Telugu Global
Sports

ఐపీఎల్ -16 ప్రత్యక్షప్రసారాల ప్రపంచ రికార్డు!

అహ్మదాబాద్ వేదికగా ముగిసిన ఐపీఎల్ -16వ సీజన్ టైటిల్ సమరం పలు విధాలుగా సరికొత్త ప్రపంచ రికార్డులకు వేదికగా నిలిచింది.

IPL 16: ఐపీఎల్ -16 ప్రత్యక్షప్రసారాల ప్రపంచ రికార్డు!
X

ఐపీఎల్ -16 ప్రత్యక్షప్రసారాల ప్రపంచ రికార్డు!

అహ్మదాబాద్ వేదికగా ముగిసిన ఐపీఎల్ -16వ సీజన్ టైటిల్ సమరం పలు విధాలుగా సరికొత్త ప్రపంచ రికార్డులకు వేదికగా నిలిచింది.

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంవేదికగా మొదలై.. అదే స్టేడియం వేదికగా ముగిసిన ఐపీఎల్ -16వ సీజన్ షో పలు విధాలుగా అత్యంత విజయవంతమైన, జనాదరణ పొందిన క్రికెట్ టోర్నీగా నిలిచింది.

గుజరాత్ టైటాన్స్- చెన్నై సూపర్ కింగ్స్ జట్ల నఢుమ మే 30న జరిగిన టైటిల్ సమరాన్ని ప్రత్యక్షప్రసారాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్లమంది వీక్షించడం ద్వారా సరికొత్త ప్రపంచ రికార్డుకు కారణమయ్యారు.

వర్షం కారణంగా ఒకరోజు ఆలస్యంగా జరిగిన ఈటోర్నీ ప్రత్యక్షప్రసారాలను రిలయన్స్ గ్రూప్ కు చెందిన జియో సినిమా చేపట్టింది. ఏడువారాలు, 74మ్యాచ్ లు గా సాగిన ఈ టోర్నీప్రత్యక్షప్రసారాలను జియో సినిమా ఉచితంగా వీక్షకులకు అందుబాటులో ఉంచింది.

3 కోట్ల 20 మందితో ప్రపంచరికార్డు..

సాధారణంగా క్రికెట్ ఫైనల్స్ మ్యాచ్ లను ఆదివారంనాడు మాత్రమే ప్రత్యక్షప్రసారం చేస్తూ ఉంటారు. అయితే..ఆదివారం జరగాల్సిన ఐపీఎల్ -16 ఫైనల్స్ ను వర్షంకారణంగా ఆ మరుసటిరోజు (సోమవారంనాటికి )కు వాయిదా వేసి ..రిజర్వ్ డే రోజును నిర్వహించారు. అయినా..ఈ మ్యాచ్ ను అనూహ్యంగా 3 కోట్ల 20 లక్షల మంది ప్రత్యక్షప్రసారాల ద్వారా వీక్షించినట్లు జియో సినిమా ప్రకటించింది. క్రికెట్ ప్రత్యక్షప్రసారాల చరిత్రలో ఇదే అత్యుత్తమమని, ఓ క్రికెట్ మ్యాచ్ ను 3 కోట్ల 25 లక్షలమంది ప్రత్యక్షప్రసారాల ద్వారా చూడటం ఇదే మొదటిసారని, ఇదో ప్రపంచ రికార్డు కూడానని జియో సినిమా వివరించింది.

ఆమ్యాచ్ ను మించి ఈ మ్యాచ్...

2019 లో భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ను హాట్ స్టార్ ప్రత్యక్షప్రసారం చేసిన సమయంలో 2 కోట్ల 53 లక్షలమంది వీక్షించారు. గత కొద్దిసంవత్సరాలుగా అదే ప్రపంచ రికార్డుగా కొనసాగుతూ వచ్చింది. అయితే..ప్రస్తుత సీజన్ ఐపీఎల్ మ్యాచ్ ను 3 కోట్ల 25 లక్షల మంది వీక్షించడంతో హాట్ స్టార్ రికార్డును జియో సినిమా తెరమరుగు చేసినట్లయ్యింది.

2023-2027 మధ్యకాలంలో ఐపీఎల్ డిజిటల్ ప్రసారహక్కులను జియో సినిమా దక్కించుకొంది.

గుజరాత్ టైటాన్స్ వన్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 96 పరుగుల స్కోరుతో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అత్యధికంగా 3 కోట్ల 20 లక్షలమంది వీక్షించినట్లు జియో సినిమా వివరించింది.

ఐపీఎల్ -16 సీజన్లో..గతంలో ఎన్నడూలేనంతగా వివిధజట్ల మధ్య పోరు సాగింది. మొత్తం 74 మ్యాచ్ ల్లో 37సార్లు 200కు పైగా స్కోర్లు నమోదు కావడంమే కాదు..

అత్యధిక సిక్సర్లు, అత్యధిక స్ట్ర్రయిక్ రేట్, అత్యధిక సెంచరీలు, అత్యధిక హాఫ్ సెంచరీలలో సైతం సరికొత్త రికార్డులు నమోదయ్యాయి.

ప్రస్తుత సీజన్ ఫైనల్ పోరుతో సహా పలుమ్యాచ్ లు ఆఖరి బంతి వరకూ పట్టుగా సాగటంతో ఐపీఎల్ కు ఆదరణ గతానికి మించి ఎక్కువగా నమోదయింది.

