Telugu Global
Sports

బాక్సింగ్ క్వీన్ నిఖత్ జరీన్ కు 600 గజాల ఇంటి స్థలం!

నిజామాబాద్ కమ్ భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ పైన తెలంగాణా ప్రభుత్వం కానుకల వర్షం కురిపిస్తూనే ఉంది. కొద్దిమాసాల క్రితం 2కోట్ల రూపాయలు నజరానాగా ఇచ్చిన రాష్ట్ర్రప్రభుత్వం తాజాగా జూబ్లీ హిల్స్ లో 600 గజాల ఇంటిస్థలం కేటాయించింది.

బాక్సింగ్ క్వీన్ నిఖత్ జరీన్ కు 600 గజాల ఇంటి స్థలం!
X

బాక్సింగ్ క్వీన్ నిఖత్ జరీన్ కు 600 గజాల ఇంటి స్థలం!

నిజామాబాద్ కమ్ భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ పైన తెలంగాణా ప్రభుత్వం కానుకల వర్షం కురిపిస్తూనే ఉంది. కొద్దిమాసాల క్రితం 2కోట్ల రూపాయలు నజరానాగా ఇచ్చిన రాష్ట్ర్రప్రభుత్వం తాజాగా జూబ్లీ హిల్స్ లో 600 గజాల ఇంటిస్థలం కేటాయించింది.

అంతర్జాతీయస్థాయిలో తెలంగాణా రాష్ట్ర్రానికి, భారత దేశానికి తన అపురూప విజయాలతో ఖ్యాతి తెచ్చిన మేడిన్ నిజామాబాద్ బాక్సర్ నిఖత్ జరీన్ ను తెలంగాణా ప్రభుత్వం కానుకలు, బహుమానాలు, నజరానాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

టర్కీ వేదికగా ముగిసిన ప్రపంచ బాక్సింగ్ పోటీలతో పాటు బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు బంగారు పతకాలు అందించడం ద్వారా నిఖత్ జరీన్ ప్రపంచ బాక్సింగ్ లోకి తారాజువ్వలా దూసుకొచ్చింది.

కుటుంబసభ్యుల ప్రోత్సాహం,ప్రభుత్వం ఆర్థిక సాయం, శిక్షకుల మార్గదర్శనం నడుమ గత రెండేళ్లుగా నిఖత్ జరీన్ పడిన కష్టానికి , ఆమె కుటుంబం త్యాగానికి ఎట్టకేలకు ఫలితం దక్కింది. 25 సంవత్సరాల వయసులోనే ప్రపంచ బాక్సింగ్ లో బంగారు పతకం నెగ్గిన తొలి తెలుగు మహిళగా నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది.

టర్కీలోని అంటాలియా నగరంలో ముగిసిన 2022 ప్రపంచ మహిళా బాక్సింగ్ 52 కిలోల విభాగం టైటిల్ సమరంలో నిఖత్ జరీన్ 5-0తో థాయ్ లాండ్ బాక్సర్ జిట్ పాంగ్ జుటామాస్ ను చిత్తు చేయడం ద్వారా విశ్వవిజేతగా బంగారు పతకం అందుకొంది. ప్రస్తుత ప్రపంచ టోర్నీలో భారత్ సాధించిన ఒకేఒక బంగారు పతకం నిఖత్ సాధించినదే కావడం విశేషం. 2018 ప్రపంచ బాక్సింగ్ లో మేరీకోమ్ బంగారు పతకం నెగ్గిన తరువాత భారత్ కు మరో ప్రపంచ బాక్సింగ్ స్వర్ణ పతకం అందించిన ఘనతను నిఖత్ జరీన్ సొంతం చేసుకొంది.

అంతేకాదు..బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ లో సైతం నిఖత్ జరీన్ బంగారు పతకం గెలుచుకోడంతో కేంద్రప్రభుత్వం ఇచ్చే నజరానాకు తోడు..తెలంగాణా ప్రభుత్వం సైతం తనవంతుగా 2 కోట్ల రూపాయలు ప్రోత్సాహక బహుమతిగా అందచేసింది.

తెలుగు తొలి మహిళా బాక్సర్ నిఖత్..

