Telugu Global
Sports

నేటినుంచే ఐపీఎల్ -16 హంగామా!

భారత క్రికెట్ అభిమానుల వేసవి వినోదం ఐపీఎల్ 16వ సీజన్ సందడి ఈరోజు నుంచి ప్రారంభంకానుంది.

నేటినుంచే ఐపీఎల్ -16 హంగామా!
X

భారత క్రికెట్ అభిమానుల వేసవి వినోదం ఐపీఎల్ 16వ సీజన్ సందడి ఈరోజు నుంచి ప్రారంభంకానుంది. పదిజట్ల ఈ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పోరు దేశంలోని వివిధ స్టేడియాలు వేదికలుగా 50 రోజులపాటు జరుగనుంది.....

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ లీగ్ ఐపీఎల్ ఏడాది ఏడాదికి కొత్తపుంతలు తొక్కుతోంది. గత 15 సంవత్సరాలుగా అభిమానులను అలరిస్తూ వస్తున్న ఐపీఎల్ పలు రకాల ఆటుపోట్లకు తట్టుకు నిలబడి జనరంజకంగా సాగిపోతూ వస్తోంది.


పదిజట్ల నడుమ స్టార్స్ వార్....

డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్, నాలుగుసార్లు విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్, గత 15సీజన్లలో కనీసం ఒక్కసారీ విజేతగా నిలువలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లతో పాటు..మరో మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్, కింగ్స్ పంజాబ్, మూడుసార్లు విజేత కోల్ కతా నైట్ రైడర్స్, తొలి టోర్నీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు..రెండుమాసాలపాటు సాగే పోరుకు సై అంటే సై అంటున్నాయి

గత మూడుసంవత్సరాలుగా కరోనా దెబ్బతో కొన్ని వేదికలకే పరిమితమైన ఐపీఎల్‌.. ఈ సారి పాత పద్దతిలోనే ఇంటా..బయట మ్యాచ్ లతో ప్రేక్షకులను అలరించనుంది.

లీగ్ దశలో 14 మ్యాచ్ లు...

ఏడువారాలపాటు సుదీర్ఘంగా సాగే ఈ లీగ్ లో మొత్తం 10 జట్లు 14 మ్యాచ్‌ల చొప్పున ఆడనున్నాయి. ఏడు మ్యాచ్‌లు హోంగ్రౌండ్‌లోనూ,

మిగిలినే ఏడు మ్యాచ్‌లు ప్రత్యర్థి వేదికల్లోనూ జరుగనున్నాయి.

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈరోజు జరిగే ప్రారంభమ్యాచ్ లో ప్రస్తుత చాంపియన్, హార్థిక్ పాండ్యా నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ తో..వెటరన్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.

రాత్రి 7-30 గంటలకు ప్రారంభమయ్యే సీజన్ ఈ తొలిసమరం కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

చెన్నైకి.. బెన్ స్టోక్స్ సూపర్ పవర్...

గత 15 సీజన్లలో నాలుగుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన చెన్నై..ప్రస్తుత 16వ సీజన్ బరిలోకి బెన్ స్టోక్స్ సూపర్ పవర్ తో టైటిల్ వేటకు దిగుతోంది. డేవిడ్ కాన్వె, రితురాజ్ గయక్వాడ్ లతో పాటు అంబటి రాయుడు, స్పిన్ ఆల్ రౌండర్లు మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, పేస్ ఆల్ రౌండర్ దీపక్ చహార్ లతో సమతూకంతో కనిపిస్తోంది.

42 సంవత్సరాల లేటు వయసులో చెన్నైజట్టుకు మరోసారి పూర్తిస్థాయి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన పోరాటయోధుడు ధోనీ తన అపారఅనుభవాన్ని ఉపయోగించి మరోసారి తనజట్టును విజేతగా నిలపాలన్న పట్టుదలతో ఉన్నాడు.

ఈ సీజన్‌ నుంచి ఐపీఎల్‌ నిబంధనల్లో పలు వినూత్న మార్పులు చోటు చేసుకోగా.. ఇంపాక్ట్‌ ప్లేయర్‌, టాస్‌ తర్వాత ప్లేయింగ్‌ ఎలెవన్‌ ప్రకటించడం వంటి అంశాలను ధోనీ ఎంత సమర్థవంతంగా వినియోగించుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది.

సమరోత్సాహంతో గుజరాత్ టైటాన్స్...

అరంగేట్రం సీజన్లోనే విజేతగా నిలిచిన గుజరాత్ టైటాన్స్..సూపర్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా నాయకత్వంలో బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ కు గురిపెట్టింది. యంగ్ గన్ శుభ్ మన్ గిల్, స్పిన్ జాదూ రషీద్ ఖాన్, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, యువపేసర్ శివమ్ మావీ, కేన్ విలియమ్స్ సన్ లాంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లతో గుజరాత్ భీకరంగా కనిపిస్తోంది.

హోంగ్రౌండ్ అహ్మదాబాద్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ నుంచి గుజరాత్ టైటాన్స్ గట్టి పోటీ ఎదుర్కోనుంది.

