Telugu Global
Sports

భార‌త మ‌హిళల హాకీ జ‌ట్టుకు రివార్డు.. ఒక్కొక్క‌రికి రూ.3 ల‌క్ష‌లు

ఈ టోర్నీలో స‌వితా పూనియా నేతృత్వంలోని భార‌త జ‌ట్టు.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జపాన్‌ను 4-0తో మట్టికరిపించి విజేతగా నిలిచింది.

భార‌త మ‌హిళల హాకీ జ‌ట్టుకు రివార్డు.. ఒక్కొక్క‌రికి రూ.3 ల‌క్ష‌లు
X

ప్రతిష్టాత్మకమైన ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీని దక్కించుకున్న భార‌త మ‌హిళ‌ల హాకీ జట్టుపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ప్రధాని మోడీ నుంచి సామాన్యుల వరకు టీమిండియా ఉమెన్స్‌ హాకీ టీమ్‌ ప్రదర్శనకు అబ్బురపోయారు. డిఫెండింగ్‌ ఛాంపియన్ జపాన్‌ను 4-0తో మట్టికరిపించి రెండోసారి మహిళల హాకీ జట్టు ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీని దక్కించుకుంది. ఈ ఘనత సాధించిన హాకీ జ‌ట్టు స‌భ్యుల‌కు హాకీ ఇండియా రివార్డు ప్రక‌టించింది. ఒక్కొక్కరికి రూ.3 ల‌క్షల చొప్పున రివార్డు ఇవ్వనున్నట్టు ప్రకటించి మహిళా టీమ్‌ సభ్యుల సంతోషాన్ని రెట్టింపు చేసింది. విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన‌ కోచింగ్ సిబ్బందికి కూడా రూ.1.5ల‌క్ష‌ల చొప్పున న‌జరానా ఇవ్వనున్నట్టు హాకీ ఇండియా తెలిపింది.

ఈ టోర్నీలో స‌వితా పూనియా నేతృత్వంలోని భార‌త జ‌ట్టు.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జపాన్‌ను 4-0తో మట్టికరిపించి విజేతగా నిలిచింది. లక్నోలోని మ‌రంగ్ గొమ్కే జైపాల్ సింగ్ అస్ట్రో ట‌ర్ఫ్ హాకీ స్టేడియంలో జ‌రిగిన ఫైన‌ల్లో ఫ్లడ్‌ లైట్ల సమస్య కారణంగా భారత్‌-జపాన్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్ 50 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఆట ఆరంభం నుంచే భారత మహిళల జట్టు దూకుడు కొనసాగించింది. జపాన్‌ను 4-0తో ఓడించి రెండోసారి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

2016లో సింగపూర్‌లో భారత్ తొలి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకోగా ఇది రెండోది. ఇక జపాన్ 2013, 2021లో రెండుసార్లు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇరు జట్లు బలంగా ఉండటంతో ఈ మ్యాచ్‌ హోరాహోరీగా సాగుతుందని భావించారు. కానీ, భారత మహిళల దూకుడు ముందు మ్యాచ్‌ ఏకపక్షంగా మారిపోయింది. తొలి భాగంలో ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగినా.. తర్వాత మాత్రం భారత్‌ జోరు కొనసాగింది. స్టాండ్స్‌లో ఉన్న భారత పురుషుల హాకీ జట్టు మహిళల జట్టును ఆద్యంతం ఉత్సాహ పరిచింది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో ఆసియా క్రీడల ఛాంపియన్ చైనా 2-1తో దక్షిణ కొరియాను ఓడించి మూడో స్థానాన్ని ఖాయం చేసుకుంది.

First Published:  7 Nov 2023 9:32 AM GMT
Next Story