Telugu Global
NEWS

అవును.. నిన్న చనిపోయాను, ఇవాళ బతికాను

పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్‌తో చనిపోయినట్టు నిన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్త నిన్న సంచలనాన్ని రేపింది. క్షణాల్లోనే వార్త వైరల్ అయింది.

అవును.. నిన్న చనిపోయాను, ఇవాళ బతికాను
X

బాలీవుడ్ నటి, పోర్న్ స్టార్ పూనమ్‌ పాండే బతికే ఉంది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తానే స్వయంగా ప్రకటించింది. ఆమె మరణ వార్తలు వచ్చిన ఒకరోజు తర్వాత పూనం పాండే అందరి ముందుకు వచ్చింది. సర్వైకల్ క్యాన్సర్ కారణంగా తాను చనిపోలేదని పూనమ్ పాండే తెలిపింది. "గర్భాశయ క్యాన్సర్ కారణంగా ఎంతో మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. అందరికీ ఈ మహమ్మారిపై అవగాహన కల్పించాలనే నేను చనిపోయినట్లు అలా పోస్ట్ చేశాను. నా మరణ వార్తతో బాధపడిన, ఇబ్బంది పడిన అందరికీ క్షమాపణలు చెపుతున్నా" అంటూ ఇన్‌స్టాలో వీడియో పోస్ట్ చేసింది పూనమ్ పాండే.

పూనమ్ మృతి కట్టుకథ అని తెలిసినవాళ్లంతా ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఇంకొందరేమో చాలామంచి పనిచేశావ్, నీవల్ల ఆ క్యాన్సర్ మహమ్మారిపై పెద్దఎత్తున చర్చ జరిగిందంటూ మెచ్చుకుంటున్నారు. డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ కూడా పూనమ్‌ను అభినందించారు. పూనమ్‌ నువ్వు సూపర్. నువ్వు చేసిన పనివల్ల గర్భాశయ క్యాన్సర్‌పై పెద్ద ఎత్తున చర్చ జరిగిందని కొనియాడారు.

పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్‌తో చనిపోయినట్టు నిన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్త నిన్న సంచలనాన్ని రేపింది. క్షణాల్లోనే వార్త వైరల్ అయింది. చాలా మంది ఆమె మరణంపై అనుమానాలను కూడా వ్యక్తం చేశారు. 32 ఏళ్ల చిన్న వయసులోనే ఆమె చనిపోవడంపై చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆమె స్వయంగా వివరణ ఇచ్చారు.

ఇక్కడ ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. ఏటా 80వేల మంది గర్భాశయ క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. ఇందులో 35వేల మంది చనిపోతున్నారు. ఈ తరుణంలో క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. మొన్ననే నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గర్భాశయ క్యాన్సర్ పై వ్యాక్సినేషన్ డ్రైవ్ చేస్తామని ప్రకటించారు. గర్భాశయ క్యాన్సర్‌ అనేది భారత్‌లో తీవ్రమైన సమస్యగా మారింది. అందుకే దానిపై అందరిలో అవగాహన కలగాలని పూనమ్ పాండే ఇలా చేసింది. పూనమ్ అనుకున్నదైతే జరిగింది. కొందరు తిట్టుకున్నా గర్భాశయ క్యాన్సర్‌పై చర్చ గట్టిగానే జరుగుతోంది.

First Published:  3 Feb 2024 9:38 AM GMT
Next Story