Telugu Global
Sports

అర్షదీప్ షో..ముంబై పై పంజాబ్ పంజా!

వరుస విజయాలతో దూకుడు మీదున్న ముంబై పై పంజాబ్ పంజా విసిరింది. హైస్కోరింగ్ సమరంలో 13 పరుగులతో ముంబైని కట్టడి చేసింది.

అర్షదీప్ షో..ముంబై పై పంజాబ్ పంజా!
X

అర్షదీప్ షో..ముంబై పై పంజాబ్ పంజా!

వరుస విజయాలతో దూకుడు మీదున్న ముంబై పై పంజాబ్ పంజా విసిరింది. హైస్కోరింగ్ సమరంలో 13 పరుగులతో ముంబైని కట్టడి చేసింది.

ఐపీఎల్ -16 రౌండ్ రాబిన్ లీగ్ లో ఆరవ రౌండ్ పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ లాంటి జట్లకు బ్రేక్ పడింది.

లోస్కోరింగ్ చేజింగ్ లో లక్నోను గుజరాత్, హైస్కోరింగ్ వార్ లో ముంబైని పంజాబ్ కింగ్స్ కంగు తినిపించాయి.

పంజాబ్ సరికొత్త రికార్డు..

ముంబై విజయాల అడ్డా వాంఖడే స్టేడియం వేదికగా సాగిన పరుగుల వెల్లువ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 214 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. ఆఖరి ఆరు ఓవర్లలో ముంబై మిడిలార్డర్ బ్యాటర్లు 107 పరుగులు దండుకోడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పారు.

ఇన్నింగ్స్ 15 నుంచి 18 ఓవర్ల నడుమ ముంబై బౌలర్లు 82 పరుగులు సమర్పించుకొన్నారు.

పంజాబ్ దేశీ ఆటగాడు జితేశ్ శర్మ కేవలం 7 బంతుల్లోనే 25 పరుగులు బాదడంతో ముంబై భారీగా పరుగులు సమర్పించుకోక తప్పలేదు. ఆఖరి 7 ఓవర్లలో 117 పరుగులు రాబట్టడం ద్వారా పంజాబ్ సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఆరేళ్ల తర్వాత తొలిగెలుపు..

ముంబై ప్రత్యర్థిగా వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్ ఆరుసీజన్ల విరామం తర్వాత తొలివిజయం నమోదు చేసింది.

స్టాండిన్ కెప్టెన్ సామ్‌ కరన్‌, హర్‌ప్రీత్‌, జితేశ్‌ సూపర్‌ బ్యాటింగ్‌తో పంజాబ్ అనూహ్యంగా భారీస్కోరు నమోదు చేయగలిగింది.

సామ్‌ కరెన్‌(29 బంతుల్లో 55, 5ఫోర్లు, 4 సిక్స్‌లు), హర్‌ప్రీత్‌సింగ్‌(28 బంతుల్లో 44, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) , జితేశ్‌శర్మ(7 బంతుల్లో 25, 4 సిక్స్‌లు) ధనాధన్‌ బ్యాటింగ్‌తో20 ఓవర్లలో 214/8 స్కోరు చేసింది.ముంబై బౌలర్లలో పీయూష్‌ చావ్లా(2/15), గ్రీన్‌(2/41) రెండేసి వికెట్లు తీశారు.

అర్జున్ టెండుల్కర్ డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకొన్న ముంబై రెండో బౌలర్ గా రికార్డుల్లో చేరాడు.

రోహిత్, గ్రీన్, సూర్య పోరాడినా....

20 ఓవర్లలో 215 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన ముంబైకి కెప్టెన్ రోహిత్ శర్మ, వన్ డౌన్ కమెరాన్ గ్రీన్ కీలక భాగస్వామ్యంతో గట్టి పునాది వేశారు. భారీషాట్లతో పంజాబ్ బౌలర్లను చిందరవందర చేశారు. కెప్టెన్ రోహిత్ 44, గ్రీన్ 67, సూర్యకుమార్ యాదవ్ 57 పరుగుల స్కోర్లతో ముంబై స్కోరు 200 దాటడంలో ప్రధాన పాత్ర వహించారు.

అర్షదీప్ బల్లేబల్లే బౌలింగ్...

మ్యాచ్ నెగ్గాలంటే ఆఖరి 6 బంతుల్లో 16 పరుగులు చేయాల్సిన ముంబైని..పంజాబ్ యార్కర్ల కింగ్ అర్షదీప్ సింగ్ తన పదునైన యార్కర్లతో కట్టడి చేశాడు.

ఆఖరి ఓవర్లో తిలక్‌వర్మ, నేహాల్‌ వదేరా వికెట్లను పడగొట్టడం ద్వారా తన జట్టును విజేతగా నిలిపాడు. ముంబై చివరకు 6 వికెట్లకు 201 పరుగుల స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది.

అర్షదీప్ సింగ్ 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ప్రస్తుత సీజన్లో రెండుజట్లుకలిపి 400కు పైగా పరుగులు సాధించడం ఇది ఏడవసారి.

ఆరురౌండ్లలో ముంబైకి ఇది మూడో ఓటమి కాగా..మూడు విజయాలు మాత్రమే నమోదు చేయగలిగింది.

First Published:  23 April 2023 6:24 AM GMT
Next Story