Telugu Global
Sports

నోబాల్స్ కింగ్ అర్షదీప్ సింగ్!

భారత యువఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ ఓ చెత్తరికార్డు మూటగట్టుకొన్నాడు. శ్రీలంకతో రెండో టీ-20 మ్యాచ్ లో భారత్ ఓటమికి కారకుడయ్యాడు.

నోబాల్స్ కింగ్ అర్షదీప్ సింగ్!
X

భారత యువఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ ఓ చెత్తరికార్డు మూటగట్టుకొన్నాడు. శ్రీలంకతో రెండో టీ-20 మ్యాచ్ లో భారత్ ఓటమికి కారకుడయ్యాడు...

క్రికెట్ ఫార్మాట్ ఏదైనా..ఓ బౌలర్ నోబాల్ వేయటాన్ని మించిన తప్పిందం మరొకటి ఉండదు. ఒక్క బంతి, ఒక్క పరుగు, ఒక్క తప్పిదం మ్యాచ్ తుదిఫలితాన్ని నిర్ణయించిన సందర్భాలు ఎన్నెన్నో. అలాంటిది...ఒకటికాదు...రెండు కాదు..ఏకంగా ఓ బౌలర్ ఐదు నోబాల్స్ వేస్తే అంతకు మించిన నేరం , ఘోరం మరొకటి ఉండదు.

పూణేవేదికగా శ్రీలంకతో ముగిసిన రెండోవన్డేలో భారత యువఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ ఖచ్చితంగా అలాంటి నేరమే చేశాడు.

నోబాల్స్ లో హ్యాట్రిక్...

ఆస్ట్ర్రేలియా వేదికగా ముగిసిన టీ-20 ప్రపంచకప్ లో భారత్ స్టార్ పేసర్ గా నీరాజనాలు అందుకొన్న 23 సంవత్సరాల అర్షదీప్ సింగ్..గత కొంతకాలంగా గాయాలతో అంతర్జాతీయ మ్యాచ్ లకు దూరంగా ఉంటూ మ్యాచ్ ప్రాక్టీసు లేమితో సతమతమవుతున్నాడు.

శ్రీలంకతో జరుగుతున్న తీన్మార్ టీ-20 సిరీస్ లోని రెండోమ్యాచ్ లో భారత టీమ్ మేనేజ్ మెంట్ అర్షదీప్ సింగ్ కు అవకాశమిచ్చింది. అయితే..ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోగా..భారతజట్టు ఓటమికి కారకుడయ్యాడు. తన కోటా 4 ఓవర్లలో కేవలం 2 ఓవర్లు మాత్రమే వేసి 37 పరుగులు సమర్పించుకొన్న అర్షదీప్ ఐదుసార్లు నోబాల్స్ వేశాడు. ఇందులో వరుసగా వేసిన మూడు నోబాల్స్ సైతం ఉన్నాయి.

అర్షదీప్ వేసిన వరుస నోబాల్స్ ద్వారా లభించిన ఫ్రీహిట్ల ద్వారా శ్రీలంక ఓపెనర్ కుశల్ మెండిస్ ఓ సిక్సర్, బౌండ్రీ చొప్పున బాది తనజట్టుకు 80 పరుగుల మొదటివికెట్ భాగస్వామ్యం అందించడంలో ప్రధానపాత్ర వహించాడు.

భారత ఏకైక బౌలర్....

టీ-20 క్రికెట్లో నోబాల్స్ వేయటం అర్షదీప్ సింగ్ కు ఇదే మొదటిసారికాదు. భారత టీ-20 చరిత్రలోనే అత్యధికంగా 14సార్లు నోబాల్స్ వేసిన తొలి, ఏకైక బౌలర్ అర్షదీప్ సింగ్ మాత్రమే. ప్రపంచ క్రికెట్లో ఈ చెత్త రికార్డు సాధించిన తొలి టీ-20 బౌలర్ గా న్యూజిలాండ్ కు చెందిన హమీష్ రూథర్ ఫోర్డ్ చేరాడు. హామిష్ సైతం 14 నోబాల్స్ తో నిలిచాడు.

న్యూజిలాండ్ బౌలర్ సరసన భారత బౌలర్ అర్షదీప్ సైతం నిలిచాడు.

నోబాల్స్ వేయటం నేరమే- పాండ్యా...

పూణే టీ-20 మ్యాచ్ లో అర్షదీప్ సింగ్ తన రెండుఓవర్ల బౌలింగ్ లోనే ఐదు నోబాల్స్ వేయటాన్ని మించిన నేరం మరొకటి లేదని మ్యాచ్ అనంతరం కెప్టెన్ హార్థిక్ పాండ్యా మండిపడ్డాడు.

తాను అర్షదీప్ సింగ్ ను తప్పుపట్టడం లేదని, ఆటలో వైఫల్యాలు సహజమని..అయితే నోబాల్స్ వేయటం లాంటి ప్రాథమిక తప్పిదాలు ఏమాత్రం సమర్థనీయం కాదని చెప్పాడు.

క్రికెట్ ఫార్మాట్ ఏదైనా బౌలర్లు నోబాల్స్ వేయటం క్షమార్హం కానేకాదని తేల్చి చెప్పాడు. గతంలోనూ అర్షదీప్ కు నోబాల్స్ వేసిన రికార్డు ఉందని, ఈలోపాన్ని అతను సరిచేసుకోక తప్పదని హెచ్చరించాడు.

తాము బ్యాటింగ్, బౌలింగ్ పవర్ ప్లేలో విఫలం కావటమే తమ జట్టు ఓటమికి కారణమని చెప్పాడు. వన్ డౌన్లో అరంగేట్రం బ్యాటర్ రాహుల్ త్రిపాఠీని పంపటాన్ని కెప్టెన్ హార్థిక్ పాండ్యా సమర్థించుకొన్నాడు. వన్ డౌన్లో ఆడటం రాహుల్ త్రిపాఠీకి అలవాటేనని, వన్ డౌన్ అతనికి తగిన స్థానమనే బ్యాటింగ్ కు దించామని వివరించాడు.

First Published:  6 Jan 2023 9:16 AM GMT
Next Story