ఫలించిన రిలయన్స్ మార్కెట్ వ్యూహం...

వ్యాపారానికి కాదేదీ అనర్హమన్న మాట రిలయన్స్ గ్రూప్ కు అతికినట్లు సరిపోతుంది. దేనితోనైనా లాభాసాటి వ్యాపారం చేయగల నేర్పు ముంబై ఇండియన్స్ యజమాని ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ నకు మాత్రమే ఉంది.

ఐపీఎల్ ప్రసారహక్కుల్లో అధికభాగాన్ని 2023 నుంచి 2027 కాలానికి రిలయన్స్ గ్రూప్ దక్కించుకోగలిగింది. రిలయన్స్ సంస్థే 23వేల 758 కోట్ల రూపాయలు చెల్లిస్తోంది. వేల కోట్ల రూపాయలు పోసి దక్కించుకొన్న ప్రసారహక్కులను రిలయన్స్ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోడానికి పక్కావ్యూహాలతో

పోటీకి దిగింది. ఐపీఎల్ ప్రసారాలు ఉచితమంటూ అభిమానులకు వల వేసింది. తన నెట్ వర్క్ ద్వారా విస్త్ర్రుత ప్రచారం చేసింది.

ఐపీఎల్ ప్రసారాలకు అత్యధిక రేటింగ్ ఉండడంతో బహుళ జాతి సంస్థలతో పాటు దేశీయ వ్యాపార దిగ్గజాలు సైతం తమ తమ ఉత్పత్తుల ప్రచారం కోసం..

ఐపీఎల్ వేదికను వాడుకోడానికి పోటీపడుతున్నాయి.

ఫ్రాంచైజీలలో ముంబై టాప్...

అంబానీకి చెందిన వయాకామ్- 18 సంస్థ 2023 ఐపీఎల్ సీజన్లో స్పాన్సర్ల నుంచి 3వేల 700 కోట్ల రూపాయలు రాబట్టాలని లక్ష్యంగా వ్యాపారం చేసింది. టోర్నీ ప్రారంభానికి ముందే 2వేల 700 కోట్ల రూపాయల మేర వ్యాపారం పూర్తి చేయగలిగింది. వయాకామ్ -18కు చెందిన జియో సినిమా ఓటీటీ వేదికగా పలు స్పాన్సర్లు ముందుకు వచ్చాయి. వీటిలో డ్రీమ్యూ, జియో మార్ట్, ఫోన్ పే, టాటాన్యూ, అజియో, పార్లే అగ్రో, ఈటీ మనీ, హేయర్, టీవీఎస్, క్యాడ్ బరీ, ఐటీసీ, కోకా-కోలా, కమలా పసంద్, ప్యూమా, అల్ట్ర్రాటెక్, కింగ్ ఫిషర్,ర్యాపిడో, అమెజాన్, లూయి ఫిలిప్పీ, ఇండీడ్ ఉన్నాయి.

రిలయన్స్ గ్రూప్ కు చెందిన రైజ్ వరల్డ్ వైడ్ సంస్థ 400 కోట్ల రూపాయల విలువైన 60 స్పాన్సర్ షిప్ ఒప్పందాలను కుదుర్చుకోగలిగింది.

మిగిలిన క్రీడల లీగ్ లతో పోల్చిచూస్తే..ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసారాల ద్వారానే తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకొనే సమయం బహుళజాతి సంస్థలకు ఎక్కువగా ఉంటోదని, ఐపీఎల్ ను మించిన వేదిక మరొకటి లేదని మార్కెటింగ్ నిపుణలు చెబుతున్నారు.

ఐపీఎల్ ప్రసారాల ద్వారా హెర్బాలైఫ్ సైతం తన బ్రాండ్ ప్రచారం కోసం ముందుకు వచ్చింది. దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీక రించింది. ఫ్యాంటసీ స్పోర్ట్స్ యాప్ లు సైతం ఇబ్బడిముబ్బడిగా పుట్టుకు వచ్చాయి.

100 నుంచి 120కోట్ల ఆదాయం..

లీగ్ లో పోటీకి దిగిన మొత్తం 10 ఫ్రాంచైజీలు..ప్రస్తుత 16వ సీజన్లో 100 నుంచి 120 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రిలయన్స్ గ్రూప్ నకు చెందిన ముంబై ఫ్రాంచైజీ ఆదాయం 20 నుంచి 22 శాతానికి పెరగటం ఖాయమని భావిస్తున్నారు. జియో సినిమా వేదికగా భారీగా ఆర్జించింది.

ఐదుసార్లు విజేత ముంబై జట్టుకే 25 రకాల స్పాన్సర్లు ఉండటం ఓ రికార్డుగా నిలిచిపోతుంది. ప్రస్తుత సీజన్లో 11 సరికొత్త స్పాన్సర్ షిప్ లు రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై జట్టుకు దక్కాయి.

మొత్తం మీద..ఐపీఎల్ పురుషుల, మహిళల విభాగాలలో ముంబై ఫ్రాంచైజీకి యజమానిగా ఉన్న రిలయన్స్ గ్రూప్ డిజిటల్ మీడియా హక్కులు సైతం దక్కించుకోడం ద్వారా వేలకోట్ల రూపాయల వ్యాపారం చేయగలుగుతోంది.

First Published:  31 May 2023 11:00 AM GMT
Next Story