Telugu Global
Sports

రాహుల్ గాంధీపై లలిత్ మోడీ పరువునష్టం దావా!

రాహుల్ గాంధీపై పరువునష్టం దావా వేస్తున్నట్లు ఇంగ్లండ్ లో తలదాచుకొంటున్న లలిత్ మోడీ ప్రకటించారు

రాహుల్ గాంధీపై లలిత్ మోడీ పరువునష్టం దావా!
X

రాహుల్ గాంధీపై పరువునష్టం దావా వేస్తున్నట్లు ఇంగ్లండ్ లో తలదాచుకొంటున్న లలిత్ మోడీ ప్రకటించారు. లండన్ కోర్టుకు రాహుల్ తాను ఈడ్చడం ఖాయమని హెచ్చరించారు.

మోడీలను మోసగాళ్లంటూ వ్యాఖ్యానించి..పార్లమెంట్ సభ్యుడిగా అనర్హత వేటుకు గురైన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పరిస్థితి ఇంత బతుకూ బతికి అన్నట్లుగా తయారయ్యింది.

చివరకు..ఆర్థికనేరాలపై దేశం నుంచి పారిపోయి..ఇంగ్లండ్ లో తలదాచుకొంటున్న ఐపీఎల్ బోర్డు మాజీ చైర్మన్ లలిత్ మోడీ సైతం పరువు నష్టం దావా వేస్తానంటూ బెదిరిస్తున్నాడు.

దొంగలందరి ఇంటి పేరు మోదీ ఎలా అవుతుందో తనకు అర్థంకావటం లేదని, లలిత్ మోడీ, నీరవ్ మోడీ అంటూ.. 2019లో కర్ణాటకలో ప్రశ్నించిన రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా కొద్దిరోజుల క్రితమే గుజరాత్‌లోని సూరత్ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆఘమోఘాల మీద రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్నిరద్దు చేస్తున్నట్లు పార్లమెంట్ సచివాలయం ప్రకటించింది.

రాహుల్ తో పాటు, ఆయన సహచరులు కొందరు లలిత్ మోదీ చట్టం నుంచి తప్పించుకుంటున్న వ్యక్తి అని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో లలిత్ మోదీ ఘాటుగా స్పందించారు.

రాహుల్ పై ట్విట్ల సమరం..

లలిత్ మోదీ గురువారం ఇచ్చిన వరుస ట్వీట్లలో రాహుల్ గాంధీని, ఆయన సహచరులను నిలదీశారు. తనను ‘‘పరారైన వ్యక్తి’’గా ఏ విధంగా ముద్ర వేస్తారని నిలదీశారు. తాను దోషినని ఏ కోర్టు తీర్పు చెప్పలేదని.. తాను సాధారణ పౌరుడినని చెప్పారు. ఇదంతా ప్రతిపక్ష నేతల కక్షసాధింపు చర్య అంటూ ఎదురుదాడికి దిగారు.

రాహుల్ పై లండన్ కోర్టులో కేసు పెడతానని, పరువు నష్టం దావా వేయటం ఖాయమని హెచ్చరించారు. మోదీ ఇంటి పేరుపై ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన సహచరులు తనను ‘చట్టం నుంచి తప్పించుకుంటున్న వ్యక్తి’గా ఆరోపిస్తుండటం తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని తెలిపారు.

‘‘నేను చట్టం నుంచి తప్పించుకుని, విదేశాలకు పారిపోయిన వ్యక్తినని ఎవరు పడితే వారు, రాహుల్ గాంధీ సహచరులు పదేపదే వ్యాఖ్యానించడం చూస్తున్నాను. ఇలా ఎందుకు? ఎలా? జరుగుతుందో నాకు అర్థంకావడంలేదు. నేను దోషినని ఈ రోజు వరకు ఎప్పుడైనా తీర్పు వచ్చిందా? పప్పు ఉరఫ్ .. రాహుల్ గాంధీ మాదిరిగా కాకుండా, నేను ఇప్పుడు ఓ సాధారణ పౌరుడిని, నేను చెప్తున్నాను, ప్రతిపక్ష నేతలకు వేరే పని ఏమీ లేదు, వారికి కూడా సరైన సమాచారం లేకపోవచ్చు లేదా కేవలం కక్ష సాధించడానికి వారు ముందడుగు వేస్తుండవచ్చు. కనీసం రాహుల్ గాంధీనైనా ఇప్పుడే బ్రిటన్ కోర్టుకు లాక్కెళ్లాలని నేను నిర్ణయించుకున్నాను. ఆయన స్పష్టమైన సాక్ష్యాధారాలతో రావలసి ఉంటుందని కచ్చితంగా చెప్పగలను. ఆయన తనను తాను పరిపూర్ణ మూర్ఖుడిగా చేసుకోవడాన్ని చూడాలని నేను ఎదురు చూస్తున్నాను. గాంధీ కుటుంబం తరపున సంచులు మోసే ఆర్‌కే ధావన్, సీతారామ్ కేసరి, మోతీలాల్ వోరా, సతీశ్ శర్మ, నారాయణ్ దత్ తివారీ వంటివారికి విదేశాల్లో ఆస్తులు ఎలా వచ్చాయి? కమల్‌నాథ్‌ను అడగండి.’’ అని ఓ ట్వీట్‌లో లలిత్ మోదీ చెప్పారు.

