Telugu Global
Sports

నాన్నకల నెరవేర్చిన భారత మహిళా క్రికెట్ స్టార్!

కన్నవారి కలను సాకారం చేసిన వారి ఆనందమే వేరు. ప్రస్తుతం భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మందన సైతం అదే ఆనందాన్ని అనుభవిస్తూ ఆనందడోలికల్లో తేలిపోతోంది.

నాన్నకల నెరవేర్చిన భారత మహిళా క్రికెట్ స్టార్!
X

కన్నవారి కలను సాకారం చేసిన వారి ఆనందమే వేరు. ప్రస్తుతం భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మందన సైతం అదే ఆనందాన్ని అనుభవిస్తూ ఆనందడోలికల్లో తేలిపోతోంది.

తల్లిదండ్రుల ఆశయాలను, కలలను నెరవేర్చగలిగే అవకాశం, అదృష్టం చాలా తక్కువ మందికి మాత్రమే దక్కుతుంది. క్రీడారంగంలో..ప్రధానంగా క్రికెట్లో అది అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటుంది.

కన్నవారి కలను సాకారం చేసిన ఆనందమే వేరు. ప్రస్తుతం అలాంటి సంతోషాన్నే భారత మహిళా క్రికెట్ స్టార్ ఓపెనర్ స్మృతి మందన అనుభవిస్తోంది. ముంబై వేదికగా గత 10 రోజుల్లో రెండు ప్రపంచ మేటిజట్లతో జరిగిన టెస్టుమ్యాచ్ ల్లో భారత్ సంచలన విజయాలు సాధించడంలో సీనియర్ ఓపెనర్ గా స్మృతి తనవంతు పాత్ర నిర్వర్తించింది.

అన్నకు బంతులు అందిస్తూ...

మహారాష్ట్ర్రలోని క్రికెట్ నేపథ్యం కలిగిన ఓ కుటుంబం నుంచి భారత మహిళా క్రికెట్లోకి దూసుకొచ్చిన స్మృతి తమ ఇంటిఆవరణలో తన అన్న బ్యాటింగ్ చేస్తుంటే ఫీల్డింగ్ చేస్తూ, బంతులు అందిస్తూ క్రికెట్ పట్ల మక్కువ పెంచుకొంది.

అయితే..తండ్రి ప్రేరణతో క్రికెట్ బ్యాటు పట్టిన స్మృతి సొగసైన ఎడమచేతి బ్యాటర్ గా, ఓపెనర్ గా రూపుదిద్దుకొంది. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తూ భారతజట్టులో చోటు సంపాదించిన స్మృతి గత ఏడేళ్లుగా భారత ప్రధాన బ్యాటర్ గా కొనసాగుతూ వస్తోంది.

అంతర్జాతీయస్థాయిలో భారత్ సాధించిన పలు వన్డే, టెస్టుమ్యాచ్ విజయాలలో స్మృతి మందన కీలకపాత్ర పోషించడమే కాదు..మ్యాచ్ విన్నర్ గా కూడా నిలుస్తూ వచ్చింది.

2023 సీజన్ టెస్టుల్లో సూపర్ షో....

నవీముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన టెస్టుమ్యాచ్ లో భారత్ 347 పరుగుల భారీవిజయం సాధించడంలో స్మృతి ప్రధానపాత్ర పోషించింది. అంతేకాదు..ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్ర్రేలియాతో ముగిసిన టెస్టుమ్యాచ్ లో సైతం భారత్ చరిత్రాత్మక విజయం సాధించడంలో కీలక భూమిక నిర్వహించింది.

కేవలం 10 రోజుల వ్యవధిలో రెండు ప్రపంచ మేటిజట్లతో జరిగిన టెస్టుమ్యాచ్ ల్లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 400కు పైగా స్కోర్లు సాధించడంలో స్మృతి సైతం ఓపెనర్ గా సత్తా చాటుకొంది.

నాన్నకూచి స్మృతి మందన...

తమ కుటుంబం నుంచి కనీసం ఒక్కరైనా క్రికెట్లో భారతజట్టుకు ప్రాతినిథ్యం వహించాలని తనతండ్రి అంటూ ఉండేవారని, తన సోదరుడు సాధించలేనిదానిని మహిళా జట్టులో చోటు దక్కించుకోడం ద్వారా తాను దక్కించుకోడం గర్వకారణంగా ఉందని స్మృతి ప్రకటించింది. నాన్న కలను సాకారం చేయడం నిజంగా తన అదృష్టమని, తాను అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదగటం, రాణించడం వెనుక తన తండ్రి ప్రేరణ, ప్రోత్సాహం ఎంతో ఉందని ముంబై టెస్టులో ఆస్ట్ర్రేలియాపై భారత్ సంచలన విజయం అనంతరం ప్రకటించింది..

తనతండ్రి ఓ క్రికెటర్ గా భారత్ ఆడాలనుకొని ఆడలేకపోయారని, తన అన్నసైతం క్రికెటర్ గా ఎదగలేకపోయాడని, ఆలోటును తాను పూడ్చగలగడం గొప్ప అదృష్టమని చెప్పింది. తాను కుడిచేతి వాటం బ్యాటర్ గా తన కెరియర్ ను మొదలు పెట్టి..ఆ తరువాత ఎడమచేతి వాటానికి మారానని గుర్తు చేసుకొంది.

భారతజట్టు వైస్ కెప్టెన్ గా....

భారతజట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుంటే..స్మృతి మందన మాత్రం క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తోంది. ఆస్ట్ర్రేలియాతో జరిగే టీ-20, వన్డే సిరీస్ ల్లో సైతం స్మృతి కీలకం కానుంది.

మహిళా ఐపీఎల్ లో బెంగళూరు ఫ్రాంచైజీకి నాయకత్వం వహిస్తున్న స్మృతి ఇప్పటి వరకూ 6 టెస్టులు ఆడి ఓ సెంచరీతో సహా 480 పరుగులు సాధించింది. 80 వన్డేలలో 3179 పరుగులు, 125 టీ-20 మ్యాచ్ ల్లో 2998 పరుగులు సాధించింది. స్మృతికి 6 అంతర్జాతీయ సెంచరీలు, 51 అర్థశతకాలు సాధించిన రికార్డు సైతం ఉంది.

మహిళా ఐపీఎల్ ప్రారంభ సీజన్ వేలంలో 3 కోట్ల 40 లక్షల రూపాయల రికార్డు ధర దక్కించుకొన్న ఏకైక ప్లేయర్ రికార్డు సైతం స్మృతినే సాధించడం విశేషం.

First Published:  26 Dec 2023 1:22 PM GMT
Next Story