Telugu Global
Sports

ఆల్ -ఇంగ్లండ్ సెమీస్ లో భారత యువజోడీ!

ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ టోర్నీ ఆల్ -ఇంగ్లండ్ ఓపెన్ మహిళల డబుల్స్ సెమీఫైనల్స్ కు భారత యువజోడీ గాయత్రీ గోపీచంద్- ట్రిసా జోలీ వరుసగా రెండోసారి చేరి సంచలనం సృష్టించారు.

All England Open 2023: గాయత్రీ గోపీచంద్- ట్రిసా జోలీ
X

All England Open 2023: ఆల్ -ఇంగ్లండ్ సెమీస్ లో భారత యువజోడీ!

2023 ఆల్ -ఇంగ్లండ్ ఓపెన్ మహిళల డబుల్స్ సెమీస్ కు భారత యువజోడీ గాయత్రీ- ట్రిసా వరుసగా రెండోసారి చేరి సంచలనం సృష్టించారు.

ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ టోర్నీ ఆల్ -ఇంగ్లండ్ ఓపెన్ మహిళల డబుల్స్ సెమీఫైనల్స్ కు భారత యువజోడీ గాయత్రీ గోపీచంద్- ట్రిసా జోలీ వరుసగా రెండోసారి చేరి సంచలనం సృష్టించారు.

ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న 112వ ఆల్-ఇంగ్లండ్ ఓపెన్ టోర్నీ పురుషుల, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్ విభాగాలలో

భారత క్రీడాకారుల పోటీ ఇప్పటికే ముగిసినా...మహిళల డబుల్స్ రేసులో మాత్రం యువజోడీ గాయత్రీ గోపీచంద్- ట్రీసా జోలీ మిగలడం ద్వారా పతకం ఆశల్ని సజీవంగా నిలుపగలిగారు.

క్వార్టర్ ఫైనల్లో సంచలనం...

గత ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ఫైనల్స్ కు తొలిసారిగా చేరుకొని నిష్క్ర్రమించిన 20 సంవత్సరాల గాయత్రీ- 19 ఏళ్ళ ట్రీసా జోడీ..2023 టోర్నీ బరిలోకి 17వ ర్యాంక్ జట్టుగా దిగటమే కాదు...తొలిరౌండ్ నుంచి క్వార్టర్ ఫైనల్స్ వరకూ సంచలన విజయాలతో పతకం రౌండ్ కు చేరువయ్యారు.

64 నిముషాలపాటు ..మూడు గేమ్ లు గా సాగిన క్వార్టర్ ఫైనల్ పోరులో చైనాకు చెందిన లీ వెన్ మీ-లియూ జున్ జున్ పై 21-14, 18-21, 21-12 విజయం సాధించారు.

ఆల్ -ఇంగ్లండ్ మహిళల డబుల్స్ సెమీస్ కు వరుసగా రెండుసార్లు చేరిన తొలి భారత జోడీగా గాయత్రీ-ట్రీసా నిలిచారు.

ఫైనల్లో చోటు కోసం జరిగే సెమీస్ పోరులో ఇండోనీసియాకు చెందిన అప్రియానీ రహాయు- సిటీ ఫాదియా సిల్వా రామదంతీ జోడీ ..లేదా కొరియాకు చెందిన బాక్ హా నా- లీ సూ హీ జోడీలలో ఎవరో ఒకరితో తలపడనున్నారు.

గాయత్రీ జోడీ అరుదైన విజయాలు..

కామన్వెల్త్ గేమ్స్ మహిళల డబుల్స్ కాంస్య పతకంతో పాటు...ఆసియా మిక్సిడ్ టీమ్ చాంపియన్షిప్ పోరులోను విజేతలుగా నిలవడం ద్వారా గాయత్రీ- ట్రీసా అత్యంత ప్రమాదకరమైన డబుల్స్ జంటగా గుర్తింపు తెచ్చుకొన్నారు.

ప్రస్తుత ఆల్ - ఇంగ్లండ్ మహిళల డబుల్స్ తొలిరౌండ్లో థాయ్ లాండ్ కు చెందిన 7వ ర్యాంక్ జోడీ జోంగ్ కోల్పాన్- రవీంద్ర ప్రజోంగ్ జై జోడీపైన తొలివిజయం సాధించిన భారత జోడీ...ప్రీ-క్వార్టర్ ఫైనల్లో జపాన్ కు చెందిన ప్రపంచ మాజీ నంబర్ వన్ జోడీ యుకీ ఫుకుషిమా- సయాకా హిరోటాలను అధిగమించడం ద్వారా క్వార్టర్స్ కు అర్హత సాధించగలిగారు.

గాయత్రీ నెట్ గేమ్ లనూ, ట్రీసా బ్యాక్ కోర్టు గేమ్ లోనూ రాణించడం ద్వారా వరుస విజయాలు నమోదు చేయగలిగారు. గతంలో గుత్తా జ్వాలా- అశ్వని అత్యుత్తమ భారత మహిళల డబుల్స్ జోడీగా గుర్తింపు సంపాదించగా..ఇప్పుడు గాయత్రీ- ట్రీసా జోడీ సైతం అదేస్థాయి గుర్తింపు కోసం పోరాడుతున్నారు.

భారత బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్ లో ప్రస్తుత అత్యుత్తమజంట గాయత్రీ- ట్రీసా సెమీస్ లో సైతం నెగ్గితే ఏదో ఒక పతకం ఖాయం చేసుకోగలుగుతారు.

ఆల్ -ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చరిత్రలో ఇప్పటి వరకూ పురుషుల సింగిల్స్ లో ప్రకాశ్ పడుకోన్ ( 1980 ), పుల్లెల గోపీచంద్ (2000 )లకు మాత్రమే టైటిల్స్ సాధించిన ఘనత ఉంది.

మహిళల సింగిల్స్ లో సైనా నెహ్వాల్ అత్య్తుత్తమంగా రజత పతకం సాధించగలిగింది.



First Published:  18 March 2023 8:21 AM GMT
Next Story