గాంధీ కుటుంబం పై దాడి...

‘‘నేను నిజమైన అవినీతిపరుల చిరునామాలు, ఫొటోలు వంటివాటిని పంపిస్తాను. మనం భారతీయులను వెర్రివాళ్లను చేయవద్దు. దేశాన్ని పరిపాలించే అర్హత తమకు మాత్రమే ఉందన్నట్లుగా గాంధీ కుటుంబం చేస్తోంది. కట్టుబడి ఉండదగిన కఠినమైన చట్టాలను మీరు చేసినపుడు నేను కచ్చితంగా తిరిగి వస్తాను. జై హింద్’’ అని మరొక ట్వీట్‌లో లలిత్ మోదీ తన అక్కసు వెళ్లగక్కాడు.

‘‘ ఇప్పటి వరకు నేను పైసా అయినా తీసుకున్నట్లు గడచిన 15 ఏళ్ళలో రుజువు కాలేదు. ఈ ప్రపంచంలో అత్యద్భుతమైన స్పోర్టింగ్ ఈవెంట్‌ను నేను సృష్టించానని స్పష్టంగా రుజువైంది. దీనివల్ల దాదాపు 100 బిలియన్ డాలర్ల సంపద వచ్చింది. 1950వ దశకం నుంచి మోదీ కుటుంబం.. కాంగ్రెస్‌వారి కోసం, దేశం కోసం ఎంతో చేసిందని, వారి ఊహకు అందనంత ఎక్కువ చేసిందని ఏ ఒక్క కాంగ్రెస్ నేతా మరచి పోకూడదు. నేను సైతం ఎవ్వరూ ఊహించనంత గొప్పగా ఐపీఎల్ ను సృష్టించాను. అందువల్ల గాంధీ కుటుంబీకుల వంటి కుంభకోణాల కళంకిత భారతీయ దోపిడీదారులారా మొరుగుతూనే ఉండండి... జై హింద్’’ అని మూడో ట్వీట్‌లో లలిత్ మోదీ స్పష్టం చేశారు.

లలిత్ మోదీ ఈ ట్వీట్లను చాలా మంది కాంగ్రెస్ నేతలకు ట్యాగ్ చేశారు. వారందరికీ విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని ఆరోపించారు. రాహుల్ గాంధీ 2019లో కర్ణాటకలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడుతూ దొంగలందరికీ ఇంటి పేరు మోదీ ఎలా అవుతోందని ప్రశ్నించడంతో, ఆయనపై దావా వేస్తానని లలిత్ మోదీ అప్పట్లోనే ప్రకటించారు.

ఐపీఎల్ నిర్వహణ సమయంలో పలు ఫ్రాంచైజీల నుంచి లంచాలు తీసుకోడంతో పాటు అవకతవకలకు పాల్పడినట్లు లలిత్ మోడీపై ఆరోపణలు ఉన్నాయి. తనపైన ఎక్కడ కేసులు పెట్టి జైల్లో వేస్తారోనని భయపడి..ఇంగ్లండ్ కు పారిపోయిన లలిత్ మోడీ గత 15 సంవత్సరాలుగా..ఆశ్రయం పొందుతున్నారు. దేశంలోని పలు బ్యాంకులను కోట్ల రూపాయలకు ముంచిన నీరవ్ మోడీ సైతం ఇంగ్లండ్ లోనే తలదాచుకొంటున్న సంగతి తెలిసిందే.

ఆర్థిక నేరస్థులను జట్టు పట్టుకొని దేశానికి ఈడ్చుకు వస్తానంటూ ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన ప్రధాన నరేంద్ర మోడీ..అన్నమాటను నిలబెట్టుకోలేకపోడం చర్చకు దారితీయటమే కాదు..విమర్శలకు దారితీసింది.

First Published:  30 March 2023 8:10 AM GMT
Next Story