Telugu Global
Sports

హెచ్‌సీఏ అధ్యక్షుడిగా జగన్‌మోహన్‌రావు విజయం

హెచ్‌సీఏ అధ్యక్షుడిగా యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానల్‌కు చెందిన ఏ. జగన్‌మోహన్‌రావు విజయం సాధించారు.

హెచ్‌సీఏ అధ్యక్షుడిగా జగన్‌మోహన్‌రావు విజయం
X

ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఆవరణలో ఉన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కార్యాలయంలో అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. 173 ఓట్లకు గాను 169 ఓట్లు పోలైనట్లు రిటర్నింగ్ అధికారి సంపత్ తెలిపారు. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.

హెచ్‌సీఏ అధ్యక్షుడిగా యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానల్‌కు చెందిన ఏ. జగన్‌మోహన్‌రావు విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థిపై ఒక ఓటు తేడాతో గెలిచినట్లు ప్రకటించారు. అయితే ఇతర ప్యానల్ సభ్యులు రీకౌంటింగ్‌కు పట్టుబట్టారు. రీకౌంటింగ్‌లోనూ జగన్‌మోహన్‌రావు ఒక ఓటు తేడాతో విజయం సాధించినట్లు పోలింగ్ అధికారులు స్పష్టం చేశారు. కాగా, యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏకు అధికార బీఆర్ఎస్ మద్దతు ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఆ ప్యానల్‌కు చెందిన అభ్యర్థే ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఇక హెచ్‌సీఏ గుడ్ గవర్నెన్స్ ప్యానల్‌కు చెందిన దల్జీత్ సింగ్ ఉపాధ్యక్షుడిగా, బసవరాజు జాయింట్ సెక్రటరీగా విజయం సాధించారు. క్రికెట్ ఫస్ట్ ప్యానల్‌కు చెందిన ఆర్.దేవరాజ్ సెక్రటరీగా గెలుపొందారు. ఇదే ప్యానల్‌కు చెందిన సునీల్ కుమార్ కౌన్సిలర్‌గా విజయం సాధించారు. యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానల్‌కు చెందిన సీజే.శ్రీనివాసరావు ట్రెజరర్‌గా ఎన్నికయ్యారు. మొత్తంగా క్రికెట్ ఫస్ట్, యునైటెడ్ మెంబర్స్ ఫర్ హెచ్‌సీఏ ప్యానల్స్ నుంచే ఇద్దరు చొప్పున కీలక పదవులకు ఎన్నిక కావడం గమనార్హం. గుడ్ గవర్నెన్స్ ప్యానల్ నుంచి ఒక్క ఉపాధ్యక్షుడు మాత్రమే గెలుపొందారు.

First Published:  20 Oct 2023 2:19 PM GMT
Next Story