Telugu Global
Science and Technology

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన . జీఎస్ఎల్వీ ఎఫ్14

ఇన్‌శాట్‌-3డీఎస్‌ అనే కొత్త వెదర్‌ శాటిలైట్‌ను ప్రయోగించింది.ఈ ఉపగ్రహాన్ని మోసుకొని ఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌ 14 నింగిలోకి దూసుకెళ్లింది.

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన . జీఎస్ఎల్వీ ఎఫ్14
X

మరో కీలకమైన ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. ఇన్‌శాట్‌-3డీఎస్‌ అనే కొత్త వెదర్‌ శాటిలైట్‌ను ప్రయోగించింది.ఈ ఉపగ్రహాన్ని మోసుకొని ఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌ 14 నింగిలోకి దూసుకెళ్లింది. గతంలో ప్రయోగించిన ఇన్‌శాట్ 3 డీ, ఇన్‌శాట్ 3 డీఆర్‌ ఉపగ్రహాలకు కొనసాగింపుగానే ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. నిర్ణయించిన ప్రకారం ఈ సాయంత్రం 5.35 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్-షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు.

దాదాపు 2,275 కిలోల బరువైన ఇన్‌శాట్ 3డీఎస్ ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్లున్నాయి.. శాటిలైట్ విజయవంతంగా కక్షలోకి చేరడంతో శాస్త్రవేత్తలు, సిబ్బందిని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ అభినందించారు. వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక కోసం భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ సంబంధించిన పూర్తి సమాచారాన్ని భూమికి పంపించేందుకు ఈ ఇన్సాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపించింది. తుఫానులు, భూకంపాలు, పిడుగులు, సునామీలను ఇవి ఖచ్చితంగా అంచనా వేస్తాయి. దీని వల్ల భారత్ మరింత అప్రమత్తంగా రైతులకు వాతావరణ సమాచారాన్ని అందించే వీలు కలుగుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రయోగానికి రూ.500 కోట్లకు పైగానే ఖర్చయినట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి.

ఈ నిధులను కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ సమకూర్చింది. భూమి నుంచి 3,67,866 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న జియో స్టేషనరీ కక్ష్యలో ఈ ఇన్సాట్-3డీఎస్ శాటిలైట్‌ను జీఎస్ఎల్వీ-ఎఫ్14 ప్రవేశపెట్టనుంది. ఆ తర్వాత ఇన్సాట్ 3డీఎస్ ఉపగ్రహం రాకెట్ నుంచి విడిపోయి అంతరిక్షంలోని భూకక్ష్యలోకి చేరుతుంది. ఈ ఉపగ్రహం ఐదు నుంచి పది సంవత్సరాలు పనిచేస్తుంది.

మరోవైపు ఇస్రో గతంలో పంపించిన ఓ ఉపగ్రహాన్ని దాని కక్ష్య నుంచి భూ కక్ష్యలోకి తీసుకువచ్చి.. ఆపై హిందూ మహాసముద్రంలో పడేసింది. అంతరిక్షంలోని వివిధ కక్ష్యల్లో పెరిగిపోతున్న పాత ఉపగ్రహాలను తొలగించే ప్రక్రియలో భాగంగా దాదాపు 17 ఏళ్ల క్రితం ప్రయోగించిన కార్టోశాట్-2 శాటిలైట్‌ను తాజాగా భూ వాతావరణంలోకి తీసుకువచ్చి.. అక్కడి నుంచి హిందూ మహా సముద్రంలో పడేలా చేసింది. ఈ నెల 14 వ తేదీ మధ్యాహ్నం 3.48 గంటలకు ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయ్యిందని ఇస్రో తాజాగా వెల్లడించింది.

First Published:  17 Feb 2024 1:22 PM GMT
Next Story