Telugu Global
Sports

బంగారు బాక్సర్ నిఖత్ జరీన్.. 2022లో గోల్డెన్ హ్యాట్రిక్

2018 ప్రపంచ బాక్సింగ్‌లో మేరీకోమ్ బంగారు పతకం నెగ్గిన తరువాత భారత్‌కు మరో ప్రపంచ బాక్సింగ్‌లో స్వర్ణం అందించిన ఘనతను నిఖత్ జరీన్ సొంతం చేసుకొంది.

బంగారు బాక్సర్ నిఖత్ జరీన్.. 2022లో గోల్డెన్ హ్యాట్రిక్
X

భారత మహిళా బాక్సింగ్ అనగానే మణిపూర్‌ను, మేరీకోమ్‌ను గుర్తుకు తెచ్చుకొనే రోజులు పోయాయి. మేరీకోమ్‌కు అసలు సిసలు వారసురాలిగా తెలుగు రాష్ట్రాల ఏకైక బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ వేదికను తాకింది. 2022 ప్రపంచ మహిళా బాక్సింగ్ టైటిల్‌తో పాటు స్వర్ణ పతకంతో సరికొత్త చరిత్రకు తెరతీసింది. టర్కీలోని అంటాలియా వేదికగా ముగిసిన 2022 ప్రపంచ మహిళా బాక్సింగ్ 52 కిలోల విభాగం టైటిల్ సమరంలో తెలుగు రాష్ట్రాల బాక్సింగ్ స్టార్ నిఖత్ జరీన్ 5-0తో థాయ్ లాండ్ బాక్సర్ జిట్ పాంగ్ జుటామాస్‌ను చిత్తు చేయడం ద్వారా విశ్వవిజేతగా బంగారు పతకం అందుకొంది. ప్రస్తుత ప్రపంచ టోర్నీలో భారత్ సాధించిన ఒకే ఒక బంగారు పతకం నిఖత్ సాధించినదే కావడం విశేషం. 2018 ప్రపంచ బాక్సింగ్‌లో మేరీకోమ్ బంగారు పతకం నెగ్గిన తరువాత భారత్‌కు మరో ప్రపంచ బాక్సింగ్ స్వర్ణం అందించిన ఘనతను నిఖత్ జరీన్ సొంతం చేసుకొంది.

కష్టాలను అధిగమించి.....

తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌లోని ఓ దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి భారత మహిళా బాక్సింగ్ లోకి దూసుకొచ్చిన నిఖత్ జరీన్ ప్రపంచ టైటిల్ విజయం వెనుక.. గత పుష్కరకాలంగా తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్ల ప్రేరణ, ప్రోత్సాహం ఎంతో ఉంది. నిజామాబాద్‌లోని ఖలీల్ వాడీ ప్రాంతంలోని ఎండీ జమీల్‌ అహ్మద్‌, పర్వీన్‌ సుల్తానా దంపతుల కుటుంబానికి చెందిన నిఖత్ తన కెరియర్‌ను అథ్లెట్‌గా మొదలు పెట్టి..13 సంవత్సరాల వయసులో బాక్సింగ్ రింగ్ లోకి అడుగుపెట్టింది. భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ స్ఫూర్తితో నిఖత్ సాధన మొదలుపెట్టింది. బాక్సింగ్‌లో అసలు సిసలు చాంపియన్‌గా నిలవాలనే తపనతో నిరంతర శ్రమతో రాటు దేలింది.హైదరాబాద్‌లోని ఏవీ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో జలంధర్‌లో జరిగిన ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. 2011లో జరిగిన యువజన జూనియర్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీలో స్వర్ణం సాధించింది. అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూసింది లేదు.

మేరీకోమ్‌నే ఢీ కొన్న నిఖత్...

బాక్సర్‌గా మారటంలో తనకు ప్రేరణగా నిలిచిన మేరీకోమ్‌కే నిఖత్ సవాలు విసరడం ద్వారా అవమానం, పరాజయం ఎదుర్కొంది. టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనే భారత జట్టులో చోటు కోసం దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్‌కే నిఖత్ జరీన్ సవాలు విసరాల్సి వచ్చింది. ఇద్దరిలో నెగ్గినవారికి మాత్రమే ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం ఉండడంతో అర్హత బౌట్‌ను నిర్వహించాల్సి వచ్చింది.

