Telugu Global
Science and Technology

ఆండ్రాయిడ్ కి పోటీగా భారత్ ఓఎస్ - భారోస్

భారత్ ఓఎస్.. సింపుల్ గా భారోస్ అనే పేరు పెట్టారు. ప్రస్తుతం ఎంపిక చేసిన సంస్థలు మాత్రమే దీన్ని వినియోగిస్తున్నాయి. ఆ తర్వాత జన సామాన్యంలోకి వస్తుంది.

BharOS Service: ఆండ్రాయిడ్ కి పోటీగా భారత్ ఓఎస్ - భారోస్
X

ఆండ్రాయిడ్ కి పోటీగా భారత్ ఓఎస్ - భారోస్

మనం వాడే మొబైల్ ఫోన్లు మనవే అయినా దానిలోని సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ అంతా విదేశాలదే. మేకిన్ ఇండియా అని మనం ఎంత గింజుకున్నా.. విడి భాగాలు తీసుకొచ్చి అసెంబుల్ చేసుకొని వాడుకోవడమే మనకు తెలిసింది. అయితే ఇప్పుడు సెల్ ఫోన్లలో వాడే ఆపరేటింగ్ సిస్టమ్ ని ఐఐటీ మద్రాస్ తయారు చేసింది. దీనికి భారత్ ఓఎస్.. సింపుల్ గా భారోస్ అనే పేరు పెట్టారు. అయితే ఇప్పుడే ఇది మన మొబైల్ ఫోన్లలోకి రాదు, ప్రస్తుతం ఎంపిక చేసిన సంస్థలు మాత్రమే దీన్ని వినియోగిస్తున్నాయి. ఆ తర్వాత జన సామాన్యంలోకి వస్తుంది.


అర్జెంట్ గా గూగుల్ ఆగిపోతే పరిస్థితి ఏంటి..? వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా యాప్ లు పనిచేయడం మానేస్తే మనం ఏం చేయాలి..? కొన్ని కొన్ని సార్లు కొన్ని నిమిషాల సేపు ఆయా సాఫ్ట్ వేర్లు కాస్త ఇబ్బంది పెడితే మనం కంగారుపడిపోతాం. అలాంటి టైమ్ లోనే కూ యాప్, స్వదేశీ టెలిగ్రామ్ యాప్ లు చర్చకు వస్తాయి. కానీ ఆ తర్వాత చప్పబడిపోతాయి. సెల్ ఫోన్లలో వినియోగించే ఆండ్రాయిడ్ ఓఎస్ విషయంలో కూడా ఇదే చర్చ చాన్నాళ్ల క్రితమే మొదలైంది. కంప్యూటర్లకు ఆపరేటింగ్ సిస్టమ్ ని ఇవ్వగలిగిన మైక్రోసాఫ్ట్ నోకియాతో ఒప్పందం చేసుకుని ఓ ప్రయోగం చేసింది. కానీ అది సక్సెస్ కాలేదు. ఆపిల్ ఫోన్ కి సెపరేట్ ఓఎస్ ఉంటుంది కానీ సెక్యూరిటీ ఫీచర్ల పేరుతో అది ఆ కంపెనీ ఫోన్లకే పరిమితమైంది. కానీ అన్ని ఫోన్లకు పనికొచ్చే స్వదేశీ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం ఐఐటీ మద్రాస్ ప్రయోగాలు మొదలు పెట్టింది.

కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ నిధులతో ప్రాజెక్ట్ చేపట్టింది. సరికొత్త సాఫ్ట్‌ వేర్‌ తయారు చేసినట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా 100 కోట్ల మొబైల్‌ వినియోగదారుల సమాచారం భద్రంగా ఉండేలా, సౌకర్యంగా వినియోగించుకునేలా ఇది ఉంటుందని ఐఐటీ మద్రాస్ ప్రకటించింది. ఐఐటీ మద్రాస్‌ ఇంక్యుబేటర్‌ కు చెందిన జండ్‌-కె ఆపరేటింగ్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ (జండ్‌ కాప్స్‌) సంస్థ దీన్ని రూపొందించింది. ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ వి.కామకోటి భారోస్ వివరాలు వెల్లడించారు. ఈ భారోస్ ఓఎస్‌ ను ప్రస్తుతానికి ఎంపిక చేసిన సంస్థలకే ఇచ్చామని, త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ ఓఎస్‌ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని అత్యంత భద్రంగా ఉంచుతుందని తెలిపారు జండ్‌ కాప్స్‌ సంస్థ డైరెక్టర్‌ కార్తీక్‌ అయ్యర్‌.

First Published:  20 Jan 2023 6:47 AM GMT
Next Story