Telugu Global
Sports

వెంటాడుతున్న వర్షం..నేడే భారత్- దక్షిణాఫ్రికాజట్ల రెండో టీ-20!

భారత్- దక్షిణాఫ్రికాజట్ల తీన్మార్ టీ-20 సిరీస్ ను వరుణదేవుడు వెంటాడుతున్నాడు. వానముప్పు హెచ్చరికల నడుమ ఈరోజు రెండో టీ-20కి రెండుజట్లూ సై అంటున్నాయి.....

వెంటాడుతున్న వర్షం..నేడే భారత్- దక్షిణాఫ్రికాజట్ల రెండో టీ-20!
X

భారత్- దక్షిణాఫ్రికాజట్ల తీన్మార్ టీ-20 సిరీస్ ను వరుణదేవుడు వెంటాడుతున్నాడు. వానముప్పు హెచ్చరికల నడుమ ఈరోజు రెండో టీ-20కి రెండుజట్లూ సై అంటున్నాయి.....

2024 -ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కు మాజీ చాంపియన్ భారత్ సన్నాహాలను వరుణదేవుడు నీర్చుగార్చుతున్నాడు. మరో 7 మాసాలలో అమెరికా, వెస్టిండీస్ సంయుక్త ఆతిథ్యంలో జరిగే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు భారత్ ఆడాల్సిన ఆరు సన్నాహక మ్యాచ్ ల్లో ఇప్పటికే తొలిమ్యాచ్ వానదెబ్బతో రద్దుల పద్దులో చేరిపోయింది.

రెండోమ్యాచ్ కైనా వరుణగండం వీడేనా?

టీ-20 6వ ర్యాంకర్ దక్షిణాఫ్రికాతో భారత్ మూడుమ్యాచ్ ల సిరీస్ లోని తొలిపోరు కనీసం ఒక్కబంతి పడకుండానే రద్దుల జాబితాలోచేరింది. డిసెంబర్ 12న జరిగే రెండో టీ-20, 14న జరిగే మూడో టీ-20 మ్యాచ్ లకు సైతం వానముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

డర్బన్ వేదికగా జరగాల్సిన తొలిపోరు భారీవర్షంతో రద్దు కావడంతో..రెండుజట్లూ మరికొద్ది గంటల్లో క్విబెరా లోని సెయింట్ జార్జెస్ పార్క్ వేదిక జరిగే రెండో పోరులో తలపడనున్నాయి.

తొలిగెలుపుతో సిరీస్ లో శుభారంభం చేయాలని అటు ఆతిథ్య దక్షిణాఫ్రికా, ఇటు ప్రపంచ నంబర్ వన్ భారత్ భావిస్తున్నాయి.

మేఘావృత వాతావరణంలో...

భారత కాలమాన ప్రకారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభంకానున్న రెండో టీ-20 మ్యాచ్ జరిగే సమయంలో ఆకాశం దట్టమైన మేఘాలతో నిండి ఉంటుందని, వాతావరణంలో తేమ 60 శాతానికి మించే ఉంటుందని దక్షిణాఫ్రికా వాతావరణశాఖ ప్రకటించింది. మ్యాచ్ కు వానదెబ్బ తగిలే ప్రమాదం లేకపోలేదని కూడా హెచ్చరించింది.

ఫాస్ట్ బౌన్సీతో కూడిన ఇక్కడి పిచ్ పైన రెండుజట్ల పేస్, స్వింగ్ బౌలర్లు చెలరేగిపోయే అవకాశం ఉంది. ఎడెన్ మర్కరమ్ నాయకత్వంలోని సఫారీజట్టు, సూర్యకుమార్ కెప్టెన్సీలోని భారతజట్టు సైతం తుదికూర్పు పైనే దృష్టి కేంద్రీకరించాయి.

సఫారీజట్టులో ఇద్దరు టీ-20 అరంగేట్రం...

ఎక్కువమంది యువఆటగాళ్లతో కూడిన దక్షిణాఫ్రికా తరపున ఎడమచేతి వాటం పేస్ బౌలర్ నాంద్రే బర్గర్, మీడియం ఫాస్ట్ బౌలర్ ఓట్నీల్ బార్ట్ మాన్ ఈరోజు జరిగే మ్యాచ్ తో అరంగేట్రం చేయనున్నారు.

డాషింగ్ ఓపెనర్ మాథ్యూ బ్రీడ్చ్ కీ, సూపర్ హిట్టర్ స్టబ్స్ సైతం భారీస్కోర్లకు గురి పెట్టారు. క్వింటన్ డి కాక్ అందుబాటులో లేకపోడంతో రీజా హెండ్రిక్స్ సత్తా చాటుకోవాలని తహతహలాడుతున్నాడు. గత 11 టీ-20 మ్యాచ్ ల్లో రీజాకు 7 హాఫ్ సెంచరీలు సాధించిన రికార్డు ఉంది.