మరోవైపు టోక్యో ఒలింపిక్స్ జట్టులో తనకు నేరుగా అవకాశమివ్వాలని, తనతో తలపడటానికి నిఖత్ జరీన్ ఎవరంటూ మేరీకోమ్ ప్రశ్నించింది. నిఖత్ జరీన్ ఉనికినే మేరీకోమ్ ప్రశ్నించింది. అయితే నిబంధనల ప్రకారం చాలెంజర్ నిఖత్‌తో మేరీ కోమ్ తలపడక తప్పలేదు. ఆ పోరులో నిఖత్‌ను మేరీకోమ్ అలవోకగా ఓడించడమే కాదు..చివరకు కరచాలనం చేయకుండా నిలవటంతో నిఖత్ అవమానకరంగా వైదొలగాల్సి వచ్చింది. అంతేకాదు.. అప్పట్లో అదో వివాదంగా, ఆ వివాదానికి నిఖత్ కేంద్ర బిందువుగా నిలిచిపోడం చర్చనీయాంశమైంది. దిగ్గజ బాక్సర్‌తో తలపడేందుకు నిఖత్ సాహసించిందంటూ నిఖత్‌పై పలురకాలుగా విమర్శలు వచ్చాయి.

తొలి తెలుగు బాక్సర్ నిఖత్..

టోక్యో ఒలింపిక్స్ కు ముందే మేరీకోమ్ చేతిలో ఎదురైన పరాజయం, అవమానాలను, గాయాలను అధిగమించిన నిఖత్ జరీన్ బల్గేరియా వేదికగా 2019లో ముగిసిన 73వ స్ట్రాంజా స్మారక బాక్సింగ్‌ టోర్నీలో స్వర్ణ పతకం సాధించడం ద్వారా పడిలేచిన కెరటంలా మరోసారి దూసుకొచ్చింది. టర్కీ వేదికగానే ముగిసిన 2011 ప్రపంచ జూనియర్‌ టోర్నీలో తొలిసారిగా నిఖత్ బంగారు పతకం సాధించింది. ఆ విజయం ద్వారానే జాతీయ బాక్సింగ్‌లో నిఖత్ నిలబడగలిగింది. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ఆర్థిక సహకారం అందించడంతో ఆమె ఆటకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. అదే జోరులో యూత్‌ బాక్సింగ్‌లో రజతం, నేషన్స్‌ కప్, థాయిలాండ్‌ ఓపెన్ టోర్నీలలో పతకాలు సాధించింది.

అంతేకాదు...ప్రపంచ సీనియర్ బాక్సింగ్ లో స్వర్ణ పతకం సాధించిన భారత ఐదవ మహిళగా, తెలుగు రాష్ట్రాల‌ తొలి యువతిగా రికార్డుల్లో చేరింది. ప్రపంచ బాక్సింగ్ టోర్నీలలో మేరీకోమ్ మాత్రమే (2002, 05, 06, 08, 10, 18) ఆరు సార్లు బంగారు పతకాలు గెలుచుకొంది. 2006 ప్రపంచకప్ లో సరితాదేవి, జెన్నీ, లేఖ కేసీ బంగారు పతకాలు నెగ్గగా..2022 టోర్నీ ద్వారా నిఖత్ వారి సరసన నిలువగలిగింది. ప్రస్తుతం విశ్వవిఖ్యాత క్రీడాపరికరాల సంస్థ 'అడిడాస్‌'కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా 2018 నుంచి వ్యవహరిస్తున్న నిఖత్‌కు ప్రస్తుత ప్రపంచ టైటిల్‌తో వివిధ రూపాలలో కాసుల వర్షం కురువనుంది.

ప్రపంచ చాంపియన్ హోదాలో ..మరో రెండేళ్లలో పారిస్ వేదికగా జరిగే 2024 ఒలింపిక్స్ లో పతకం సాధించడమే లక్ష్యంగా నిఖత్ జరీన్..50 కేజీలు లేదా 54 కేజీల విభాగాలలో..ఏదో ఒక తరగతిలో తలపడాల్సి ఉంది. బాక్సింగ్ నేపథ్యం, విజేతల పరంపర ఏమాత్రం లేని తెలంగాణ రాష్ట్రం నుంచి అంతర్జాతీయ మహిళా బాక్సింగ్‌లోకి దూసుకొచ్చిన నిఖత్ జరీన్ తెలుగు రాష్ట్రాల‌కే గర్వకారణంగా నిలిచిపోతుంది.

First Published:  8 Aug 2022 4:00 AM GMT
Next Story