Telugu Global
National

హిందువుగా ఉన్నంత వరకు నువ్వు అంటరానివాడివే... DMK MP రాజా వ్యాఖ్యలు

తమిళనాడు DMK MP ఏ.రాజా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. హిందువుగా ఉన్నంత వరకు నువ్వు అంటరానివాడివే, వేశ్యకొడుకువే అని ఆయన ఓ సమావేశంలో మాట్లాడారు. సనాతన ధర్మాన్ని బద్దలు కొట్టాలంటే వీటన్నింటినీ ఎదిరించాలి అని రాజా ప్రజలకు పిలుపునిచ్చారు.

హిందువుగా ఉన్నంత వరకు నువ్వు అంటరానివాడివే... DMK MP రాజా వ్యాఖ్యలు
X

ద్రవిడ ఉద్యమానికి పట్టుకొమ్మ అయిన తమిళ నాట హిందూయిజంపై పోరాటం ఈనాటిది కాదు. DMK పార్టీ పుట్టడమే హిందుత్వ వ్యతిరేక ద్రవిడ ఉద్యమంలోంచి పుట్టింది. బతికున్నంత కాలం కరుణా నిధి కానీ, ఇప్పటికీ ఆ పార్టీ నేతలు కానీ హిందుత్వకు వ్యతిరేకంగా గళం విప్పుతూనే ఉంటారు. నిన్న DMK ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి ఏ.రాజా చేసిన వ్యాఖ్యలు హిందుత్వ శక్తులను షేక్ చేశాయి.

తమిళనాడులోని నమక్కల్‌లో జరిగిన పార్టీ కార్యక్రమంలో రాజా మాట్లాడుతూ "నువ్వు హిందువుగా ఉండే వరకు నువ్వు దళితుడివి, నువ్వు శూద్రుడివి, నువ్వు వేశ్య కొడుకువి, అంటరానివాడివి.'' అని వ్యాఖ్యానించారు.

''శూద్రులు హిందువులు కాదా ? వారిని మనుస్మృతి తీవ్రంగా అవమానించింది. వారికి విద్య, ఉద్యోగాల్లో సమానావకాశాలను లేకుండా చేసింది. దేవాలయాల్లోకి రాకుండా నిషేధించింది. మీరింకా అంటరానివారిగా మిగిలిపోవాలనుకుంటున్నారా ? సనాతన ధర్మాన్ని బద్దలు కొట్టాలంటే వీటన్నింటినీ ఎదిరించాలి'' అని రాజా ప్రజలకు పిలుపునిచ్చారు.

రాజా వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాజా ఓ నిర్దిష్ట వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారని ఆరోపి౦చింది. ''రాజా ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో మరో వర్గంపై ద్వేషాన్ని రెచ్చగొట్టారు. ఇలాంటి రాజకీయ నేతల మనస్తత్వం చాలా చాలా దురదృష్టకరం.'' అని తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కె అన్నామలై ట్వీట్ చేశారు.

First Published:  14 Sep 2022 9:49 AM GMT
Next Story