Telugu Global
Sports

సెంచరీ చేసినా.. చెత్త రికార్డు మూటగట్టుకున్న కోహ్లి

ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లోనే తొలి సెంచరీతో అదరగొట్టిన స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి చెత్త రికార్డును మూటగట్టుకోవడం గమనార్హం.

సెంచరీ చేసినా.. చెత్త రికార్డు మూటగట్టుకున్న కోహ్లి
X

ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లోనే తొలి సెంచరీతో అదరగొట్టిన స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి చెత్త రికార్డును మూటగట్టుకోవడం గమనార్హం. శనివారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కి దిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లి అజేయ శతకం (113) సాధించాడు. మరో ఓపెనర్, జట్టు కెప్టెన్‌ డుప్లెసిస్‌ (44) తప్ప జట్టు సభ్యులెవరూ పెద్దగా రాణించలేదు. అయినా కోహ్లీ సెంచరీతో 20 ఓవర్లలో బెంగళూరు జట్టు 183 పరుగులు సాధించింది.

అయితే.. ఈ మ్యాచ్‌లో టార్గెట్‌ను రాజస్తాన్‌ జట్టు అలవోకగా ఛేదించింది. ఆ జట్టులో ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (100 నాటౌట్‌) సెంచరీతో చెలరేగగా, కెప్టెన్‌ సంజూ శాంసన్‌ హాఫ్‌ సెంచరీ (69)తో మెరిశాడు. ఇంతకీ అసలు విషయమేంటంటే.. కోహ్లి సెంచరీ చేసేందుకు ఎక్కువ బంతులు తీసుకున్నాడనేది ఆరోపణ. అందువల్లే మిగిలినవారికి ఆడే అవకాశం రాలేదని, లేదంటే బెంగళూరు జట్టు మరిన్ని పరుగులు చేసేందుకు అవకాశముండేదని అభిప్రాయపడుతున్నారు.

ఈ మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ చేసినా అందుకు 67 బంతులు తీసుకున్నాడని, ఇక మొత్తం 113 పరుగులు చేసిన కోహ్లి 72 బంతులు తీసుకున్నాడని, ఇది ఐపీఎల్‌ చరిత్రలో చెత్త రికార్డని విశ్లేషకులు చెబుతున్నారు. ఐపీఎల్‌ చరిత్రలో.. భారత గడ్డపై సెంచరీ కొట్టడానికి ఇన్ని బంతులు తీసుకున్న తొలి క్రికెటర్‌గా చెత్త రికార్డు సృష్టించాడని విమర్శిస్తున్నారు. ఇక నెటిజన్లు అయితే మరో అడుగు ముందుకేసి.. జట్టు ఓటమికి కోహ్లియే కారణమంటూ మండిపడుతున్నారు. కోహ్లి సెల్ఫిష్‌ అని ట్రోల్‌ చేస్తున్నారు. టీ20 క్రికెట్‌లో కోహ్ల 50 కంటే ఎక్కువ బంతులు ఎదుర్కొన్న మ్యాచ్‌లలో అతడి జట్టు 96 శాతం మ్యాచ్‌లు ఓడిపోయిందంటూ గణాంకాలు కూడా చూపిస్తుండటం గమనార్హం. పాపం.. కోహ్లికి సెంచరీ చేసిన ఆనందం కంటే ఈ ట్రోల్స్‌తో నిరాశే మిగిలినట్టయింది.

First Published:  7 April 2024 5:57 AM GMT
Next Story