Telugu Global
Sports

జాతీయ క్రీడాపురస్కారాల ప్రదానం...సాత్విక్ జోడీకి 'ఖేల్ రత్న', షమీకి 'అర్జున'!

వివిధ క్రీడల్లో అత్యుత్తమంగా రాణించిన 30 మంది క్రీడాకారులకు దేశ అత్యున్నత క్రీడాపురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రదానం చేశారు.

జాతీయ క్రీడాపురస్కారాల ప్రదానం...సాత్విక్ జోడీకి ఖేల్ రత్న, షమీకి అర్జున!
X

2023 సంవత్సరానికి దేశ అత్యున్నత క్రీడాపురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నను బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ షెట్టి జోడీ అందుకొన్నారు...

వివిధ క్రీడల్లో అత్యుత్తమంగా రాణించిన 30 మంది క్రీడాకారులకు దేశ అత్యున్నత క్రీడాపురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రదానం చేశారు.

దేశఅత్యున్నత క్రీడాపురస్కారం ధ్యాన్ చంద్ ఖేల్ రత్నను బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ ప్రపంచ నంబర్ వన్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ షెట్టి స్వీకరించారు.

ఆంధ్ర మూడో బ్యాడ్మింటన్ ప్లేయర్ సాత్విక్.....

ఆంధ్రప్రదేశ్ కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారులకు దేశఅత్యున్నత క్రీడాపురస్కారం అందుకోడం ఓ ఆనవాయితీగా వస్తోంది. గతంలో పుల్లెల గోపీచంద్, పీవీ సింధు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం అందుకొన్న ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ స్టార్లు కాగా...ఇప్పుడు సాత్విక్ సాయిరాజ్ వారి సరసన నిలిచాడు. అరుదైన ఈ అవార్డు అందుకొన్న ఆంధ్రప్రదేశ్ మూడో బ్యాడ్మింటన్ ప్లేయర్ ఘనతను అమలాపురం కుర్రోడు సాత్విక్ సాయిరాజ్ దక్కించుకొన్నాడు.

అత్యుత్తమ విజయాలు, రికార్డులతో....

గత ఏడాదికాలంలో ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో పలు అరుదైన విజయాలు, ప్రపంచ, కామన్వెల్త్ గేమ్స్, ఆసియాక్రీడల పతకాలు సాధించడం ద్వారా సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ ఏకంగా ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను చేరుకోడం ద్వారా చరిత్ర సృష్టించారు.

ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో గత రెండేళ్లుగా నిలకడగా రాణిస్తూ దేశానికి ఖ్యాతి తెచ్చిన ఈ జోడీ పేరును ఖేల్ రత్న పురస్కారానికి సిఫారసు చేయగా..అవార్డుల ఎంపిక సంఘం ఆమోదం తెలిపింది.

న్యూఢిల్లీలోని రాష్ట్ర్రపతి భవన్ వేదికగా ఈరోజు వేడుకగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో క్రీడాపురస్కారాలను రాష్ట్ర్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు.

26మంది అర్జున పురస్కారాలు...

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీతో సహా వివిధ క్రీడలకు చెందిన మరో 25 మందికి అర్జున అవార్డులను రాష్ట్ర్రపతి అందచేశారు. ఇటీవలే ముగిసిన వన్డే ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించడం ద్వారా అత్యుత్తమ బౌలర్ అవార్డు అందుకొన్న 33 సంవత్సరాల షమీ అర్జున అవార్డు స్వీకరించాడు.

అర్జున అవార్డుకు ఎంపికైన ఇతర క్రీడాకారులలో హాకీ జోడీ కృష్ణ బహుదూర్ పాఠక్, సుశీల చాను, విలువిద్య క్రీడాకారులు ఓజాస్ ప్రవీణ్ డియోటేల్, ఆదితి గోపీచంద్ స్వామి, బాక్సర్ మహ్మద్ హుస్సాముద్దీన్, చదరంగ గ్రాండ్ మాస్టర్ వైశాలి, గోల్ఫర్ దీక్ష డాగర్, షూటర్ ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, ఈషాసింగ్, వస్తాదులు అంతిమ్ పంగల్, సునీల్ కుమార్, టీటీ ప్లేయర్ ఐహిక ముఖర్జీ, పారా ఆర్చర్ షీతల్ దేవీ ఉన్నారు.

ముగ్గురికి జీవనసాఫల్య పురస్కారాలు...

ఐదుగురు విఖ్యాత శిక్షకులకు ద్రోణాచార్య అవార్డులు, ముగ్గురు ప్రముఖులకు జీవనసాఫల్య పురస్కారాల కింద ధ్యాన్ చంద్ అవార్డులను సైతం ప్రదానం చేశారు.

డిసెంబర్ 13న క్రీడాపురస్కారాల కోసం వివిధ క్రీడాసంఘాలు తమ ప్లేయర్లను నామినేట్ చేయగా...ఎంపిక సంఘం వివరాలను పరిశీలించి ఆమోదం తెలిపింది.

తెలంగాణాకు చెందిన బాక్సర్ హుసాముద్దీన్ సైతం అర్జున పురస్కారం అందుకొన్నాడు.

First Published:  9 Jan 2024 12:25 PM GMT
Next Story