సమయంలో ఓ ఆటగాడు లేదా జోడీ సాధించిన పది అత్యుత్తమ విజయాల ప్రాతిపదికన ర్యాంకింగ్స్ పాయింట్లు ఇవ్వడం ద్వారా ర్యాంకులను నిర్ణయిస్తారు.

సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ జోడీ 1,02,303 పాయింట్లు సాధించడం ద్వారా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. తమ సమీప కొరియా జోడీ కాంగ్ మిన్ హ్యుక్- సీయో సీయింగ్ జే కంటే 5వేల పాయింట్లతో ముందున్నారు.

పురుషుల సింగిల్స్ లో 2018 ఏప్రిల్ నెలలో వారంరోజులపాటు మాత్రమే కిడాంబీ శ్రీకాంత్ టాప్ ర్యాంక్ లో నిలువగలిగాడు. ర్యాంకింగ్ విధానం లేని రోజుల్లో 1980 ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ ప్రకాశ్ పడుకోన్ ను ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ గా పరిగణించేవారు.

అంచెలంచెలుగా....

హాంగ్జు వేదికగా ముగిసిన 19వ ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించడం ద్వారా సాత్విక్- చిరాగ్ జోడీ 3వ ర్యాంక్ నుంచి నంబర్ వన్ ర్యాంక్ కు చేరుకోగలిగారు.

బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ చరిత్రలో ఈ ఘనత సాధించిన భారత తొలి డబుల్స్ జంటగా రికార్డు నెలకొల్పారు.

గతంలో పురుషుల సింగిల్స్ లో ప్రకాశ్ పడుకోన్, కిడాంబీ శ్రీకాంత్, మహిళల సింగిల్స్ లో సైనా నెహ్వాల్ మాత్రమే నంబర్ వన్ ర్యాంక్ ను అందుకోగలిగారు. ఆ తరువాత సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ మాత్రమే ఈ ఘనత సాధించగలిగారు.

ఆసియాక్రీడల పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ ఫైనల్లో దక్షిణ కొరియా జోడీ చోయ్ సోల్ గుయ్- కిమ్ వాన్ హోలను 21-18, 21-16తో ఓడించడం ద్వారా సాత్విక్- చిరాగ్ జోడీ భారత్ కు తొలి బంగారు పతకం అందించిన కొద్దిరోజుల వ్యవధిలోనే నంబర్ వన్ ర్యాంకర్లుగా నిలువగలిగారు.

2022 నుంచి టాప్ గేర్ లో....

ఆసియాక్రీడల పురుషుల టీమ్ విభాగంలో భారత్ రజత పతకం గెలచుకోడంలో సాత్విక్- చిరాగ్ జోడీ తమవంతు పాత్ర నిర్వర్తించారు. దానికి అదనంగా పురుషుల డబుల్స్ లో సైతం బంగారు పతకం సాధించగలిగారు.

2022 ప్రపంచ బ్యాడ్మింటన్ టూర్ టైటిల్ నెగ్గిన తరువాత సాత్విక్- చిరాగ్ జోడీ మరి వెనుదిరిగి చూసింది లేదు. గతేడాది జనవరి లో జరిగిన ఇండియన్ ఓపెన్ ఫైనల్లో

ఇండోనీసియాజోడీ మహ్మద్ అహసాన్- హెండ్రా సెత్యావాన్ లను 21-16, 26-24 చిత్తు చేసిన తరువాత మరి వెనుదిరిగి చూసింది లేదు.

ఆ తర్వాత జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ లోనూ భారతజోడీకి ఎదురేలేకపోయింది.

2023 సీజన్లో స్విస్ ఓపెన్, ఇండోనీషియన్ ఓపెన్, కొరియన్ ఓపెన్ టైటిల్స్ సైతం భారతజంటకు దాసోహమన్నాయి. ఇండోనీషియన్ ఓపెన్ టైటిల్ సమరంలో ప్రపంచ రెండోర్యాంక్ జంట ఆరోన్ చియా- వూ ఇక్ సోలను 21-17, 21-18తో కంగు తినిపించడం ద్వారా తమ ఆధిపత్యాన్ని చాటి చెప్పారు.

థామస్ కప్ విజయంలోనూ..

1949 నుంచి జరుగుతున్న థామస్ కప్ టోర్నీలోనూ భారతజట్టు తొలిసారిగా బంగారు పతకం అందుకోడంలో సాత్విక్- చిరాగ్ జోడీ కీలకపాత్ర పోషించారు. ఫైనల్లో ఇండోనీషియాను చిత్తు చేయడంలో ప్రధానపాత్ర వహించారు. థామస్ కప్ చరిత్రలోనే 14సార్లు చాంపియన్ గా నిలిచిన ఇండోనీషియాను భారత్ 3-0తో చిత్తు చేయడం ద్వారా తొలిసారిగా ట్రోఫీ అందుకోగలిగింది.

బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన 2022 కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ ఫైనల్లో బ్రిటీష్ జోడీ బెన్ లాన్- సీన్ వార్డీలను చిత్తు చేయడం ద్వారా బంగారు పతకం సాధించారు. మిక్సిడ్ టీమ్ విభాగంలోనూ భారత్ కు రజత పతకం అందించారు.

ఆ తర్వాత దుబాయ్ వేదికగా జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీ డబుల్స్ లో కాంస్య పతకం సాధించారు.

2023 ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ టైటి్ల్ సమరంలోనూ మలేసియాజోడీ ఆంగ్ ఇ సిన్ -తే ఇ పై 16-21, 21-17, 21-19తో అధిగమించడం ద్వారా ఈ ఘనత సాధించిన భారత తొలిజంటగా చరిత్ర సృష్టించారు.

ఈ ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ లో సైతం సాత్విక్- చిరాగ్ జోడీ భారత్ కు బంగారు పతకం అందించే అవకాశాలు లేకపోలేదు.

First Published:  30 March 2024 1:59 PM GMT
Next Story