సీనియర్ ప్లేయర్లు హెన్రిక్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ లాంటి బ్యాటర్లు, పెలుకువాయా, గెరాల్డ్ కోట్జే,, నాండ్రే బర్గర్ లాంటి పేసర్లు, కేశవ్ మహారాజ్, టబ్రీజ్ షంషీ లాంటి స్పిన్నర్లు ఉన్నారు. సొంతగడ్డపై అత్యంత ప్రమాదకరమైనజట్టుగా పేరున్న దక్షిణాఫ్రికాను ఎదుర్కొనడం భారత కుర్రాళ్లకు కత్తిమీద సవాలు లాంటిదే.

కెప్టెన్ గా సూర్యాకు తొలి విదేశీ పరీక్ష....

రోహిత్ శర్మ, హార్థిక్ పాండ్యా లాంటి సీనియర్ స్టార్లు అందుబాటులో లేకపోడంతో మిస్టర్ టీ-20 సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారతజట్టు సఫారీగడ్డపై

ప్రస్తుత సీజన్లో తన తొలి టీ-20 సిరీస్ కు సిద్ధమయ్యింది.

మొత్తం 17 మంది సభ్యులున్న భారతజట్టు యశస్వీ జైశ్వాల్, శుభ్ మన్ గిల్ ఓపెనర్లు గా బరిలోకి దిగుతోంది. వన్ డౌన్ లో శ్రేయస్ అయ్యర్, రెండో డౌన్లో సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, జితేశ్ శర్మ, రవీంద్ర జడేజా, రవి బిష్నోయ్, మహ్మద్ సిరాజ్, దీపక్ చహార్, అర్షదీప్ సింగ్ లతో తుదిజట్టును ఖరారు చేసుకొనే అవకాశం ఉంది.

సమఉజ్జీల సమరం....

ఐసీసీ టీ-20 ర్యాంకింగ్‌ ప్రకారం భారత్ టాప్ ర్యాంకర్ గా ఉంటే..దక్షిణాఫ్రికా మాత్రం 6వ ర్యాంకులో కొనసాగుతోంది. భారతజట్టులో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ బౌలర్ రవి బిష్నోయ్ ఉన్నారు.

2017-18 తరువాత సఫారీగడ్డపై భారత్ తొలిసారిగా ద్వైపాక్షిక టీ-20 సిరీస్ లో పోటీపడబోతోంది. రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే..దాదాపు సమఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి.

మొత్తం 24 మ్యాచ్ ల్లో తలపడితే..భారత్ 13, దక్షిణాఫ్రికా 11 విజయాల రికార్డుతో ఉన్నాయి. 2015-16 సిరీస్ తర్వాత నుంచి దక్షిణాఫ్రికా ప్రత్యర్థిగా భారత్ కు

ద్వైపాక్షిక సిరీస్ ల్లో పరాజయం అన్నదే లేకపోడం విశేషం.అయితే..2022 టీ-20 ప్రపంచకప్ లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన గ్రూప్ లీగ్ మ్యాచ్ లో మాత్రం

భారత్ కు పరాజయం తప్పలేదు.

గత 24 మ్యాచ్ ల రికార్డుల పరంగా సరిజోడీగా ఉన్న ఈ రెండుజట్లూ ప్రస్తుత సిరీస్ ను గెలుపుతో ప్రారంభించాలన్న పట్టుదలతో ఉన్నాయి. రెండుజట్లలోనూ ఎక్కువమంది యువఆటగాళ్లు, అంతగా అంతర్జాతీయ అనుభవం లేని వారు ఉండడంతో ఎక్కడలేని ఆసక్తిని రేకెత్తిస్తోంది.

దక్షిణాఫ్రికా ప్రత్యర్థిగా భారత్ ఆడిన గత నాలుగు సిరీస్ ల్లో రెండుసార్లు విజేతగా నిలిస్తే..మిగిలిన రెండు సిరీస్ లు డ్రాగా ముగిశాయి.

దక్షిణాఫ్రికా సూపర్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ తన 100వ టీ-20 మ్యాచ్ ను ఈరోజు ఆడనున్నాడు. ఇప్పటి వరకూ ఆడిన 99 మ్యాచ్ ల్లో కిల్లర్ మిల్లర్ కు 106 సిక్సర్లు బాదిన అరుదైన రికార్డు ఉంది.

సాయంత్రం 5 గంటలకు ప్రారంభంకావాల్సిన ఈమ్యాచ్ వరుణగండం నుంచి బైటపడాలని అభిమానులు కోరుకొంటున్నారు.

First Published:  12 Dec 2023 2:52 AM GMT
Next Story