Telugu Global
Sports

భారత ఫుట్ బాల్ జట్టుకు 100వ ర్యాంకు!

భారత ఫుట్ బాల్ జట్టు గత ఐదేళ్లలో తొలిసారిగా 100వ ర్యాంక్ కు చేరుకొంది. 2018 తర్వాత భారతజట్టుకు ఇదే అత్యుత్తమ ర్యాంక్.

భారత ఫుట్ బాల్ జట్టుకు 100వ ర్యాంకు!
X

భారత ఫుట్ బాల్ జట్టుకు 100వ ర్యాంకు!

భారత ఫుట్ బాల్ జట్టు గత ఐదేళ్లలో తొలిసారిగా 100వ ర్యాంక్ కు చేరుకొంది. 2018 తర్వాత భారతజట్టుకు ఇదే అత్యుత్తమ ర్యాంక్.

ప్రపంచంలో అత్యధిక జనాదరణ కలిగిన క్రీడ ఫుట్ బాల్. ఈ భూఖండంలో 204 దేశాలకు చెందిన జట్లు ఫుట్ బాల్ ఆడుతూ వస్తున్నాయి. అయితే..140 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే రెండు అతిపెద్ద దేశాలలో ఒకటిగా ఉన్న భారత్ మెరుగైన ర్యాంక్ సాధించడానికి నానాపాట్లు పడుతూ వస్తోంది.

క్రికెట్ వీరఅభిమానులు ఎక్కువగా ఉన్న భారత్ లో ఫుట్ బాల్ తో సహా మిగిలిన క్రీడలకు ఆదరణ అంతంత మాత్రమే. క్రికెట్ మర్రినీడన మిగిలిన క్రీడలు ఎదుగూబొదుగూ లేకుండా పోతున్నాయి.

ఎక్కడవేసిన గొంగళి అక్కడే..!

భారత ఫుట్ బాల్ కు చెప్పుకోదగిన చరిత్రే ఉన్నా గత కొన్ని దశాబ్దాలుగా ఎదుగూబొదుగూ లేకుండా ఉంటూ వస్తోంది. ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నసామెత భారత ఫుట్ బాల్ కు అతికినట్లు సరిపోతుంది.

విజయన్, బైచుంగ్ భూటియా, సునీల్ ఛెత్రీ..ఇలా దశాబ్దానికి ఓ అంతర్జాతీయస్థాయి ఫుట్ బాలర్ తో నెట్టుకొంటూ వస్తున్న భారత్ లో ఫుట్ బాల్ ప్రమాణాలు నాసిరకంగా ఉంటూ వస్తున్నాయి.

మనదేశంలోని ఓ జిల్లా అంతైనా లేని క్రొయేషియా లాంటి బుల్లిదేశాలు ప్రపంచ అత్యుత్తమ జట్లను అందిస్తుంటే..భారత్ మాత్రం మొదటి వంద దేశాలలో ఒకటిగా నిలవటానికి ఆపసోపాలు పడుతోంది

ఐదేళ్ల తరువాత 100వ ర్యాంక్...

అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ గత ఐదు సంవత్సరాలలో తొలిసారిగా 100వ ర్యాంక్ సంపాదించింది. 2018లో అత్యుత్తమంగా 97వ ర్యాంక్ సంపాదించిన భారతజట్టు ..ఆ తర్వాత ఐదేళ్లలో 104 నుంచి 101 ర్యాంకుల నడుమ కొట్టిమిట్టాడుతూ వస్తోంది.

ఇటీవలే ముగిసిన పలు అంతర్జాతీయ ఫుట్ బాల్ టోర్నీలలో నిలకడగా రాణిస్తూ వచ్చిన భారత్..ప్రస్తుతం బెంగళూరు శ్రీకంఠీరవ స్టేడియం వేదికగా జరుగుతున్న

2023 శాఫ్ ఫుట్ బాల్ కప్ టోర్నీ సెమీస్ చేరడం ద్వారా సత్తా చాటుకొంది.

గ్రూపులీగ్ దశలో పాకిస్థాన్ పైన 4-0, నేపాల్ పైన 2-0 గోల్స్ విజయాలు సాధించిన భారత్..ఆఖరి లీగ్ పోటీలో కువైట్ తో పోరును 1-1తో డ్రాగా ముగించాల్సి వచ్చింది.

ఫైనల్లో చోటు కోసం జరిగే సెమీఫైనల్లో జోర్డాన్ తో భారత్ పోటీపడనుంది. భారత కెప్టెన్ సునీల్ ఛెత్రీ ఇప్పటి వరకూ ఆడిన మూడు లీగ్ మ్యాచ్ ల్లో 5 గోల్స్ సాధించడం ద్వారా టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఇటీవల జరిగిన పలు అంతర్జాతీయ ఫుట్ బాల్ టోర్నీలలో తమజట్టు పడిన కష్టానికి తగిన ఫలితం వచ్చిందని, తమజట్టు 100వ ర్యాంక్ కు చేరుకోగలిగిందని ఆనందం వ్యక్తం చేశారు.

అర్జెంటీనాకు ప్రపంచ నంబర్-1 ర్యాంక్...

ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా నంబర్ వన్ ర్యాంకులో నిలిచింది. 1843. 73 పాయింట్లతో లయనల్ మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా అగ్రస్థానం సంపాదించింది.

1843. 54 పాయింట్లతో ఫ్రాన్స్ రెండు, ఇంగ్లండ్, క్రొయేషియా, బెల్జియం, నెదర్లాండ్స్ ఆ తర్వాతి స్థానాలలో నిలిచాయి.

ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ బ్రెజిల్..మొదటి ఐదుర్యాంకుల్లో చోటు దక్కించుకోడంలో విఫలమయ్యింది.

First Published:  30 Jun 2023 10:15 AM GMT
Next Story