Telugu Global
Sports

దేశవాళీ క్రికెట్లో రికార్డుల మోత!

దేశవాళీ క్రికెట్ సరికొత్త సీజన్ కు రికార్డుల మోతతో తెరలేచింది. 2024 రంజీ సీజన్ తొలిరౌండ్ పోరు మ్యాచ్ లో మొత్తం 32 జట్లు తలపడుతున్నాయి.

దేశవాళీ క్రికెట్లో రికార్డుల మోత!
X

దేశవాళీ క్రికెట్ సరికొత్త సీజన్ కు రికార్డుల మోతతో తెరలేచింది. 2024 రంజీ సీజన్ తొలిరౌండ్ పోరు మ్యాచ్ లో మొత్తం 32 జట్లు తలపడుతున్నాయి.

అంతర్జాతీయ సిరీస్ లు, టోర్నీలు, ఐపీఎల్ హంగామా నడుమ భారత దేశవాళీ క్రికెట్ సైతం తన ఉనికిని కాపాడుకొంటూ వస్తోంది. క్రికెటర్లకు తల్లిఒడిలాంటి దేశవాళీ క్రికెట్ బాగుకోసం బీసీసీఐ సైతం తనవంతుగా చర్యలు తీసుకొంటోంది.

దేశవాళీ క్రికెటర్లకు సైతం మ్యాచ్ ఫీజులను గణనీయంగా పెంచుతూ వస్తోంది. కొద్దిరోజుల క్రితమే ప్రారంభమైన 2024 సీజన్ రంజీట్రోఫీ పోటీల నిర్వహణ కోసం విస్త్రుత స్థాయిలో ఏర్పాట్లు చేసింది.

32జట్లతో 2024 సీజన్ రంజీపోరు...

కాలానుగుణంగా మారుతూ వస్తున్న రంజీ ఫార్మాట్లో ప్రస్తుతం మొత్తం 32 క్రికెట్ సంఘాలకు చెందిన జట్లు తలపడుతున్నాయి. మొదటి 24 అగ్రశ్రేణిజట్లకు ఎలైట్ గ్రూప్, ద్వితీయశ్రేణి జట్లకు ప్లేట్ గ్రూపు పేరుతో పోటీలు నిర్వహిస్తున్నారు.

వివిధ రాష్ట్ర్రాలవేదికల్లో ప్రారంభమైన ఎలైట్ గ్రూప్ జట్ల తొలిరౌండ్ పోరు రికార్డుల మోతతో హోరెత్తి పోయింది.

52 బంతుల్లోనే రియాన్ సెంచరీ...

అసోం- చత్తిస్ గఢ్ జట్ల నడుమ ముగిసిన తొలిరౌండ్ పోరులో అసోం కెప్టెన్ రియాన్ పరాగ్ రంజీట్రోఫీ చరిత్రలోనే రెండో వేగవంతమైన సెంచరీ సాధించిన బ్యాటర్ గా నిలిచాడు.

ఈ పోరులో అసోం జట్టు ఓడినా..కెప్టెన్ రియాన్ పరాగ్ మాత్రం తన బ్యాట్ పవర్ ఏంటో చాటుకొన్నాడు. రెండో ఇన్నింగ్స్ లో ఒంటరిపోరాటం చేసి రికార్డు శతకం నమోదు చేశాడు.

కేవలం 52 బంతుల్లోనే శతకం పూర్తి చేయడం ద్వారా ఈటోర్నీ చరిత్రలోనే రండో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన బ్యాటర్ గా రికార్డుల్లో చేరాడు.

గ్రేట్ వివియన్ రిచర్డ్స్ సరసన రియాన్..

1985-86 సీజన్లో కరీబియన్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్ సాధించిన రికార్డును ప్రస్తుత రంజీ సీజన్లో రియాన్ పరాగ్ సాధించాడు. గ్రేట్ రిచర్డ్స్ సరసన నిలువగలిగాడు.

భారత క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన బ్యాటర్ వరుసలో 4వ స్థానంలో రియాన్ నిలిచాడు. శక్తిసింగ్, రిషభ్ పంత్, యూసుఫ్ పఠాన్ ..మెరుపు సెంచరీలు బాదిన మొగ్గురు మొనగాళ్లుగా మొదటి మూడుస్థానాలలో నిలిస్తే 22 సంవత్సరాల రియాన్ 4వ స్థానం సంపాదించాడు.

రియాన్ కేవలం 82 బంతుల్లోనే 12 సిక్సర్లు, 11 ఫోర్లతో 154 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు. 188 స్ట్ర్రయిక్ రేట్ తో వారేవ్వా అనిపించుకొన్నాడు.

గతేడాది ముగిసిన దేశవాళీ టీ-20 టోర్నీలో వరుసగా 7 హాఫ్ సెంచరీలు సాధించడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పిన రియాన్ కు 26 ఫస్ట్ క్లాస్ మ్యా్చ్ ల్లో 1,583 పరుగులు సాధించిన ఘనత ఉంది.

ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు ఆడుతున్న రియాన్ పరాగ్ ఇక ముందు కూడా ఇదే జోరు కొనసాగించగలిగితే భారతజట్టులో చోటు సంపాదించడం ఏమంత కష్టం కాబోదు.

జలజ్ సక్సేనా డబుల్ రికార్డు!

ఉత్తర ప్రదేశ్ తో జరిగిన మరో తొలిరౌండ్ పోరులో కేరళ ఆల్ రౌండర్ జలజ్ సక్సేనా అరుదైన డబుల్ రికార్డు నమోదు చేశాడు. దేశవాళీ క్రికెట్లో 9వేల పరుగులు, 600 వికెట్ల మైలురాయిని చేరిన భారత మూడో ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు. యూపీ పై 152 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టడం ద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తాను పడగొట్టిన వికెట్ల సంఖ్యను 602కు పెంచుకోడం ద్వారా రికార్డు డబుల్ మైలురాయిని చేరుకోగలిగాడు.

గతంలో ఇదే రికార్డు సాధించిన మొనగాళ్లలో మదన్ లాల్, వినూ మన్కడ్ మాత్రమే ఉన్నారు.

37 సంవత్సరాల ఆల్ రౌండర్ జలజ్ కు 308 మ్యాచ్ ల్లో 6574, లిస్ట్- ఏ మ్యాచ్ ల్లో 2035 పరుగులు, 70 టీ-20 మ్యాచ్ ల్లో 661 పరుగులు సాధించిన ఘనత ఉంది. మొత్తం 9వేల 270 పరుగులతో తన కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

2005లో మధ్యప్రదేశ్ తరపున తన ఫస్ట్ క్లాస్ కెరియర్ ను ప్రారంభించిన జలజ్ ఆ తరువాత ఢిల్లీకి మారినా..2016 సీజన్ నుంచి కేరళ జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు.

15 సంవత్సరాల తన కెరియర్ లో నిలకడగా రాణిస్తూ వస్తున్న సెలెక్టర్ల దృష్టిని మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. 2023 సీజన్లో అత్యధికంగా 50 వికెట్లు సాధించిన జలజ్ కు తెలివైన స్పిన్ బౌలర్ గా పేరుంది.

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లలో చేరినా 2021 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున ఒకే ఒక్కమ్యాచ్ ఆడే అవకాశం మాత్రమే దక్కింది.

First Published:  9 Jan 2024 8:12 AM GMT
Next Story