Telugu Global
NEWS

కొత్తవాళ్లకు లేట్‌గా పేమెంట్! యూపీఐలో కొత్త రూల్!

కొత్త వ్యక్తులకు లేదా సంస్థలకు మొదటిసారి రూ.2,000 కంటే ఎక్కువ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేస్తే.. ఆ పేమెంట్ నాలుగు గంటల ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉంది. అన్ని డిజిటల్ పేమెంట్ యాప్స్‌కు ఈ రూల్ వర్తించనుంది.

కొత్తవాళ్లకు లేట్‌గా పేమెంట్! యూపీఐలో కొత్త రూల్!
X

యూపీఐ పేమెంట్స్‌కు సంబంధించిన ఓ కొత్త రూల్ త్వరలోనే అమల్లోకి రానుంది. ఈ రూల్‌తో కొంత ఇబ్బంది ఉన్నా.. సైబర్ క్రైమ్స్‌ను అడ్డుకునేందుకు ఈ రూల్ ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇంతకీ ఆ కొత్త మార్పు ఏంటంటే..

ఆన్‌లైన్ మోసాలను తగ్గించేందుకుగానూ ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ)’ ఓ సరికొత్త నిబంధనను అమలుచేయనుంది. కొత్త వ్యక్తులకు లేదా సంస్థలకు మొదటిసారి రూ.2,000 కంటే ఎక్కువ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేస్తే.. ఆ పేమెంట్ నాలుగు గంటల ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉంది. అన్ని డిజిటల్ పేమెంట్ యాప్స్‌కు ఈ రూల్ వర్తించనుంది.

ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌లో జరుగుతున్న మోసాలను నిరోధించడంలో భాగంగా ఇద్దరు వ్యక్తుల మధ్య మొదటి లావాదేవీకి కనీస కాలపరిమితిని ప్రవేశపెట్టాలని ఎన్‌పీసీఐ ప్లాన్ చేస్తోంది. ట్రాన్సాక్షన్ పొరపాటుగా జరిగినప్పుడు లేదా జరిగిన ట్రాన్సాక్షన్ ఫ్రాడ్ అని తేలినప్పుడు వ్యక్తులు నష్టపోకుండా ఉండేందుకు ఈ రూల్ ఉపయోగపడుతుంది.

యూపీఐ పేమెంట్స్‌తో పాటు ఇన్‌స్టంట్ పేమెంట్ సర్వీస్(ఐఎంపీఎస్), రియల్‌టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌‌టీజీఎస్) వంటి పేమెంట్స్‌కు కూడా ఈ రూల్ వర్తించనుంది. తద్వారా ఆన్‌లైన్ మోసగాళ్లు పేమెంట్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకుని వెంటనే అకౌంట్స్ బ్లాక్ చేసుకోవడానికి అవకాశం తగ్గుతుంది. ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే డబ్బు ట్రాన్స్‌ఫర్ అవ్వకుండా కొంతసేపు హోల్డ్‌లో ఉంటుంది. కాబట్టి లావాదేవీలో మోసం ఉందని గమనిస్తే.. యూజర్లు నాలుగు గంటలలోపు ఆయా ట్రాన్సాక్షన్స్‌ను రద్దు చేసుకునే వీలుంటుంది.


First Published:  4 Dec 2023 5:37 PM GMT
Next Story