ప్రపంచ సీనియర్ బాక్సింగ్ లో స్వర్ణపతకం సాధించిన భారత ఐదవ మహిళగా, తెలుగు రాష్ట్ర్రాల తొలి యువతిగా నిఖత్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ బాక్సింగ్ టోర్నీలలో మేరీకోమ్ మాత్రమే 2002,2005,06, 08, 10, 18) ఆరుసార్లు బంగారు పతకాలు గెలుచుకొంది.

2006 ప్రపంచకప్ లో సరితాదేవి, జెన్నీ ,లేఖ కేసీ బంగారు పతకాలు నెగ్గగా..2022 టోర్నీ ద్వారా నిఖత్ జరీన్ వారి సరసన నిలువగలిగింది.

ప్రస్తుతం విశ్వవిఖ్యాత క్రీడాపరికరాల సంస్థ ‘అడిడాస్‌’కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా 2018 నుంచి వ్యవహరిస్తున్న నిఖత్ జరీన్ కు ప్రస్తుత ప్రపంచ టైటిల్ తో వివిధ రూపాలలో కాసులవర్షం కురువనుంది.

ప్రపంచ చాంపియన్ హోదాలో ..మరో ఏడాదిలో పారిస్ వేదికగా జరిగే 2024 ఒలింపిక్స్ లో పతకం సాధించడమే లక్ష్యంగా నిఖత్ జరీన్..50 కేజీలు లేదా 54 కేజీల విభాగాలలో..ఏదో ఒక తరగతిలో తలపడాల్సి ఉంది.

జూబ్లీహిల్స్ లో 600 గజాల ఇంటిస్థలం...

తెలంగాణా రాష్ట్ర్రానికే గర్వకారణంగా నిలిచిన యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రపంచ బాక్సింగ్‌ టైటిల్ గెలిచినందుకు ప్రోత్సాహకంగా 600 గజాల ఇంటిస్థలాన్ని కేటాయించింది.

హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో నిఖత్ జరీన్ తండ్రి జమీల్ అహ్మద్ కు తెలంగాణా క్రీడామంత్రి శ్రీనివాస్ గౌడ్ 600 గజాల ఇంటిస్థలం కేటాయించిన పత్రాలను అందచేశారు.

వచ్చే నెలలో ఢిల్లీ వేదికగా జరుగనున్న ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ కోసం సిద్ధమవుతున్న నేపథ్యంలో నిఖత్‌ అందుబాటులో లేకపోడంతో..ఆమె తరఫున తండ్రి జమీల్‌ పత్రాలు స్వీకరించారు.

త్వరలోనే డీఎస్పీ ఉద్యోగ నియామకం..

గతంలో నిఖత్ జరీన్ కు ముఖ్యమంత్రి కెసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే రెండు కోట్ల నగదు బహుమతి, 600 గజాల ఇంటిస్థలం పత్రాలు అందచేశామని, త్వరలోనే గ్రూపు-1 పోస్ట్‌ అయిన డీఎస్పీ ఉద్యోగానికి సంబంధించిన నియామక పత్రాన్ని అందచేయనున్నట్లు రాష్ట్ర్ర క్రీడామంత్రి ప్రకటించారు.

‘నిఖత్‌ ప్రతిభను గుర్తిస్తూ సీఎం కేసీఆర్‌ తన నివాసానికి పిలిచి మరీ భోజనం పెట్టి ఆదరించడం తాము జీవితాంతం గుర్తుంచుకొంటామని, 2 కోట్ల రూపాయల చెక్కు, 600 గజాల ఇంటిస్థలం పత్రాలు ఇవ్వటం, డీఎస్పీ ఉద్యోగపత్రాలు త్వరలో ఇస్తామనటం తమ అదృష్టమని నిఖత్ తండ్రి పొంగిపోతూ చెప్పారు.

2023 ప్రపంచ బాక్సింగ్, 2024 పారిస్ ఒలింపిక్స్ బంగారు పతకాలు సాధించగలిగితే..నిఖత్ జరీన్ కెరియర్ ఓ బాక్సర్ గా సార్థకమైనట్లే అవుతుంది.

First Published:  21 Feb 2023 7:49 AM GMT
Next Story