Telugu Global
Sports

ఆసియాక్రీడల హాకీ విజేత భారత్!

హాంగ్జు ఆసియాక్రీడల హాకీ బంగారు పతకాన్ని 9 ఏళ్ల విరామం తర్వాత భారత్ గెలుచుకొంది. ఫైనల్లో గత క్రీడల విజేత జపాన్ ను 5-1 గోల్స్ తో చిత్తు చేయడం ద్వారా పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకొంది.

ఆసియాక్రీడల హాకీ విజేత భారత్!
X

హాంగ్జు ఆసియాక్రీడల హాకీ బంగారు పతకాన్ని 9 ఏళ్ల విరామం తర్వాత భారత్ గెలుచుకొంది. ఫైనల్లో గత క్రీడల విజేత జపాన్ ను 5-1 గోల్స్ తో చిత్తు చేయడం ద్వారా పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకొంది......

ఆసియాక్రీడల హాకీ స్వర్ణపతకాన్ని ప్రపంచ మూడో ర్యాంక్ జట్టు భారత్ నాలుగోసారి గెలుచుకొంది. చైనాలోని హాంగ్జు వేదికగా జరిగిన 19వ ఆసియాక్రీడల ఫైనల్లో భారత్ తిరుగులేని విజయం సాధించింది.

2014 తర్వాత తిరిగి స్వర్ణ విజేతగా...

ఒలింపిక్స్ హాకీ చరిత్రలో ఎనిమిదిసార్లు బంగారు పతకాలు సాధించిన భారత్..ఆసియాక్రీడల్లో మాత్రం 2014 వరకూ మూడుసార్లు మాత్రమే విజేతగా నిలువగలిగింది.

అంతర్జాతీయ హాకీలో గత మూడేళ్లుగా అత్యంత నిలకడగా రాణిస్తూ 3వ ర్యాంక్ కు చేరిన భారత జట్టు ప్రస్తుత ఆసియాక్రీడల్లో స్థాయికి తగ్గట్టుగా రాణించింది.

పూల్ - ఏ లీగ్ నుంచి నాకౌట్ ఫైనల్ వరకూ భారీ విజయాలు నమోదు చేయగలిగింది.

సెమీఫైనల్లో దక్షిణ కొరియాను 5-3 గోల్స్ తో ఓడించిన భారత్ కు ..బంగారు పతకం పోరులో ఎదురేలేకపోయింది.ఆట రెండో క్వార్టర్ ప్రారంభానికే 3-0 గోల్స్ తో జపాన్ పై తిరుగులేని ఆధిక్యం సంపాదించిన భారత్ ఆ తర్వాత ప్రత్యర్థికి ఓ గోలు ఇచ్చినా...ఆఖరి క్వార్టర్ గోలుతో 5-1తో విజేతగా స్వర్ణపతం అందుకొంది.

ఆట మొదటి క్వార్టర్ 15వ నిముషంలో సుర్జీత్ సింగ్ భారత్ కు తొలిగోలు అందించాడు. ఆ తర్వాత మన్ ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ ద్వారా రెండోగోలు సాధించాడు. అమిత్ రోహిదాస్ మూడో గోలు సాధించడం ద్వారా భారత్ దూకుడు కొనసాగించింది. ఆట 4వ క్వార్టర్ లో భారత్ ఆధిక్యాన్ని అభిషేక్ 4-0కు పెంచాడు.

జపాన్ తరపున సెరెనా తనాకా గోల్ నమోదు చేశాడు. ఆట ముగిసే క్షణాలలో లభించిన పెనాల్టీ కార్నర్ ను హర్మన్ ప్రీత్ గోలుగా మలచడం ద్వారా 5-1తో విజయం పూర్తి చేశాడు.

1966 నుంచి 2023 వరకూ...

1951 నుంచి భారత్ ఆసియాక్రీడల్లో పాల్గొంటూ వచ్చినా..ప్రస్తుత 2023 గేమ్స్ వరకూ నాలుగుసార్లు మాత్రమే చాంపియన్ గా నిలువగలిగింది. 1966లో తొలిసారిగా ఆసియాక్రీడల బంగారు పతకం సాధించిన భారత్ ఆ తర్వాత 1998, 2014 గేమ్స్ లో సైతం స్వర్ణాలు సాధించింది.

2018 జకార్తా ఆసియాక్రీడల్లో కాంస్య పతకానికి మాత్రమే పరిమితమైన భారత్ కేవలం నాలుగేళ్ల విరామం లోనే తిరిగి బంగారు పతకం అందుకోగలిగింది.

ఆసియాక్రీడల హాకీ చరిత్రలో పాకిస్థాన్ అత్యధికంగా 9సార్లు బంగారు పతకాలు సాధిస్తే...దక్షిణ కొరియా, భారత్ చెరో నాలుగుసార్లు స్వర్ణాలు సాధించడం ద్వారా ఆ తర్వాతి స్థానంలో నిలువగలిగాయి.

పారిస్ ఒలింపిక్స్ కు అర్హత...

భారత జట్టు హాంగ్జు ఆసియా క్రీడల విజేతగా నిలవడం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టినట్లయ్యింది. ఆసియాక్రీడల విజేతగా నిలవడం ద్వారా వచ్చే ఏడాది పారిస్ వేదికగా జరిగే 2024 ఒలింపిక్స్ కు నేరుగా అర్హత సంపాదించగలిగింది.

First Published:  6 Oct 2023 1:26 PM GMT
Next Story