భయపెడుతున్న బాస్ స్కామ్!
Boss Scam Cyber Fraud: తాజాగా తమిళనాడులో కొత్త తరహా సైబర్ స్కామ్ అందర్నీ కలవరపెడుతోంది. ఉన్నతాధికారుల పేరుతో జరిగే ఈ మోసానికి ‘బాస్ స్కామ్’ అని పేరు పెట్టారు.
![Boss Scam Cyber Fraud in Tamil Nadu Boss Scam Cyber Fraud in Tamil Nadu](https://www.teluguglobal.com/h-upload/2023/01/07/434297-boss-scam.webp)
భయపెడుతున్న బాస్ స్కామ్!
సైబర్ క్రైమ్స్లో రోజుకో రకం పుట్టుకొస్తుంది. తాజాగా తమిళనాడులో కొత్త తరహా సైబర్ స్కామ్ అందర్నీ కలవరపెడుతోంది. ఉన్నతాధికారుల పేరుతో జరిగే ఈ మోసానికి ‘బాస్ స్కామ్’ అని పేరు పెట్టారు. చాలామంది ప్రముఖులు ఈ స్కామ్ బారిన పడడంతో ఉన్నట్టుండి ఇది వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్ ఎలా ఉంటుందంటే...
ఆఫీసులో పని చేసే ఉద్యోగికి వాళ్ల ఉన్నతాధికారుల నుంచి ఫోన్ వస్తుంది. అందులో మాట్లాడే అధికారి... ‘నేను మీటింగ్లో ఉన్నాను, వెంటనే నాకు గిఫ్ట్ కూపన్స్ కావాలి, రూ.10 వేల విలువైన 10 కూపన్లు పంపు, తర్వాత నేను డబ్బులు ఇస్తాను’ అని చెప్తారు.
ఆ మాట నమ్మిన ఉద్యోగి ‘కూపన్స్ ఎలా పంపాలో తెలియదు’ అని చెప్తే.. అవతలి వ్యక్తి వెంటనే ఓ లింక్ పంపుతాడు. ఆ ఉద్యోగి లింక్పై క్లిక్ చేసి రూ.లక్షకు 10 కూపన్లు తీసి పంపుతాడు. వివరాలు అడుగుదామంటే అవతలి వ్యక్తి మనకు మాట్లాడే అవకాశం ఇవ్వడు.
కూపన్లు పంపేవరకు వరుసగా మెసేజ్లు పంపుతూ ఉంటాడు. కూపన్లు పంపిన తర్వాత నిజమనుకున్న అధికారికి ఫోన్ చేసి అడగడంతో అసలు విషయం బయటపడుతుంది. ఈలోగా గిఫ్ట్ కూపన్ గడువు ముగుస్తుంది. కూపన్ ఉపయోగించి వస్తువులు తీసుకునే అడ్రెస్ కూడా ఫేక్ ఉంటుంది.
తమిళనాడులో ఇంతవరకు 20 మంది పోలీసు అధికారులతో సహా 80 మంది ప్రముఖుల పేర్లతో ఈ తరహా మోసాలు జరిగాయని, అందులో లక్షల రూపాయలు మోసం జరిగినట్లు సైబర్ నిపుణులు చెప్తున్నారు.
ఈ మోసానికి పాల్పడే నేరగాళ్లు ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రుల వివరాలు ప్రభుత్వ వెబ్సైట్స్లో పొందుతారు. సోషల్ మీడియా ద్వారా వారి ఫొటోలు సేకరింస్తారు. సైబర్ నేరాల గురించి అవగాహన ఉంటే వీటి నుంచి తప్పించుకోవచ్చు. ఒకరి పేరుతో కూపన్ కొని మరొక వ్యక్తికి పంపేటప్పుడు దాన్ని సరిచూసుకోవాలి. షాపింగ్ సైట్లలో కూపన్స్ తీసుకోవాలనుకుంటే సదరు సైట్ ద్వారా తీసుకోవాలే తప్ప లింక్లు ఓపెన్ చేయకూడదు.