Telugu Global
National

మహిళా కానిస్టేబుల్‌ను హతమార్చిన భర్త - ఇంటికి సమయం కేటాయించడం లేదని ఘాతుకం

ఉద్యోగంలో బిజీగా ఉంటూ ఇంట్లో ఎక్కువ సమయం కేటాయించలేకపోయేది. దీంతో ఈ విషయమై భర్త గజేంద్ర ఆమెతో తరచూ గొడవపడేవాడు. ఆ గొడవ ముదిరి ఆఖరికి ఆమెను హతమార్చాలని నిర్ణయించుకునేవరకు వెళ్లింది.

మహిళా కానిస్టేబుల్‌ను హతమార్చిన భర్త  - ఇంటికి సమయం కేటాయించడం లేదని ఘాతుకం
X

ప్రేమించి పెళ్లిచేసుకున్న వారి మధ్య ఉద్యోగం వివాదాలు రేపింది. అది ముదిరి కానిస్టేబుల్‌ ఉద్యోగం చేస్తున్న భార్యను భర్త హతమార్చేవరకు వెళ్లింది. బిహార్‌ రాష్ట్రంలోని పాట్నాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

జెహనాబాద్‌కు చెందిన గజేంద్ర యాదవ్‌ అనే వ్యక్తి కోచింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. అక్కడ ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీయగా, ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె కూడా ఉంది. ఇటీవల ఆమె కానిస్టేబుల్‌గా ఎంపిక కావడంతో పోలీసు కొలువులో చేరింది.

ఉద్యోగంలో బిజీగా ఉంటూ ఇంట్లో ఎక్కువ సమయం కేటాయించలేకపోయేది. దీంతో ఈ విషయమై భర్త గజేంద్ర ఆమెతో తరచూ గొడవపడేవాడు. ఆ గొడవ ముదిరి ఆఖరికి ఆమెను హతమార్చాలని నిర్ణయించుకునేవరకు వెళ్లింది.

ఈ క్రమంలోనే గజేంద్ర ఓ హోటల్‌లో రూమ్‌ బుక్‌ చేసి భార్యను పిలిచాడు. అక్కడ ఈ విషయమై ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. వివాదం ముదిరి ఆగ్రహానికి గురైన భర్త తుపాకీతో ఆమెను కాల్చి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. మహిళా కానిస్టేబుల్‌ హత్యకు గురైన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు.

First Published:  22 Oct 2023 3:13 PM GMT
Next Story