ముంబై ఇండియన్స్ కి యువరక్తం...

ఐపీఎల్ 15 సీజన్లలో చరిత్రలోనే ఐదుసార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్..ప్రస్తుత సీజన్లో పడిలేచిన కెరటంలా దూసుకురానుంది. గత సీజన్ లో దారుణంగా విఫలమైన ముంబై జట్టు ఎక్కువమంది యువఆటగాళ్లతో ఈసారి తన అదృష్టం పరీక్షించుకొంటోంది.

డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టులో ఇషాన్ కిషన్, ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్, డేవాల్డ్ బ్రెవిస్, టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, హృతిక్ షౌకీన్, కుమార కార్తికేయ పవర్ ఫుల్ హిట్టర్లు కమ్ సూపర్ బ్యాటర్లున్నారు. బౌలింగ్ లో ఇంగ్లండ్ మెరుపు ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కీలకం కానున్నాడు.

బెంగళూరు ఈసారైనా...?

గొప్పగొప్ప ఆటగాళ్లున్నా..గత 15 సీజన్లలో కనీసం ఒక్కసారీ విజేతగా నిలువలేకపోయిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఈసారైనా విజేతగా నిలుస్తుందా? అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

విరాట్ కొహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ లాంటి మేటి బ్యాటర్లున్నా బెంగళూరు బోల్తా కొడుతూనే వస్తోంది. ఐపీఎల్‌ ప్రారంభసీజన్ నుంచి ఒకే జట్టుకు ఆడుతూ వస్తున్న ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన విరాట్‌ కోహ్లీ ఏ స్థాయిలో రాణించగలడన్న అంశం పైనే బెంగళూరు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. కెప్టెన్‌ డుప్లెసిస్‌తో పాటు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్‌, రజత్ పాటిదార్, దినేశ్ కార్తీక్ కీలకం కానున్నారు.

బౌలింగ్ విభాగంలో మహ్మద్ సిరాజ్, స్పిన్ వండర్ వనిందు హసరంగ ప్రధానపాత్ర పోషించనున్నారు.

రై..రై..సన్ రైజర్స్......

ఈసారైనా హైదరాబాద్ సన్ రైజర్స్ పూర్తిస్థాయిలో చెలరేగిపోవాలని అభిమానులు కోరుకొంటున్నారు. డేవిడ్‌ వార్నర్‌, కేన్‌ విలియమ్సన్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లను వదిలేసుకున్న సన్‌రైజర్స్‌ ఈ సారి దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ ఎయిడెన్‌ మర్కరమ్ కు జట్టు పగ్గాలు అప్పగించింది. దక్షిణాఫ్రికా టీ-20 లీగ్‌లో తన జట్టుకు టైటిల్‌ సాధించిపెట్టిన మర్కరమ్ ఐపీఎల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. గత రెండు సీజన్లుగా ఐపీఎల్లో హైదరాబాద్‌ ప్రదర్శన దారుణంగా ఉంది. 2021లో పాయింట్ల పట్టిక అట్టడుగున నిలిచిన రైజర్స్‌.. గతేడాది పది జట్లలో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. 2016లో టైటిల్‌ నెగ్గిన అనంతరం హైదరాబాద్‌ ఆ స్థాయి ఆటతీరు కనబర్చలేకపోతున్నది.

తాజా వేలంలో ఆటగాళ్ల కొనుగోలు అంశంలోనూ సన్‌రైజర్స్‌ ఆశ్చర్యపరిచింది. నిరుడు పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి పేలవ ఆటతీరుతో జట్టులో చోటు కోల్పోయిన మయాంక్‌ అగర్వాల్‌ను ఎంపిక చేసుకుంది. టామ్‌ మూడీ స్థానంలో హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా... బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఎలాంటి ప్రయోగాలు చేస్తాడనేది ఆసక్తికరం. ఇంగ్లండ్‌ యువ సంచలనం హ్యారీ బ్రూక్‌ను దక్కించుకోవడం ఒక్కటే సన్ రైజర్స్ కు కాస్త ఊరట మిగిల్చింది. మయాంక్‌ అగర్వాల్‌, అభిషేక్‌ శర్మ, రాహుల్‌ త్రిపాఠి, మర్కరమ్, బ్రూక్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, మార్క్‌ జాన్సెన్‌తో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో వైవిధ్యం ఉన్నా.. వీరంతా సమిష్టిగా రాణించగలరా అన్నది అనుమానమే.! సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ నేతృత్వంలోని బౌలింగ్‌ విభాగంలో మెరుపు ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్‌ మాలిక్‌, యార్కర్ల కింగ్‌ నటరాజన్‌, జాన్సెన్‌, కార్తీక్‌ త్యాగి ప్రధానపాత్ర పోషించనున్నారు.

సమతూకంతో రాజస్థాన్ రాయల్స్...

