Telugu Global
Sports

భారత క్రికెట్ ఎంపిక సంఘం నెత్తిన ఉద్వాసన పిడుగు!

ప్రపంచకప్ లో భారతజట్టు వైఫల్యానికి సెలెక్టర్లే కారణమంటూ చేతన్ శర్మ నేతృత్వంలోని ఎంపిక సంఘంపై బీసీసీఐ వేటు వేసింది. సరికొత్త సెలెక్షన్ కమిటీ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది.

భారత క్రికెట్ ఎంపిక సంఘం నెత్తిన ఉద్వాసన పిడుగు!
X

భారత క్రికెట్ ఎంపిక సంఘం నెత్తిన ఉద్వాసన పిడుగు!

ప్రపంచకప్ లో భారతజట్టు వైఫల్యానికి సెలెక్టర్లే కారణమంటూ చేతన్ శర్మ నేతృత్వంలోని ఎంపిక సంఘంపై బీసీసీఐ వేటు వేసింది. సరికొత్త సెలెక్షన్ కమిటీ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది....

ఉరుమురిమీ మంగళం మీద పడిందన్న సామెత బీసీసీఐ ఎంపిక సంఘానికి అతికినట్లు సరిపోతుంది. చేతన్ శర్మ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీకి ఉద్వాసన పలుకుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

బీసీసీఐ చరిత్రలోనే అసాధారణ చర్య...

ఆస్ట్ర్రేలియా వేదికగా ముగిసిన టీ-20 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారతజట్టు దారుణంగా విఫలం కావడంతో...ఎవరిని బలిపశువును చేయాలో తెలియని బీసీసీఐ చివరకు చేతన్ శర్మ నాయకత్వంలోని ఎంపిక సంఘాన్ని రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. భారత క్రికెట్ బోర్డు చరిత్రలోనే ఇదో అసాధారణ చర్యగా మిగిలిపోతుంది.

గత ఏడాది దుబాయ్ లో ముగిసిన 2021 టీ-20 ప్రపంచకప్, 2022 ప్రపంచకప్ లో భారతజట్టు వైఫల్యాలకు సెలెక్టర్లే కారణమని, సరుకులేని జట్లను ఎంపిక చేసిన కారణంగానే భారత్ విజేతగా నిలువలేకపోయిందంటూ బీసీసీఐ భావిస్తోంది.

2021 ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ నుంచి ఇంటిదారి పట్టిన భారతజట్టు 2022 ఆసియాకప్ టీ-20 టోర్నీ సూపర్ -4 రౌండ్లోనే నిష్క్ర్రమించింది. 2022 టీ-20 ప్రపంచకప్ సెమీస్ కు అలవోకగా చేరినా...ఫైనల్లో చోటు కోసం ఇంగ్లండ్ తో జరిగిన పోరులో 10 వికెట్ల ఘోరపరాజయాన్ని భారతజట్టు చవిచూసింది.

అందరినీ విడిచి పెట్టి....

భారతజట్టు అంచనాలకు తగ్గట్టుగా రాణించడంలో విఫలం కావడానికి కారణమైన కోచ్, కెప్టెన్, ఆటగాళ్లను విడిచి పెట్టి..సెలెక్షన్ కమిటీపై వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది.

భారత మాజీ ఆల్ రౌండర్ చేతన్ శర్మ చైర్మన్ గా ఉన్న సీనియర్ సెలెక్షన్ కమిటీలో సునీల్‌ జోషి, హర్విందర్ సింగ్ ,దెబాశిష్‌ మొహంతీ సెలెక్టర్లుగా ఉన్నారు.ఈ కమిటీకి తక్షణమే ఉద్వాసన పలకడంతో పాటు.. కొత్త సెలక్షన్ కమిటీ ఎంపిక కోసం దరఖాస్తులను సైతం బీసీసీఐ ఆహ్వానించింది.

సీనియర్ సెలెక్షన్ కమిటీలో సెలెక్టర్లుగా ఉండాల్సిన కనీస అర్హతలను కూడా బీసీసీఐ ఖరారు చేసింది. సెలెక్టర్ కావాలని కోరుకొనేవారికి కనీసం ఏడు టెస్ట్ మ్యాచ్‌లు లేదా 30 ఫస్ట్‌ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన రికార్డు ఉండితీరాలి. లేదంటే 10 వన్డేలు, 20 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు అయినా ఆడాలి' అని బీసీసీఐ తెలిపింది. అంతేకాదు ఐదేళ్ల క్రితం క్రికెట్‌కు వీడ్కోలు పలికినవాళ్లు, ఐదేళ్లపాటు ఏ క్రికెట్‌ కమిటీలోనూ సభ్యుడిగా లేనివాళ్లకు మాత్రమే ప్రాధాన్యం ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆసక్తి ఉన్నవారు నవంబర్ 28వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు పంపుకోవచ్చని సూచించింది.

వెస్ట్ జోన్ కు చెందిన సెలెక్టర్ పోస్ట్ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఖాళీగానే ఉంది. ఈస్డ్ జోన్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న సెలెక్టర్ దేబశిశ్ మొహంతీ కాంట్రాక్టు త్వరలోనే ముగియనుంది.

బీసీసీఐ చరిత్రలోనే ఉద్వాసనకు గురైన తొలి ఎంపిక సంఘం అపప్రదను చేతన్ శర్మ మూటగట్టుకోక తప్పలేదు. ఒక్కో సెలెక్టర్ కు ఏడాదికి 50 లక్షల రూపాయల చొ్ప్పున వేతనంగా బీసీసీఐ చెల్లిస్తూ వస్తోంది.

First Published:  19 Nov 2022 8:27 AM GMT
Next Story