Telugu Global
Sports

భారత క్రికెటర్లకు సరికొత్త జెర్సీలు

ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ లో జరిగే టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్ల కోసం బీసీసీఐ సరికొత్త జెర్సీలను సిద్ధం చేసింది.

భారత క్రికెటర్లకు సరికొత్త జెర్సీలు
X

ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ లో జరిగే టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్ల కోసం బీసీసీఐ సరికొత్త జెర్సీలను సిద్ధం చేసింది. భారత పురుషుల, మహిళల జట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ లతో పాటు పలువురు క్రికెటర్లు ధరించిన నయాజెర్సీల పోస్టర్ ను బీసీసీఐ ఆవిష్కరించింది...

భారత క్రికెటర్ల కోసం బీసీసీఐ సరికొత్త జెర్సీలను ఆవిష్కరించింది. స్పాన్సర్లు మారిన ప్రతిసారీ మాత్రమే కాదు...ఐసీసీ నిర్వహించే ప్రపంచకప్ టోర్నీలకు సైతం వివిధజట్లు

జెర్సీలను, జెర్సీల డిజైన్లను మార్చుతూ రావడం ఓ సాంప్రదాయంగా వస్తోంది.

అంతేకాదు...టీమ్ జెర్సీలతో ఐసీసీ, బీసీసీఐ కోట్లరూపాయల వ్యాపారం చేస్తున్నాయి. అధికారిక కిట్ స్పాన్ర్సర్లతో పాటు జెర్సీ స్పాన్సర్ల నుంచి కోట్ల రూపాయల ఆదాయాన్ని అటు ఐసీసీ..ఇటు బీసీసీఐ వసూలు చేస్తున్నాయి.

టోర్నీ టోర్నీకి సరికొత్త జెర్సీలు..

అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రతిరెండు సంవత్సరాలకు ఓసారి పురుషుల, మహిళల విభాగాలలో నిర్వహించే టీ-20, వన్డే ప్రపంచకప్ లతో పాటు మినీ ప్రపంచకప్, ఐసీసీ

టెస్టు లీగ్ పోటీలకు సైతం వేర్వేరుగా జెర్సీలను ఆవిష్కరిస్తూ రావడం ఓ ఆనవాయితీగా వస్తోంది.

ఇటీవలే దుబాయ్ వేదికగా ముగిసిన ఆసియాకప్ లో పాల్గొన్న భారతజట్టు ధరించిన జెర్సీలకు భిన్నంగా టీ-20 ప్రపంచకప్ జెర్సీలను రూపొందించారు. ఆస్ట్ర్రేలియా వేదికగా అక్టోబర్ -నవంబర్ మాసాలలో జరుగనున్న 2022 టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్లు సరికొత్త డిజైనర్ జెర్సీలు ధరించి మరీ పోటీలలో పాల్గోనున్నారు.


ప్రత్యేకంగా ఫోటోషూట్ కార్యక్రమం...

టీ-20 ప్రపంచకప్ జెర్సీల ఆవిష్కరణ కోసం గతంలోనే బీసీసీఐ పలు ఫోటో షూట్ కార్యక్రమాలను రూపొందించింది. ఈ కార్యక్రమంలో భారత కెప్టెన్లు రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ లతో పాటు సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, రేణుకా సింగ్ పాల్గొన్నారు. మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు విరాట్ కొహ్లీ ఈసారి జెర్సీ షూటింగ్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాడు.

భారత క్రికెటర్లు ధరించే లైట్ బ్లూ టీ-షర్ట్ చేతుల భాగాన్ని ముదురు నీలిరంగుతో రూపొందించారు. ట్రౌజర్లు మాత్రం తేలికపాటి నీలిరంగుతోనే ఉంటాయి. ప్రపంచకప్ టోర్నీ జరిగే సమయంలో ఆస్ట్ర్రేలియాలోని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జెర్సీలను రూపొందించారు.

భారత క్రికెట్ అభిమానుల కోసం సైతం సరికొత్తగా రూపొందించిన అధికారిక జెర్సీలను తయారు చేశారు. జెర్సీల విక్రయం ద్వారానే ప్రపంచ వ్యాప్తంగా కోట్ల రూపాయల వ్యాపారం జరుగనుంది.

ప్రపంచకప్ కు సన్నాహకాలలో భాగంగా ఆస్ట్ర్రేలియా, దక్షిణాఫ్రికాజట్లతో తీన్మార్ టీ-20 సిరీస్ ల ప్రారంభానికి రెండురోజుల ముందే బీసీసీఐ సరికొత్త జెర్సీలను ఆవిష్కరించింది.

బైజూస్, ఎమ్పీఎల్ భారతజట్ల జెర్సీల స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి.

First Published:  19 Sep 2022 5:30 AM GMT
Next Story