గతేడాది ఫైనలిస్ట్, మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ మరోసారి ఫేవరెట్ జట్లలో ఒకటిగా పోటీలో నిలిచింది. కెప్టెన్ సంజు శాంసన్ నాయకత్వంలోని రాజస్థాన్ జట్టులో సూపర్ హిట్టర్ జోస్ బట్లర్, యశస్వి జైశ్వాల్, దేవదత్ పడిక్కల్ లాంటి సూపర్ బ్యాటర్లు, స్పిన్ జోడీ యజువేంద్ర చహాల్, రవిచంద్రన్ అశ్విన్ ల బలంతో రాయల్స్ ఉరకలేస్తోంది.

వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులో నాలుగో నంబర్ స్థానం కోసం పోటీపడుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ పూర్తిస్థాయిలో చెలరేగాలని భావిస్తున్నాడు.

అయోమయంలో కోల్ కతా నైట్ రైడర్స్...

భారత మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ వెన్నెముక గాయంతో దూరం కావడంతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ పగ్గాలను నితీష్ రాణా చేపట్టాడు. అయితే తెరవెనుక మంత్రాంగం నడిపేందుకు న్యూజిలాండ్‌ గ్రేట్‌ బ్రాండెన్‌ మెక్‌కల్లమ్‌ ఉండటం కేకేఆర్‌కు కలిసొచ్చే అంశం. నిరుడు సంచలన ప్రదర్శన చేసిన ఉమేశ్‌ యాదవ్‌ నుంచి మేనేజ్‌మెంట్‌ అదే తరహా ఆటతీరు ఆశిస్తుండగా.. విండీస్‌ విధ్వంసక వీరుడు ఆండ్రీ రస్సెల్‌, స్పిన్‌ మాంత్రికుడు సునీల్‌ నరైన్‌పైనే కేకేఆర్‌ భారీ ఆశలు పెట్టుకుంది.

వెంకటేశ్‌ అయ్యర్‌, వరుణ్‌ చక్రవర్తి, టిమ్‌ సౌథీ, షకీబ్‌, లోకీ ఫెర్గూసన్‌ వంటి నాణ్యమైన ఆటగాళ్లు అందుబాటులో ఉండటం కేకేఆర్‌కు కలసి రానుంది.

శిఖర్ ధావన్ కెప్టెన్సీలో పంజాబ్...

గత సీజన్లో మయాంక్‌ అగర్వాల్‌కు జట్టు పగ్గాలు అప్పగించిన పంజాబ్‌ కింగ్స్‌ ఈ సారి సారథితో పాటు కోచింగ్‌ సిబ్బందిని సైతం మార్చింది. 2019లో ఇంగ్లండ్‌కు తొలిసారి వన్డే ప్రపంచకప్‌ అందించిన ప్రముఖ కోచ్ ట్రేవర్‌ బేలీస్‌ కు జట్టును అప్పజెప్పింది. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌పై పంజాబ్‌ భారీ ఆశలు పెట్టుకుంది.

ధవన్‌తో పాటు బెయిర్‌స్టో, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, భానుక రాజపక్స, జితేశ్‌ శర్మ, సామ్‌ కరన్‌, షార్ట్‌, షారుక్‌ ఖాన్‌తో పంజాబ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ దుర్భేద్యంగా కనిపిస్తున్నది. దక్షిణాఫ్రికా పేసర్‌ కగిసో రబడతో పాటు అర్ష్‌దీప్‌ సింగ్‌ పేస్‌ భారం మోయనుండగా.. రాహుల్‌ చాహర్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌ స్పీన్‌ బాధ్యతలు చూసుకోనున్నారు.

లక్నో కెప్టెన్ గా రాహుల్ కు సవాల్...

కెఎల్ రాహుల్ నాయకత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో క్వింటన్ డికాక్‌, స్టొయినిస్‌, పూరన్‌, మార్క్‌ వుడ్‌, కృనాల్‌ పాండ్యా, దీపక్‌ హుడా లాంటి మెరుపు బ్యాటర్లున్నారు. గత సీజన్ స్థాయిలో రాణించాలన్న పట్టుదలతో లక్నోజట్టు పోరుకు దిగుతోంది.

రిషభ్ పంత్ లేని ఢిల్లీ క్యాపిటల్స్...

వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ జట్టుకు దూరం కావడంతో..యువఓపెనర్ పృథ్వీ షా, వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ల పైనే ఢిల్లీ క్యాపిటల్స్ భారం మోపింది.

మిషెల్ మార్ష్, రీలీ రూసో, మనీష్ పాండే, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్ లతో క్యాపిటల్స్ జట్టు పోటీకి సిద్ధమయ్యింది.

రెండునెలల కాలంలో నిలకడగా రాణించిన జట్టుకే ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకొనే అవకాశాలు ఉంటాయి.

మార్చి 31 నుంచి 50 రోజులపాటు మండే ఎండల నుంచి..హాట్ హాట్ ఐపీఎల్ మ్యాచ్ లు అభిమానులకు ఉపశమనం కలిగించనున్నాయి.

First Published:  31 March 2023 1:22 AM GMT
Next Story